Friday, September 20, 2024
HomeTrending NewsJogi Counter: పెడన ప్రజలు శాంతికాముకులు: జోగి

Jogi Counter: పెడన ప్రజలు శాంతికాముకులు: జోగి

చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌ మాదిరిగా పార్టీ కేడర్‌ను హింసకు ప్రోత్సహించే మనస్తత్వం తమది కాదని,  దమ్ము, ధైర్యం ఉన్న జగన్‌ నాయకత్వంలో నీతిమంతమైన రాజకీయం నేర్చుకున్న వాళ్లమని పెడన ఎమ్మెల్యే, రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ అన్నారు. “మాకు కుట్రలు, కుతంత్రాలు చేయడం రాదు. కేవలం ప్రజలకు మంచి చేయడం, వారి దగ్గర్నుంచి ఆదరణ పొందడమే మాకు తెలిసిన విద్య.  డెల్టా ప్రాంతమంటే నీకెలా కనిపిస్తున్నారు పవన్‌కళ్యాణ్‌? పెడన నియోజకవర్గం ప్రజలంటే శాంతికాముకులు. అలాంటి వాళ్లు నిన్ను అడ్డుకోవడానికి, నీ సభను చెదరగొట్టడానికి కత్తులు, రాడ్లతో దాడులు చేస్తారని అంటావా? ఆ మాట అనడానికి నీకు నోరెలా వచ్చింది?” అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

వారాహి యాత్రపై దాడి చేసే అవకాశం ఉందంటూ పవన్‌కళ్యాణ్‌ నిస్సిగ్గుగా చేసిన పిచ్చి వ్యాఖ్యలను పెడన ప్రజలు ఇప్పటికే అర్ధం చేసుకున్నారని, నాడు అంగళ్లులో దత్తతండ్రి చంద్రబాబు ఏరకంగా  అల్లర్లు సృష్టించారో, అదే తరహాలో పెడనలో కూడా ఇలాంటి ఘటనలకు పవన్‌  తన పార్టీ కార్యకర్తలను పురి గొల్పుతున్నారని మండిపడ్డారు. వారి దుష్టాలోచన ప్రకారం పెడనలో గొడవలు సృష్టించి, శాంతిభద్రతల సమస్యల్ని లేవనెత్తి కొందరు అమాయక జనసేన కార్యకర్తల్ని గాయపరచాలనే కుట్రపూరిత ఆలోచన పవన్‌ మాటల్లో కనిపిస్తోందని ధ్వజమెత్తారు.

“అనిగడ్డలో సభ ఎటూ అట్టర్‌ఫ్లాప్‌ అయ్యింది కనుక పెడనలోనూ అదే పరిస్థితి ఉంటుందేమోనని ఊహించి జనాల్ని రెచ్చగొట్టే సినిమా స్కెచ్‌ వేస్తున్నావా? లేకపోతే, పెడన నియోజకవర్గ ప్రజలపై ఈ నిందలేంటి? నీ రెచ్చగొట్టే రాజకీయాల్ని పెడనలో చూపించాలనుకుంటే, అది సాధ్యం కాని పని. ఈ విషయం పవన్‌ తెలుసుకోవాలి. రేపు పెడన సభలో తనపై దాడి జరిగే అవకాశం ఉందంటున్న పవన్‌కళ్యాణ్‌.. అందుకు ఆధారాలు ఉంటే చూపించగలరా? ఆ దమ్ము నీకుందా పవన్‌?”  అంటూ ప్రశ్నించారు.

పవన్‌  తన ఆరోపణలను నిరూపించి చూపాలని, అప్పుడు తానే స్వయంగా వచ్చి వీధి వీధి తిరిగి ఆయన మీద చిన్న ఈగ కూడా వాలకుండా చూస్తానని,  పూర్తి సేఫ్‌గా పెడన నుంచి దాటిస్తాననని జోగి సవాల్ చేశారు. టీడీపీతో జత కట్టడం జనసేన కేడర్‌కు అస్సలు ఇష్టం లేదని, అధినేత తీరు వారికి నచ్చడం లేదని తేలిపోయిందని అందుకే అవనిగడ్డ సభ అట్టర్ ఫ్లాప్ అయ్యిందని పేర్కొన్నారు.

గతకాలపు అనుభవాల్ని తెలుసుకున్న తర్వాత కూడా టీడీపీతో జతకట్టి చంద్రబాబును మరోమారు గద్దెనెక్కించేందుకు జనసేన కేడర్‌ సిద్ధంగా లేరని, ఇదే విషయంపై బాహాటంగానే ఆ పార్టీలో పెద్దఎత్తున చర్చ జరుగుతోందని తెలిపారు.  ఇప్పటికైనా పవన్ మాటల్లోని మర్మాన్ని అర్థం చేసుకోవాలని, పవన్‌ను నమ్మితే నట్టేట మునిగినట్టేనని జనసేన శ్రేణులకు జోగి రమేశ్‌ హితవు చెప్పారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్