Thursday, March 19, 2026
HomeTrending Newsలేపాక్షి భూములపై ప్రజా, న్యాయ పోరాటం: కేశవ్

లేపాక్షి భూములపై ప్రజా, న్యాయ పోరాటం: కేశవ్

అత్యంత విలువైన లేపాక్షి నాలెడ్జ్ హబ్ భూములను అతి తక్కువ ధరకే ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేందుకు ఈ ప్రభుత్వం సిద్ధమవుతోందని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, పిఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ ఆరోపించారు. లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు, వేలాది మందికి ఉద్యోగాలు వస్తాయని నమ్మి రైతులు 8,844 ఎకరాల భూములు త్యాగం చేశారన్నారు. ఒక్కో ఎకరానికి నాటి ప్రభుత్వం రెండు లక్షల రూపాయలు మాత్రమే చెల్లించిందని చెప్పారు. అనంతపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పయ్యావుల మీడియా సమావేశం నిర్వహించారు.

కేశవ్ మాట్లాడుతూ కియా మోటార్స్ బెంగుళూరు ఎయిర్ పోర్ట్ కు 130 కిలోమీటర్ల దూరంలో ఉంటే, అక్కడ ఒక్కో ఎకరం షుమారు కోటిన్నర విలువ చేస్తోందని చెప్పారు.  లేపాక్షి భూములు ఎయిర్ పోర్ట్ కు కేవలం 60 కిలోమీటర్ల దూరంలో,  జాతీయ రహదారిపై దాదాపు పది కిలోమీటర్ల పాటు ఈ భూములు విస్తరించి ఉన్నాయని చెప్పారు. ఇక్కడ పదివేల కోట్ల రూపాయల విలువైన భూములను దివాలా పేరుతో… రీ టెండర్ పేరుతో 470 కోట్ల రూపాయలకే రాంకీ, అరబిందో, ఎర్తిన్ కంపెనీలు వాటిని దక్కించుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. దీనిపై ఈ ఫిబ్రవరిలోనే తాను ప్రభుత్వానికి పిఏసి ఛైర్మన్ గా తాను లేఖ రాస్తే కనీస స్పందన లేదన్నారు.  యెన్ సి ఎల్ టి నుంచి తాను వివరాలు తెప్పించుకున్నానని, ఈ భూములను కాపాడుకోవడానికి, తిరిగి వాటిని ప్రభుత్వ పరం చేసుకోవడానికి ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. ఈ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ద్వారా ఈ భూములను ప్రైవేటు పరం చేయడానికి పరోక్షంగా సహకరిస్తోందన్నారు.  ఈ విషయంలో తెలుగుదేశం పార్టీ చూస్తూ వూరుకోబోదని, పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమం నిర్వహిస్తామని, న్యాయపోరాటం కూడా చేస్తామని హెచ్చరించారు.

Also Read : మానసిక ఒత్తిడి తెచ్చే ప్రయత్నం: పయ్యావుల 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular