Friday, September 20, 2024
HomeTrending NewsLand Re-survey: అక్టోబర్ నాటికి రెండో దశ సర్వే పూర్తి

Land Re-survey: అక్టోబర్ నాటికి రెండో దశ సర్వే పూర్తి

దేశంలోనే అత్యంత శాస్త్రీయ విధానంలో సమగ్ర భూసర్వే చేస్తున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉందని మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి,  ధర్మాన ప్రసాదరావులు పేర్కొన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో 2వేల గ్రామాల్లో జగనన్న శాశ్వత భూహక్కు-భూరక్ష కింద సర్వేను విజయవంతంగా పూర్తి చేసి, భూహక్కు పత్రాలను కూడా జారీ చేయడం జరిగిందని తెలిపారు. రెండోదశలో భాగంగా మరో రెండువేల గ్రామాల్లో ఈ ఏడాది అక్టోబర్ 15వ తేదీ లోగా సర్వే ప్రక్రియ పూర్తి చేయాలని  అధికారులను ఆదేశించారు. అమరావతి సచివాలయంలోని మూడో బ్లాక్ లో నేడు  జగనన్న శాశ్వత భూహక్కు-భూరక్ష పథకం అమలుపై పెద్దిరెడ్డి  అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ సమావేశం జరిగింది.

రాష్ట్ర వ్యాప్తంగా 13,398 గ్రామాలకు సంబంధించి 12,032 గ్రామాల్లో అంటే దాదాపు 92 శాతం డ్రోన్ ఫ్లై పూర్తయ్యిందని అన్నారు. ఆగస్టు నెలాఖరు నాటికి డ్రోన్ ఫ్లై ను నూరుశాతం పూర్తి చేయాలని ఆదేశించారు.రాష్ట్ర వ్యాప్తంగా 7వేల గ్రామాలకు సర్వే ఇమేజెస్ కూడా పంపించడం జరిగిందని, మొదటిదశలో 25.7 లక్షల సర్వే రాళ్ళను పాతి రైతులకు హద్దులను కూడా శాశ్వతంగా గుర్తించే ప్రక్రియను పూర్తి చేశామని తెలిపారు. రెండోదశకు సంబంధించి మరో 5 లక్షల సర్వే రాళ్ళు అందించాల్సి వుందని, వాటని కూడా ఎపిఎండిసి సకాలంలో సరఫరా చేసేందుకు సిద్దంగా ఉందని తెలిపారు. అలాగే మూడు, నాలుగో దశలకు సంబంధించి ఎన్ని సర్వే రాళ్ళు కావాలో ముందుగానే రెవెన్యూ, సర్వే విభాగాలు ఇండెంట్ ను అందించాలని సూచించారు.

రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో సర్వే ప్రక్రియ వేగంగా జరుగుతోందని, దానితో పాటు అర్భన్ ప్రాంతాల్లో కూడా సర్వేను చురుగ్గా నిర్వహించాలని మంత్రులు ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 123 యుఎల్బిల్లో 15 లక్షల ఎకరాలకు సర్వే చేయాల్సి ఉందని అన్నారు. అర్బన్ ఏరియాలోనే 5.5 లక్షల ఎకరాలు అగ్రికల్చర్ ల్యాండ్ గా ఉందని, మిగిలిన 9.44 లక్షల ఎకరాలు అర్బన్ ఏరియా కింద ఉందని అన్నారు. ఈ మొత్తం ఏరియాలో 38.19 లక్షల ప్రాపర్టీలను సర్వే చేయాల్సి ఉందని దీనిని కూడా నిర్ధేశిత గడువులోగా పూర్తి చేయాలని మంత్రులు కోరారు.

ఆర్వోఎఫ్ఆర్ కింద రాష్ట్రంలో అటవీభూముల్లో సాగు చేస్తున్న మూడు లక్షల ఎకరాలకు పట్టాలు ఇచ్చామన్నారు. వాటిని వెబ్ ల్యాండ్ అడంగల్ పరిధిలోకి తీసుకువచ్చి, వాటిని కూడా సమగ్ర సర్వేలో భాగం చేయబోతున్నామని అధికారులు వివరించారు. రెండు నెలల్లో ఈ ప్రక్రియను పూర్తి చేస్తామని అన్నారు. ఇదే క్రమంలో అటవీభూముల ఆక్రమణలపై కూడా సర్వే సందర్భంగా యాజమాన్య హక్కుల నిర్ధారణలో అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని మంత్రులు సూచించారు. రెవెన్యూ, అటవీశాఖ సంయుక్త సర్వే ద్వారా హద్దులను నిర్ధారించాలని ఆదేశించారు.

ఈ సమావేశంలో సిసిఎల్ఎ జి.సాయిప్రసాద్, స్పెషల్ సిఎస్ (పట్టణాభివృద్ధి) శ్రీలక్ష్మి, గనులశాఖ స్పెషల్ సిఎస్ గోపాలకృష్ణ ద్వివేది, పిఆర్&ఆర్డీ కమిషనర్ సూర్యకుమారి, సర్వే అండ్ సెటిల్ మెంట్ కమిషనర్ సిద్దార్థ్ జైన్, ఎంఎయుడి కమిషనర్ కోటేశ్వరరావు, డిఎంజి (ఎఫ్ఎసి) డబ్ల్యు.బి.చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్