నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల రూపొందించిన సినిమా ‘లవ్ స్టోరి’ సెప్టెంబర్ 24న థియేటర్లలో విడుదలవుతోంది. రేవంత్, మౌనికల ప్రేమ కథను తెరపై చూసేందుకు ఆడియెన్స్ చాలా రోజులుగా వేచి చూస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు నారాయణదాస్ నారంగ్, పి. రామ్మోహన్ మీడియాతో మాట్లాడారు.
“మేము ఎన్నో ఏళ్లుగా డిస్ట్రిబ్యూషన్, ఎగ్జిబిషన్ సెక్టార్లో ఉన్నా ఎప్పుడూ నిర్మాణం గురించి ఆలోచించలేదు. ఇక్కడ డబ్బుతో పాటు అనేక విషయాలు ఆధారపడి ఉంటాయి. టీమ్ వర్క్ లా పని చేయాలి, క్రియేటివిటీ చూపించాలి. అలా ప్రొడక్షన్ గురించి కూడా అవగాహన వచ్చాక నిర్మాణ రంగంలో అడుగుపెట్టాం. ‘లవ్ స్టోరి’ గతేడాది విడుదల చేయాల్సింది. లాక్ డౌన్ వల్ల వాయిదావేస్తూ వచ్చాం. ఇప్పుడు థియేటర్లలో సినిమాను విడుదల చేస్తున్నందుకు థ్రిల్ గా ఫీల్ అవుతున్నాం. లవ్ స్టోరి మంచి ఎమోషన్స్ ఉన్న ఫీల్ గుడ్ మూవీ. థియేటర్ లలోనే ఇలాంటి సినిమాలను ఎంజాయ్ చేయగలం. అందుకే ఓటీటీలు ఎన్ని సంప్రదించినా మా చిత్రాన్ని ఇవ్వలేదు” అని నారాయణదాస్ నారంగ్ అన్నారు.
మరో నిర్మాత రామ్మోహన్ రావు మాట్లాడుతూ “నారాయణదాస్ నారంగ్ గారు గత 30 ఏళ్లుగా డిస్ట్రిబ్యూషన్, ఎగ్జిబిషన్ సెక్టార్ లో యాక్టివ్ గా ఉన్నారు. 100కు పైగా థియేటర్స్, 10 మల్టీప్లెక్సులు రన్ చేస్తున్నారు. నేను కూడా చాలా ఏళ్లుగా డిస్ట్రిబ్యూషన్, ఎగ్జిబిషన్ రంగంలో ఉన్నాను. ఆ తర్వాత నిర్మాతగా మారాను. నారాయణదాస్ నారంగ్ గారితో కలిసి ఫస్ట్ టైమ్ ‘లవ్ స్టోరి’ను నిర్మించాం. ఇకపై మరిన్ని చిత్రాలు కలిసి నిర్మించాలని అనుకుంటున్నాం. ‘లవ్ స్టోరి’ పాటలు చాలా హిట్ అయ్యాయి. శేఖర్ కమ్ముల గారి తరహా కథా కథనాలు సినిమాలో చూస్తారు. ఆయన స్టైల్ లోనే కొత్త కథను చూపించబోతున్నారు. ఏపీలో థియేటర్ ల టికెట్ ధరలు, బుకింగ్ విధానం, ఇతర విషయాల పై ప్రభుత్వంతో సంప్రదించేందుకు సిద్ధంగా ఉన్నాం. త్వరలో ఏపీ సినిమాటోగ్రఫీ మినిస్టర్ ని కలవబోతున్నాం’’ అన్నారు.