Thursday, June 11, 2026
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంపుట్టకముందే బోధన

పుట్టకముందే బోధన

తల్లి కడుపులో ఉన్నప్పుడే పాఠాలు వినడం సాధ్యమేనా? విన్నది గుర్తుంచుకోవడం సాధ్యమేనా? మన దేశంలో సాధ్యమే అని పురాణాలు ఎప్పుడో చెప్పాయి. సుభద్ర గర్భంలో ఉన్నప్పుడే అభిమన్యుడు యుద్ధ విద్యలు నేర్చుకున్నాడు. లీలావతి గర్భంలో ఉన్నప్పుడే ప్రహ్లాదుడు నారాయణ మంత్రాన్ని ఒంటబట్టించుకున్నాడు. ఇవన్నీ పురాణ గాథలు అనుకుని మనం ఇన్నాళ్లూ పక్కన పెట్టేశాం. కానీ, ఇప్పుడు మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఆ పురాణాలనే ప్రభుత్వ విధానంగా మార్చింది. గర్భంలోని శిశువుకు ‘సంస్కారం’ నేర్పే వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది.

గర్భ సంస్కార్

గర్భ సంస్కార్ అంటే కేవలం పూజలు కాదు. గర్భంలో ఉన్న శిశువును ఒక గొప్ప వ్యక్తిగా తీర్చిదిద్దే ప్రక్రియ. శిశువు పెరుగుతున్నప్పుడు తల్లి చేసే పనులు, ఆమె ఆలోచనలు, ఆమె తీసుకునే ఆహారం నేరుగా శిశువుపై ప్రభావం చూపుతాయి. దీనినే ‘గర్భ సంస్కార్’ అంటారు. ఇప్పుడు మధ్యప్రదేశ్ ప్రభుత్వం అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో దీని కోసం ప్రత్యేక గదులను ఏర్పాటు చేస్తోంది.

ప్రభుత్వ దవాఖానల్లో ‘జ్ఞాన గదులు’

సాధారణంగా ప్రభుత్వ ఆసుపత్రి అంటే మందులు, ఇంజెక్షన్లు గుర్తుకు వస్తాయి. కానీ ఇకపై అక్కడ ‘గర్బ్ సంస్కార్’ గదులు కనిపిస్తాయి. దంపతులు కాబోయే వారికి ఇక్కడ ప్రత్యేక శిక్షణ ఇస్తారు.
* భారతీయ సంప్రదాయాలను ఎలా పాటించాలి?
* గర్భిణులు ఎలాంటి పుస్తకాలు చదవాలి?
* మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ఏ సంగీతం వినాలి?  లాంటి అంశాలను ఇక్కడ బోధిస్తారు. ఇది కేవలం ఒక ప్రయోగం కాదు, ఒక తరానికి ఇస్తున్న సంస్కారం అని ప్రభుత్వం చెబుతోంది.

విజ్ఞాన శాస్త్రం ఏం చెబుతోంది?

వైద్యశాస్త్రం ప్రకారం, గర్భంలో ఉన్న శిశువుకు ఆరో నెల నుండే వినికిడి శక్తి వస్తుంది. బయట శబ్దాలను శిశువు వినగలదు. తల్లి సంతోషంగా ఉంటే శిశువు కూడా ఆరోగ్యంగా పెరుగుతుంది. తల్లి ఒత్తిడికి లోనైతే ఆ ప్రభావం శిశువు మెదడుపై పడుతుంది. అందుకే, గర్భంలో ఉండగానే శిశువుకు మంచి విలువలను అందించడం వల్ల మేధావులైన పిల్లలు పుడతారని సైన్స్ కూడా అంగీకరిస్తోంది.

ఆహారం.. ఆలోచన.. ఆరోగ్యం

ఈ కేంద్రాల్లో గర్భిణులకు ఆహార నియమాలను కూడా నేర్పిస్తారు.
* ఏ సమయంలో భోజనం చేయాలి?
* ఏ ఆహారం తీసుకుంటే శిశువుకు మేధస్సు పెరుగుతుంది?
* కోపం, బాధ లాంటి భావోద్వేగాలను ఎలా అదుపులో ఉంచుకోవాలి?
ఇవన్నీ నేర్పడం ద్వారా ఒక బలమైన తరాన్ని నిర్మించవచ్చని ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ నమ్ముతున్నారు. దీనికి ‘దివ్య సంతాన్ ప్రకల్ప్’ అని పేరు పెట్టారు. అంటే—దైవిక గుణాలున్న పిల్లలను తయారు చేసే ప్రాజెక్ట్ అని అర్థం.

భవిష్యత్తుపై గొప్ప పెట్టుబడి

మనం రోడ్ల మీద, బిల్డింగుల మీద వేల కోట్లు ఖర్చు పెడతాం. కానీ, మనుషుల మీద పెట్టే పెట్టుబడే నిజమైన సంపద. గర్భం నుండే ఒక శిశువుకు నైతిక విలువలు నేర్పడం అంటే, భవిష్యత్తులో నేరాలు లేని, సంస్కారవంతమైన సమాజాన్ని నిర్మించడమే. మధ్యప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న ఈ ప్రయత్నం మంచి ఫలితాలనిస్తే అంతకంటే కావాల్సింది ఏముంటుంది?

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

YouTube – ధాత్రి మహతి
Twitter – ఐధాత్రి2
Facebook – ఐధాత్రి తెలుగు
Instagram – ఐధాత్రి తెలుగు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular