Sunday, September 8, 2024
HomeTrending NewsBRS: మెదక్ నుంచి సీఎం కేసీఆర్ ఎన్నికల శంఖారావం

BRS: మెదక్ నుంచి సీఎం కేసీఆర్ ఎన్నికల శంఖారావం

కేసీఆర్ వ్యూహం ఎవరూ ఊహించలేదని, సీట్ల ప్రకటనతో విపక్షాలు కకావికలం అవుతున్నాయని మంత్రి హరీష్ రావు అన్నారు. మెదక్ లో పదికి పది సీట్ల గెలుపు పక్కా అన్నారు. సీఎం కేసీఆర్ కి గెలుపు బహుమతిగా ఇస్తామని చెప్పారు. మెదక్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో మంత్రి హరీశ్ రావు మీడియాతో మాట్లాడుతూ మెదక్ వేదికగా రేపు సీఎం కేసీఆర్ ప్రగతి శంఖారావం పూరిస్తారని వెల్లడించారు.

16 రాష్ట్రాల్లో బీడీ కార్మికులు ఉన్నా, ఆదుకున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే అని మంత్రి పేర్కొన్నారు. టేకేదార్లకు కూడా పింఛను ఇచ్చే కార్యక్రమం సీఎం కేసీఆర్ మెదక్ వేదికగా ప్రారంభిస్తారన్నారు. దివ్యాంగులకు పెంచిన రూ.4016 పింఛన్లు కూడా అందిస్తారని, తర్వత జిల్లా కలెక్టరెట్ లో అధికారులతో మాట్లాడుతారన్నారు. రేపు 3గంటల సమయంలో సభ కు హాజరు అవుతారని, సీఎం కేసీఆర్ కి కృతజ్ఞతలు తెలిపే సభ అన్నారు. టిఆర్ఎస్ పాలనలో మెదక్ రూపు రేఖలు మారాయని, ఏ రాజకీయ పార్టీ కూడా ఓకేసారి ఇంత పెద్ద మొత్తంలో సీట్లు ప్రకటించలేదన్నారు.

కాంగ్రెస్ వాళ్లకు లీడర్లు లేరు, బిజెపి వాళ్ళకు కేడర్ లేదని మంత్రి హరీష్ ఎద్దేవా చేశారు. యువత, విద్యార్థులు అన్ని వర్గాల ప్రజలు బి ఆర్ ఎస్ కు పెద్ద ఎత్తున జై కొడుతున్నారని, సంక్షేమం అభివృద్ధి కొనసాగాలంటే గులాబీ జెండా ఎగరాల్సిందే అన్నారు. దేశం మెచ్చే విధంగా కేసీఆర్ పాలన ఉందని, తెలంగాణ పథకాలను బిజెపి కాపీ కొట్టి దేశవ్యాప్తంగా అమలు చేస్తున్నదని విమర్శించారు. కుల వృత్తులకు లక్ష రూపాయలు ఆర్థిక సాయం అందించే పథకాన్ని కూడా కేంద్రం కాపీ కొట్టిందన్నారు.

అంతకుముందు అధికారులతో కలిసి సీఎం పర్యటన ఏర్పాట్లు పరిశీలించారు. బుధవారం సీఎం కేసీఆర్ మెదక్ జిల్లా పర్యటన నేపథ్యంలో మంత్రి హరీశ్ రావు స్వయంగా ఏర్పాట్లు పర్యవేక్షించారు. మెదక్‌ సమీకృత కలెక్టరేట్‌, పోలీసు సూపరింటెండెంట్‌ కార్యాలయం, బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయాన్ని సందర్శించి పోలీసు, ఆర్ అండ్ బి, ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్షించారు. బహిరంగ సభ నిర్వహించే స్థలాన్ని సందర్శించి, పెద్ద సంఖ్యలో తరలి వచ్చే ప్రజలు, పార్టీ శ్రేణుల కోసం ఏర్పాట్లు చేయాలన్నారు. ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని, అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. మంత్రితోపాటు స్థానిక ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, ఇతర ప్రజాప్రతినిధులు, పలు విభాగాల అధికారులు ఉన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్