Tuesday, March 10, 2026
HomeTrending Newsస్టంట్ మాస్టర్లను ఎవరూ నమ్మరు

స్టంట్ మాస్టర్లను ఎవరూ నమ్మరు

రాజకీయపార్టీల నేతలు కొందరు స్టంట్ మాస్టర్లలా వ్యవహరిస్తున్నారని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. అటువంటి స్టంట్లన్నీ కెమెరాలకే పరిమితం అని ఆయన ఎద్దేవాచేశారు. అటువంటి వారి వెంట నడిచేందుకు ప్రజలు సిద్ధంగా లేరని ఆయన తేల్చిచెప్పారు. శుక్రవారం సూర్యాపేటలో మంత్రి జగదీష్ రెడ్డి వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ని వదులుకోవడానికి తెలంగాణ సమాజం సిద్ధంగా లేదన్నారు. కెసిఆర్ గురించి మాట్లాడేటప్పుడు ముందు వెనుక ఆలోచించుకొని మాట్లాడాలని ఆయన హితవు పలికారు.

ముఖ్యమంత్రి గా తెలంగాణకు ఏమి చేశారు…తెలంగాణ ఏర్పాటుకు ఆరోజున ఉద్యమ నేతగా ఎలా సాధించారు అన్నది ఇక్కడి ప్రజలకు స్పష్టంగా తెలుసు అని ఆయన తెలిపారు. ఈ రోజు అవాకులు చవాకులు పేలుతున్న వారికి వచ్చిన పదవులు ముఖ్యమంత్రి కేసీఆర్ పెట్టిన బిక్షమేనని ఆయన చెప్పారు. తెలంగాణ అనే పదమే లేకుండా వారికి ఈ పదవులు దక్కేవా అంటూ ఆయన సూటిగా ప్రశ్నించారు.

పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లుగా వారి వారి స్టంట్లన్నీ దారిలో పోయేవారు చూసి కాలక్షేపం చేస్తారేమో గాని వెంట నడువరని మంత్రి జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు. ముందుగా ఆ విషయం తెలుసుకుని మసులుకోవాలని సూచించారు. పైరవిలతో పదవులు రావొచ్చు కానీ నోటికి వచ్చినట్లు మాట్లాడుతాం…ఇష్టానుసారంగా బూతులు మాట్లాడుతాం అంటే తెలంగాణ సమాజం చూస్తూ ఉరుకోబోదని ఆయన హెచ్చరించారు. సందర్భం వచ్చినప్పుడు కర్రు కాల్చి వాత పెట్టడంలో తెలంగాణ సమాజం ముందుంటుందన్నారు.ప్రజాసేవే చేయాలని తాపత్రయపడుతున్న వారు ముందుగా ప్రజల్లో నమ్మకం కలిగించే ప్రయత్నం చెయ్యాలి తప్ప ఇటువంటి స్టంట్లు కాదన్నారు. ఇలాంటివారికి ఎన్నటికీ ప్రజాదరణ లభించిదని మంత్రి జగదీష్ రెడ్డి సుస్పష్టం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular