Friday, September 20, 2024
HomeTrending NewsIT Tower: ప్రారంభానికి ముస్తాబైన నిజామాబాద్ ఐటీ టవర్

IT Tower: ప్రారంభానికి ముస్తాబైన నిజామాబాద్ ఐటీ టవర్

రాష్ట్రంలోని ద్వితీయ శ్రేణి నగరాలు, పట్టణాలకు ఐటీ పరిశ్రమను విస్తరించడమే లక్ష్యంగా ప్రభుత్వం మరో ముందడుగు వేస్తున్నది. ఇప్పటికే కరీంనగర్‌, మహబూబ్‌నగర్‌, సిద్దిపేటలో ఐటీ హబ్‌లను అందుబాటులోకి తీసుకొచ్చిన సర్కార్‌.. తాజాగా నిజామాబాద్‌ ఐటీ టవర్‌ ప్రారంభానికి సిద్ధంచేసింది. ఇందూరు ఐటీ టవర్‌ను మంత్రి కేటీఆర్‌ బుధవారం ప్రారంభించనున్నారు. ఈమేరకు మంత్రి కేటీఆర్‌ సామాజిక మాధ్యమం ఎక్స్‌ (ట్విట్టర్‌) ద్వారా తెలిపారు.

టైర్‌ 2 పట్టణాలు, నగరాలకు ఐటీ సెక్టార్‌ విస్తరించడంలో భాగంగా నిజామాబాద్‌లో కొత్తగా ఏర్పాటు చేయనున్న ఐటీ హబ్‌ను ప్రారంభిస్తున్నారు. యువత తమ నైపుణ్యాలు పెంచుకోవడానికి, సరికొత్త ఆవిష్కరణల కోసం ఇందులో టీ-హబ్‌, టాస్క్‌ సెంటర్లను కూడా ఉన్నాయి. దీనిద్వారా తెలంగాణ అభివృద్ధిలో యువత పాలుపంచుకునే అవకాశం లభిస్తుందని వెల్లడించారు. నిజామాబాద్‌ నగరంలోని గిరిరాజ్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమీపంలో బైపాస్‌ రోడ్డుకు ఆనుకొని ఉన్న 3.5 ఎకరాల ప్రభుత్వ భూమిని ఐటీ టవర్‌ కోసం ఆరేండ్ల క్రితమే కేటాయించారు. రూ.50 కోట్ల వ్యయంతో 49,460 చదరపు అడుగుల విస్తీర్ణంలో దీనిని ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. ఎకరం భూమిలో ఐటీ టవర్‌ను డిజైన్‌ చేశారు. మిగిలిన 2.5 ఎకరాల భూమిని భవిష్యత్తులో ఐటీ టవర్‌ విస్తరణ కోసం వదిలేశారు. ఈ మిగులు స్థలాన్ని పార్కింగ్‌, లాన్‌, ఇతర అవసరాల కోసం ఉపయోగిస్తారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్