Saturday, September 21, 2024
HomeTrending Newsఆయిల్ పామ్ కు మంచి భవిష్యత్తు

ఆయిల్ పామ్ కు మంచి భవిష్యత్తు

దేశ ప్రజల అవసరాలకు ఏడాదికి 22 మిలియన్ టన్నుల నూనె అవసరం  కానీ దేశంలో ఏడు మిలియన్ టన్నుల నూనె గింజలను మాత్రమే సాగు చేస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వెల్లడించారు.  దేశ అవసరాల కోసం 70 వేల కోట్ల పామాయిల్ ను దిగుమతి చేసుకుంటున్నామని తెలిపారు.  “తెలంగాణలో ఆయిల్ పామ్ సాగు విస్తరణ” పై టీ శాట్ ద్వారా మన టీవీ నిర్వహించిన సమావేశంలో అంశంపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి, ఆయిల్ ఫెడ్ చైర్మన్ రామకృష్ణారెడ్డి ,ఉద్యాన శాఖ డైరెక్టర్ వెంకట్రామ్ రెడ్డి, అయిల్ ఫెడ్ ఎండీ సురేందర్, ఆయిల్ ఫెడ్ జాయింట్ డైరెక్టర్ సరోజిని పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో నువ్వులు, కుసుమ, వేరుశనగ తదితర నూనెగింజల సాగును ప్రోత్సహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి పేర్కొన్నారు

దేశ అవసరాలకు ఆయిల్ పామ్ సాగు 80 లక్షల ఎకరాలలో చేపట్టాల్సి ఉంది .. కానీ 8 లక్షల ఎకరాలే సాగవుతుందన్న మంత్రి నిరంజన్ రెడ్డి తెలంగాణలో  20 లక్షల ఎకరాలలో ఆయిల్ పామ్ సాగు చేయాలని నిర్ణయించడం జరిగిందన్నారు. టన్ను ఆయిల్ పామ్ గెలలకు రూ.19 వేలు ధర పలుకుతుంది .. ఎకరాకు 15 నుండి 20 టన్నుల దిగుబడి వస్తుందని, ఎకరాకు రూ.36 వేలు సబ్సిడీ ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిర్ణయించారని చెప్పారు. మన దగ్గర పండే ఆయిల్ పామ్ గెలలలో అధిక నూనె శాతం ఉన్నట్లు పరిశోధనా సంస్థలు తేల్చిచెప్పాయి. ఆయిల్ పామ్ సాగు చేసే రైతాంగానికి ఉపాధిహామీ కింద గుంతల తవ్వకం, మైక్రో ఇరిగేషన్ కింద డ్రిప్ పరికరాలు, అవసరమైన రైతులకు సమీప బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించే ప్రక్రియ తెలంగాణ ప్రభుత్వం చేపడుతుంది.

ఆయిల్ పామ్ సాగు చేయాలనుకునే రైతులు వ్యవసాయ శాఖ వద్ద పేర్లు నమోదు చేసుకుంటే ప్రభుత్వమే ఆయిల్ పామ్ సాగు విధానం రైతులు చూసేందుకు ప్రభుత్వమే ఖర్చులు భరించి పర్యటనకు తీసుకువెళ్తుంది. రాబోయే నాలుగేళ్లలో 20 లక్షల ఎకరాలలో ఆయిల్ పామ్ సాగులోకి తీసుకురావాలని ఎంతో ముందుచూపుతో పథకాన్ని రూపొందించాము. సాంప్రదాయ పంటల సాగుతో రైతులు నష్టపోకుండా పంటల మార్పిడిని ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని, ఆయిల్ ఫెడ్ ద్వారానే 2 లక్షల ఎకరాలలో ఆయిల్ పామ్ ను సాగు చేసేందుకు ప్రభుత్వం అనుమతిస్తుందని మంత్రి చెప్పారు.

వ్యవసాయ రంగంలో ప్రపంచంలో భారత దేశానిది రెండవ స్థానం కాగా అమెరికా మొదటి స్థానంలో, చైనా మూడో స్థానంలో ఉన్నాయి. ఉత్పత్తులలో చైనా అగ్రస్థానంలో ఉంటే అమెరికా ద్వితీయ, భారత్ మూడో స్థానంలో ఉంది. 39.90 కోట్ల ఎకరాల సాగు భూమి దేశంలో అందుబాటులో ఉంది. దేశంలో వస్తున్న ఉత్పత్తులలో సమతుల్యత లేదు. వస్తున్న పంటలు అవసరాలకు అనుగుణంగా ఉన్నాయా ? మన పంటలను ఎగుమతి చేస్తున్నామా ? ఏఏ పంటలు సాగవుతున్నాయి ? అన్న విషయంలో రైతాంగానికి స్పష్టత ఉండాలని మంత్రి వివరించారు. తెలంగాణ వ్యవసాయిక రాష్ట్రం .. కేసీఆర్ గారి నాయకత్వంలో సాగునీరు, ఉచిత కరంటు, రైతు బంధు, రైతు భీమా పథకాలతో వ్యవసాయ రంగానికి చేయూత నివ్వడం జరిగింది.

వ్యవసాయ అనుకూల విధానాలతో తెలంగాణలో సాగు విస్తీర్ణం పెరుగుతోందని, కోటి పై చిలుకు ఎకరాలలో 3 కోట్ల టన్నుల ధాన్యం దిగుబడి వచ్చిందని మంత్రి నిరంజన్ రెడ్డి వెలువరించారు. పంజాబ్ తర్వాత అత్యంత ఎక్కువ ధాన్యం ఉత్పత్తి తెలంగాణ నుండి వచ్చిందని, వస్తున్న పంట అవసరాలకు మించి ఉండడంతో భవిష్యత్ లో రైతులకు వరి సాగు మూలంగా ఇబ్బంది కలిగే అవకాశం ఉందన్నారు. మార్కెట్ రీసెర్చ్ అనాలసిస్ వింగ్ ఏర్పాటు చేసి జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లను అధ్యయనం చేసి డిమాండ్ ఉన్న పంటల సాగు వైపు రైతులను ప్రోత్సహించడం జరుగుతుంది. దేశంలోని వనరులను సమర్దవంతంగా వినియోగించుకుని ప్రపంచానికి అవసరమైన ఆహార ఉత్పత్తులు అందించాల్సిన అవసరం ఉందన్నారు.

మన దేశంలో వ్యవసాయరంగం బలోపేతం చేయడం ద్వారానే అత్యధిక శాతం జనాభాకు ఉపాధి కల్పించగలిగే అవకాశాలు ఉన్నాయని, ఉపాధి కల్పించడం ప్రభుత్వాల విధి .. టీఎస్ ఐపాస్ విధానంతో తెలంగాణలో లక్షల మంది కార్మికులకు ఉపాధి లభించిందని మంత్రి పేర్కొన్నారు. సాఫ్ట్ వేర్ రంగం బలోపేతంతో దాదాపు 6.5 లక్షల మందికి ఉపాధి లభించింది. మరిన్ని ఉపాధి, ఉద్యోగ అవకాశాలను పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతుంది.

తెలంగాణ ఏర్పడిన తర్వాత లక్షా 35 వేల ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది .. ప్రతి ఏటా రెగ్యులర్ గా ఉద్యోగాలు కల్పించేందుకు జాబ్ క్యాలెండర్ విడుదల చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. వ్యవసాయరంగంలో వచ్చిన ఉపాధి అవకాశాల గురించి నేను ప్రస్తావిస్తే దానిని కొందరు వక్రీకరించి దుష్ప్రచారం చేశారని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో అర్హులయిన ప్రతి ఒక్కరికి వారి స్థాయికి తగిన అవకాశాలు, ఉద్యోగాలు రావాలన్నది ప్రభుత్వ ఆలోచన ఆ విషయంలో  ప్రభుత్వ చిత్తశుద్దిని శంకించలేరు. అవాకులు, చవాకులు పేలే వారంతా తెలంగాణ ఉద్యమంలో ఆంధ్రా పాలకుల తొత్తులుగా పనిచేసిన వారే అని మంత్రి దుయ్యబట్టారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్