Monday, February 24, 2025
HomeTrending Newsజూలై 13న బల్కంపేట ఎల్లమ్మ కల్యాణం

జూలై 13న బల్కంపేట ఎల్లమ్మ కల్యాణం

బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణాన్ని వచ్చే నెల 13 వ తేదీన  అత్యంత ఘనంగా నిర్వహించనున్నట్లు పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్  ప్రకటించారు. బుధవారం మాసాబ్ ట్యాంక్ లోని కార్యాలయంలో దేవాదాయ శాఖ, GHMC, వాటర్ వర్క్స్, R & B, హెల్త్, పోలీస్, ఎలెక్ట్రికల్ తదితర శాఖల అధికారులతో ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. అనంతరం మంత్రి శ్రీనివాస్ యాదవ్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

పోయిన సంవత్సరం కరోనా మహమ్మారి కారణంగా అమ్మవారి కళ్యాణాన్ని నిరాడంబరంగా నిర్వహించడం జరిగిందని చెప్పారు. అన్ని శాఖల అధికారుల సమన్వయంతో అమ్మవారి కళ్యాణాన్ని నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. జులై 12 వ తేదీన ఎదుర్కోళ్ళు, 13 వ తేదీన అమ్మవారి కళ్యాణం, 14 వ తేదీన రధోత్సవం నిర్వహించడం జరుగుతుందని ఆయన వివరించారు. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా ఏర్పాట్లు చేయనున్నట్లు వివరించారు.

ఆలయానికి వచ్చే రహదారులు, రధోత్సవం నిర్వహించే రహదారుల మరమత్తులను వెంటనే చేపట్టాలని జోనల్ కమిషనర్ ప్రావిణ్య ను ఆదేశించారు. ఎప్పటికప్పుడు పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా పారిశుధ్య నిర్వహణ, శానిటైజేషన్ చేపట్టాలని, అవసరమైతే అదనపు సిబ్బందిని నియమించుకోవాలని మంత్రి శ్రీనివాస్ యాదవ్ ఆదేశించారు. మొబైల్ టాయిలెట్ లను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.  నిరంతరాయంగా విద్యుత్ సరఫరా జరిగేలా ఏర్పాట్లు చేయాలని, మొబైల్ ట్రాన్స్ పార్మర్ లు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని విద్యుత్ అధికారులను ఆదేశించారు.

దొంగతనాలు, ఈవ్ టీజింగ్ వంటి చర్యల నియంత్రణ పై నిఘా ఏర్పాటు చేయాలని పోలీసు అధికారులను  కోరారు. అవసరమైన ప్రాంతాలలో CC కెమెరాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. మూడు రోజులపాటు స్వచ్చందంగా భక్తులకు సేవలందించే వాలంటీర్లకు ప్రత్యేక గుర్తింపు కార్డులను బార్ కోడింగ్ తో పంపిణీ చేయాలని ఆదేశించారు. భక్తులకు వైద్య సేవలను అందించేందుకు ఆలయ పరిసరాలలో మూడు వైద్య శిభిరాలను ఏర్పాటు చేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకట్ ను ఆదేశించారు.

ఈ సమావేశంలో కార్పొరేటర్లు కొలన్ లక్ష్మి బాల్ రెడ్డి, సరళ, మాజీ కార్పొరేటర్ నామన శేషుకుమారి, దేవాదాయ శాఖ రీజనల్ జాయింట్ కమిషనర్ రామకృష్ణ, EO అన్నపూర్ణ, కల్చర్ డైరెక్టర్ హరికృష్ణ, DC వంశీ, వాటర్ వర్క్స్ డైరెక్టర్ కృష్ణ, వెస్ట్ జోన్ DCP శ్రీనివాస్, ట్రాపిక్ అడిషనల్ DCP భాస్కర్, R & B EE శ్రీనాథ్, ట్రాన్స్ కో DE నెహ్రూ నాయక్,  RTC రీజనల్ మేనేజర్ యుగంధర్, RDO వసంత కుమారి, సమాచార శాఖ ఇంజనీర్ రాధాకృష్ణ, జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి సురేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్