నితిన్, నభా నటేష్, తమన్నా ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రం మాస్ట్రో. శ్రేష్ఠ్ మూవీస్ పతాకం పై రాజ్ కుమార్ ఆకెళ్ళ సమర్పణలో ఎన్.సుధాకర్రెడ్డి, నిఖితా రెడ్డి సంయుక్తంగా ఈ మూవీని నిర్మించారు. ఈ సినిమాకు టాలెంటెడ్ డైరెక్టర్ మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించారు. సెప్టెంబర్ 17న డిస్నీప్లస్ హాట్స్టార్లో మాస్ట్రో చిత్రం విడుదల కాబోతోన్న సందర్భంగా హీరోయిన్ నభా నటేష్ చెప్పిన చిత్ర విశేషాలు ఆమె మాటల్లోనే..
అంధాదున్ సినిమా విడుదలైనప్పుడు చూశాను. అది బాలీవుడ్కు టర్నింగ్ పాయింట్ లాంటి సినిమా అని చెప్పుకోవచ్చు. అప్పట్లో అంధాదున్ గురించి చాలా వినిపించింది. ఈ రీమేక్లో ఆఫర్ రావడంతో చాలా హ్యాపీగా అనిపించింది. జనాలు ఇప్పుడు కొత్త సినిమాలు చూసేందుకు ఇష్టపడుతున్నారు. అలాంటి చిత్రంలో నాకు కూడా అవకాశం రావడం హ్యాపీగా అనిపించింది. ఇది నా మొదటి రీమేక్ సినిమా. అది నాకు భయంగా అనిపించింది. రాధికా ఆప్టే అద్బుతంగా నటించింది కానీ అది నేను ఎలా చేయగలను? అని భయం వేసింది. కానీ మళ్లీ సినిమా చూడకూడదు.. ప్రభావితం అవుతాను అని అనుకున్నాను.
కరోనా ఉధృతంగా ఉన్న సమయంలోనే షూటింగ్ ప్రారంభించాం. మేమే మొదటగా సెట్కు వెళ్లామనుకుంటా. అప్పుడు రెస్టారెంట్, పబ్ సీన్స్ చేశాం. ఎంతోమంది జూనియర్ ఆర్టిస్టులు ఉండేవారు. షాట్ చేసేసి మేం పరిగెత్తే వాళ్లం. మా జాగ్రత్తలు మేం తీసుకునేవాళ్లం. అంధుడిగా నితిన్ అద్భుతంగా నటించారు. మా సీన్స్, సాంగ్స్ బాగా వచ్చాయి. కరోనా సమయంలో నావి రెండు సినిమాలు విడుదలయ్యాయి. ఇది మూడో సినిమా. ఇది వరకే నాకు ఓటీటీ భయం ఉండేది. ఏ సినిమా ఓటీటీలో వస్తుంది అని అనుకున్నాను. ఇంకా థియేటర్ల సమస్య ఉంది. కానీ ఇప్పుడు ఓటీటీలో అయితే అందరూ చూసేందుకు అవకాశం ఉంది.
కథను మాత్రం తీసుకుని దర్శకుడు తన విజన్తో సినిమాను తీశారు. దానికి దీనికి సంబంధం ఉండదు. నా పాత్రలో ఎన్నో మార్పులు చేర్పులు చేశారు. తెలుగు చిత్రంలానే ఉంటుంది. కథలోని జీవం మాత్రం అలానే ఉంటుంది. రీమేక్ చేయడం ఇదే మొదటి సారి. ఖచ్చితంగా పోలికలు ఉంటాయి. మూవీ చూసిన తరువాత జనాలు ఎలాంటి రియాక్షన్ ఇస్తారనేది చూడాలి. నా పాత్రను ఒరిజినల్ దాంతో ఎలా పోలుస్తారు? అని ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నాను. లాక్ డౌన్ సమయంలో సినిమాలు చూడటమే నా పని. ఫస్ట్ వేవ్లో చాలా కంటెంట్ వచ్చింది. అన్ని భాషల చిత్రాలు చూశాను. కానీ ఈ సారి మాత్రం అంతగా కుదరలేదు. సినిమా షూటింగ్లతో బిజీగా ఉన్నాను. పైగా కంటెంట్ కూడా అంతగా రాలేదు.
డబ్బింగ్ చెప్పే ప్రయత్నం చేశాను. కానీ కుదరలేదు. నేను బెంగళూరులో ఉంటున్నాను.. రావడం వెళ్లడం.. ఈ కరోనా నిబంధనలు.. ఇలా టైం కుదరలేదు. అందుకే డబ్బింగ్ చెప్పలేకపోయాను. తదుపరి చిత్రాల్లో ఖచ్చితంగా డబ్బింగ్ చెబుతాను. లాక్ డౌన్ తర్వాత ఇండియాలోనే మొదటి సారి షూటింగ్ చేసింది మేమే. ‘సోలో బతుకే సో బెటర్’ సినిమాను కూడా రిలీజ్ చేశాం. అప్పుడు భయంభయంగానే చేశాం. వీలైనంత తక్కువ మందితో, అన్ని జాగ్రత్తలు తీసుకుని చేశాం. కానీ ఇప్పుడు అంత భయం లేదు. అలవాటు అయింది.
అన్ని రకాల పాత్రలను చేయాలని ఉంది. అన్ని రకాల జానర్లలో సినిమాలు చేస్తున్నాను. అది నాకు చాలా ఆనందంగా ఉంది. మాస్ట్రోలోనూ కొత్తగా కనిపిస్తాను. సినిమా చూశాక జనాలు కూడా అదే అంటారు. ఇంకా కొత్త పాత్రలను చేయాలని అనుకుంటున్నాను. నితిన్తో పని చేయడం ఎంతో సరదాగా ఉంటుంది. ఎప్పుడు షూటింగ్ ప్రారంభించాం.. ఎప్పుడు పూర్తి చేశామో కూడా తెలియకుండా గడిచింది. దర్శకుడు, చిత్రయూనిట్ మొత్తం, తమన్నా ఇలా అందరూ ఎంతో సహకరించారు. తదుపరి చిత్రాల గురించి త్వరలో చెబుతాను.