Wednesday, March 18, 2026
HomeTrending Newsఒక్క విద్యార్ధికి నష్టం జరిగినా ఊరుకోం: లోకేష్

ఒక్క విద్యార్ధికి నష్టం జరిగినా ఊరుకోం: లోకేష్

ఎయిడెడ్ స్కూళ్ళ విషయంలో ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయం లక్షలాది మంది విద్యార్ధుల భవిష్యత్తుకు మరణశాసనం లాంటిదని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. అన్ని వ్యవస్థలను ధ్వంసం చేయాలన్నది పాలకుడి లక్ష్యమైతే ఒక్క విద్యావ్యవస్థను ధ్వంసం చేస్తే చాలని తత్వవేత్త మాకియవెల్లి చెప్పిన వ్యాఖ్యలను లోకేష్ గుర్తు చేశారు. ఎయిడెడ్ స్కూళ్ళ మూసివేతతో దిక్కుతోచని విద్యార్ధుల భవిష్యత్ కోసం చర్యలు తీసుకోవాలని కోరుతూ సిఎం జగన్ కు లోకేష్ బహిరంగ లేఖ రాశారు.

ఎయిడెడ్ పాఠశాలలు, కాలేజీల ఆస్తులను చేజిక్కించుకునేందుకే ప్రభుత్వం ఇలాంటి ప్రమాదకరమైన నిర్ణయం తీసుకుందని లేఖలో లోకేష్ ఆరోపించారు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్ధులు, తల్లిదండ్రులు రాష్ట్రవ్యాప్తంగా రోడ్డెక్కి నిరసన చేస్తున్నా తన వాదనను ప్రభుత్వం సమర్ధించుకోవడం మూర్ఖత్వమని మండిపడ్డారు. ఇటీవల టిఆర్ఎస్ ప్లీనరీలో ఆంధ్ర ప్రదేశ్ పరిస్థితిపై తెలంగాణా సిఎం కెసియార్ చేసిన వ్యాఖ్యలు ముఖ్యమంత్రిగా మీకు అవమానంగా అనిపిస్తుందో లేదో తెలియదు కానీ ఐదు కోట్ల ఆంధ్రులు మాత్రం తీరని అవమానకరంగా భావిస్తున్నారని లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు.

ఎయిడెడ్ విద్యాసంస్థలను, వాటి భూములను స్వాధీనం చేసుకొని 90 శాతం మంది విద్యార్ధులను విద్య నుంచి దూరం చేస్తున్నారని, దీని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని లోకేష్ స్పష్టం చేశారు. తాము అధికారంలోకి వస్తే కాంట్రాక్టు లెక్చరర్లను పర్మినెంట్ చేస్తామని హామీ ఇచ్చిన జగన్ ఇప్పుడు ఎయిడెడ్ కాలేజీల మూసివేత పేరుతో 750 మంది కాంట్రాక్టు లెక్చరర్లను అకస్మాత్తుగా తొలగించారని విమర్శించారు. మాకు అమ్మ ఒడి వద్దు, మా పిల్లలకు పాఠశాలలు కావాలంటూ ఆందోళన చేస్తోన్న తల్లిదండ్రులకు ఏం సమాధానం చెబుతారని లోకేష్ ప్రశ్నించారు. రాష్ట్రంలో ఏ ఒక్క పేద విద్యార్థికి అన్యాయం జరిగినా ఊరుకునే ప్రసక్తే లేదని, వారికి న్యాయం జరిగే వరకూ పోరాడుతామని హెచ్చరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular