తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) పాలకమండలి కీలక నిర్ణయం తీసుకుంది. ఈసారి బ్రహ్మోత్సవాల్లో కేవలం సర్వదర్శనం మాత్రమే అమలు చేయనుంది. బ్రహ్మోత్సవాలు జరిగే సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 5వ తేది వరకు సర్వదర్శన భక్తులకు మాత్రమే దర్శనానికి అనుమతిస్తామని టిటిడి ఈవో ఏవీ ధర్మారెడ్డి వెల్లడించారు. జిల్లా యంత్రాంగంతో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు పై ధర్మారెడ్డి సమావేశం నిర్వహించారు.
సామాన్య భక్తులుకు ప్రాధాన్యత ఇచ్చేందుకే కీలక నిర్ణయం తీసుకున్నామన్నారు. సెప్టెంబర్ 27వ తేదిన ధ్వజారోహణం సందర్భంగా శ్రీవారికి రాష్ర్ట ప్రభుత్వం తరపున సియం జగన్ పట్టు వస్ర్తాలు సమర్పిస్తారని చెప్పారు. అక్టోబర్ 1వ తేదీన గరుడ వాహనం,5వ తేదీన చక్రస్నానం ఉంటుందన్నారు. బ్రహ్మోత్సవాలు జరిగే తోమ్మిది రోజులు పాటు ప్రత్యేక దర్శనాలు రద్దు చేస్తున్నమన్నారు. అక్టోబర్ 1వ తేదిన గరుడసేవ సందర్భంగా ఘాట్ రోడ్డులో ద్విచక్ర వాహనాలు అనుమతించబోమని స్పష్టం చేశారు. వాహన సేవలు ప్రతిరోజూ ఉదయం 8 గంటలకు, రాత్రి 7 గంటలకు నిర్వహిస్తామని ధర్మారెడ్డి వివరించారు.