Sunday, March 8, 2026
Homeసినిమా'ఉస్తాద్' సెట్స్ పైకి పవన్ వచ్చేది అప్పుడే!

‘ఉస్తాద్’ సెట్స్ పైకి పవన్ వచ్చేది అప్పుడే!

పవన్ కల్యాణ్ ప్రస్తుతం ఫుల్ బిజీ. ఆయన చేయవలసిన మూడు సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. క్రిష్ దర్శకత్వంలో మొదలైన ‘హరి హర వీరమల్లు’ చాలావరకూ చిత్రీకరణ జరుపుకుంది. కారణం ఏదైనా ఈ సినిమా చిత్రీకరణ ఆగిపోయి చాలా కాలమే అవుతోంది. ఇక ఆ తరువాత సుజీత్  మొదలెట్టిన ‘OG’ కూడా కొంతవరకూ షూటింగు జరుపుకుంది. ఇక కాస్త అటు ఇటుగా హరీశ్ శంకర్ తో చేస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’. ఈ మూడు సినిమాలను పవన్ ఎప్పుడు పూర్తి చేస్తారా అనే ఒక సందిగ్ధం అభిమానులలో ఉంది.

ఈ మూడు సినిమాలను పవన్ సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసే అవకాశాలు ఉన్నాయనే ఒక స్పష్టత హరీశ్ శంకర్ నుంచి వచ్చింది. రవితేజతో హరీశ్ శంకర్ చేసిన ‘మిస్టర్ బచ్చన్’ ఈ నెల 15వ తేదీన విడుదల కానుంది. రవితేజ కథానాయకుడిగా నటించిన ఈ సినిమాతో, కథానాయికగా భాగ్యశ్రీ బోర్సే పరిచయమవుతోంది. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా పలకరించనున్న ఈ సినిమా ప్రమోషన్స్ లో హరీశ్ బిజీగా ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించిన ప్రస్తావన వచ్చింది.

హరీశ్ శంకర్ స్పందిస్తూ .. తమ నిర్మాతలు పవన్ తో మాట్లాడారనీ, పవన్ తన సినిమాలన్నీ  సాధ్యమైనంత త్వరలో పూర్తి చేయనున్నారని అన్నాడు. తమ సినిమా కంటే ‘హరి హర వీరమల్లు’ .. ‘OG’ సినిమాలకు పవన్ పనిచేయవలసిన రోజులు చాలా తక్కువనీ, అందువలన ముందుగా ఆయన ఆ సినిమాలను పూర్తిచేసి ఆ తరువాత తమ ప్రాజెక్టుపైకి రానున్నారని ఒక క్లారిటీ ఇచ్చాడు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి చూస్తే, ప్రేక్షకుల ముందుకు పవన్ వచ్చేది వచ్చే ఏడాదిలోనని అర్థమవుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular