Tuesday, September 24, 2024
HomeTrending NewsMorena: మధ్యప్రదేశ్‌లో ఆరుగురి కాల్చివేత

Morena: మధ్యప్రదేశ్‌లో ఆరుగురి కాల్చివేత

మధ్యప్రదేశ్‌లోని మొరెనా జిల్లాలో పడగవిప్పిన పాతకక్షలు ఆరుగురి ప్రాణాలు తీసాయి. గతంలో తమవారిని హతమార్చారన్న కక్షతో సామూహికంగా దాడి చేసి తుపాకులతో కాల్పులు జరపడంతో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి చెందారు. వీరిలో ముగ్గురు మహిళలు ఉన్నారు. పలువురు గాయపడ్డారు. మొరెనా జిల్లా కేంద్రానికి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న లేప గ్రామంలో శుక్రవారం ఉదయం ఈ దారుణం చోటు చేసుకుంది. సంఘటన వివరాల్లోకి వెళ్తే.. ధీర్‌ సింగ్‌ తోమర్‌, గజేంద్ర సింగ్‌ తోమర్‌ మధ్య చెత్త డంపింగ్‌కు సంబంధించి 2013 నుంచి వివాదం ఉంది.

అ సందర్భంగా జరిగిన ఘర్షణలో ధీర్‌సింగ్‌ కుటుంబాన్ని హత్య చేసిన గజేంద్ర సింగ్‌ కుటుంబం గ్రామం నుంచి పారిపోయింది. తర్వాత ఈ వివాదానికి సంబంధించి ఇరు వర్గాల మధ్య కోర్టు బయట ఒప్పందం జరిగింది. దీంతో గజేంద్ర సింగ్‌ కుటుంబ సభ్యులు గ్రామానికి చేరుకున్నారు. అయితే గతంలో తమవారిని హత్యచేసిన వారిని ఎలాగన్నా చంపాలని ముందుగానే వేసుకున్న పథకం ప్రకారం ధీర్‌ సింగ్‌ కుటుంబానికి చెందిన వారు వారిపై తుపాకులు, కర్రలతో దాడి చేశారు. వారి కుటుంబ సభ్యులు ఆరుగురిని కాల్చి చంపారు. మరణించిన వారిలో గజేంద్ర సింగ్‌, అతని ఇద్దరు కుమారులు సహా ముగ్గురు మహిళలు ఉన్నారు. ఈ దారుణానికి ఒడిగట్టిన హంతకులను హతమార్చాలని బాధితుల కుటుంబ సభ్యులు డిమాండ్‌ చేశారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు ఎనిమిది మందిని గుర్తించి వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్