Monday, May 20, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంకదిలేది. . .కదిలించేది... అంతా సూర్యుడే

కదిలేది. . .కదిలించేది… అంతా సూర్యుడే

Sun is Everything: అది లంకలో యుద్ధ భూమి. మొదటి రోజు రామ – రావణుల మధ్య భీకరమయిన యుద్ధం జరిగింది. రెండు వైపులా మహా వీరులందరూ కేవలం ప్రేక్షకులుగా మిగిలి, భూమ్యాకాశాలు బద్దలయ్యే ఆ యుద్ధాన్ని నోరెళ్ళబెట్టి చూస్తున్నారు . ఒక దశలో సాక్షాత్తు శ్రీరామచంద్రుడే ఆలోచనలో పడ్డాడు – చెలరేగిపోతున్న రావణుడిని గెలవడం అంత తేలిక కాదేమో అని . ఆ క్షణంలో అగస్త్యుడు ప్రత్యక్షమయ్యాడు .

“రామ రామ మహాబాహో !” అంటూ ఆదిత్య హృదయం బోధించి , సూర్యుడిని ప్రార్థించి ఆ బలంతో వెంటనే రావణుడిని సంహరించు – అని వచ్చినంత వేగంగా వెళ్ళిపోయాడు . రాముడు అలాగే చేశాడు . అప్పటి నుండి లోకానికి ఆదిత్య హృదయం అందింది .

రోజులు ఏడు . సూర్యుడి రథం గుర్రాలు ఏడు . సప్తాశ్వారథమారూఢం- ఏడు రోజులే ఏడు గుర్రాలుగా;
ఏడు వర్ణాల కిరణాల దారులమీద కోట్ల ఏళ్లుగా అలుపెరుగని రథం మీద ఆగని , ఆగకూడని ప్రయాణం సూర్యుడిది

విష్ణుసహస్రనామంలో – సూర్య చంద్ర నేత్రే -అని ఉంటుంది . విరాట్ పురుషుడి రెండు కళ్లు – సూర్య చంద్రులు . చెట్ల పత్రహరిత ప్రాణం పాదుకొల్పడానికి సూర్యుడు కారణం . మన శరీరంలో విటమిన్ డి ఏర్పడి ఎముకలు నిలబడడానికి కారణం సూర్యుడు . నీరు ఆవిరి అయి మేఘం ఏర్పడడానికి కారణం సూర్యుడు . నానా మురికి ఎండి చెత్త తగ్గడానికి కారణం సూర్యుడు . కుళ్ళినవి అలాగే మిగలకుండా వాడిపోయేలా కావడానికి కారణం సూర్యుడు.

సూర్యుడు అసాధారణ పండితుడు . లెక్కల ఉపాధ్యాయుడు . హనుమంతుడికి సర్వ శాస్త్రాలు బోధించిన గురువు. అపరిమిత శక్తి ప్రదాత . అపరిమిత వేడితో తను రగిలిపోతూ – లోకాలకు వెలుగులు పంచే త్యాగి . అంతులేని వెలుగులు విరజిమ్మే అతిపెద్ద విద్యుత్ ఉత్పత్తి వ్యవస్థ .

ప్రత్యక్షంగా మన కంటికి కనపడే ఏకైక దైవం సూర్యనారాయణుడు. సూర్యుడి నడకే మనకు కాలం. సూర్యుడి రాకే పొద్దు పొడుపు. అందులో ఉత్తరాయణం పుణ్యకాలం. ఆ ఉత్తరాయణ పుణ్యకాలం కోసమే భారతంలో భీష్ముడు అంపశయ్యపై ప్రాణాలను ఉగ్గబట్టుకుని నిరీక్షించాడు.

కనుమ మహిమ కనుమా!
పశు పోషణ, వ్యవసాయం, వర్తకం- ఈ మూడింటిని కలిపి వార్త అన్నారు. నిఘంటువుల ప్రకారం వార్తకు ఇప్పటికీ అదే అర్థం. కానీ, కాలగతిలో కొన్నిమాటలకు అర్థసంకోచం వల్ల మరేదో అర్థం ధ్వనిస్తుంది. ఇప్పుడు వార్త అంటే కేవలం న్యూస్. “వార్తయందు జగము వర్తిల్లుచున్నది అదియు లేనినాడ అఖిల జనులు అంధకారమగ్నులగుదురు కావున వార్త నిర్వహింపవలయు బతికి ”
అన్న భారత పద్యం అక్షరాలా న్యూస్ గురించే చెప్పిందనుకుని తెలుగు ప్రింట్ మీడియా దశాబ్దాల తరబడి ఈ పద్యాన్ని తెగవాడుకుంది. అర్థంలేని ఎన్నో మాటలను సృష్టించి జనం మీద వదలడంతో పోలిస్తే ఇంత మంచి పద్యం ఏదో ఒక అర్థంలో అన్నేళ్లపాటు ప్రచారంలో ఉన్నందుకు సంతోషించాలి. ఇప్పుడు పద్యమూ లేదు, అర్థమూ లేదు.

అన్వీక్షకి, త్రయీ, వార్త, దండ నీతి – ఈ నాలుగు విద్యలు రాజుకు తప్పనిసరిగా వచ్చి ఉండాలన్నాడు 2,300 సంవత్సరాలకిందట చాణక్యుడు అర్థశాస్త్రంలో.

1. అన్వీక్షకి- తర్కం;

2. త్రయి- ఋగ్యజుస్సామవేదాలు(అధర్వణ వేదాన్ని పక్కన పెట్టారు);

3. వార్త- పశు పోషణ, వ్యవసాయం, వర్తకం;

4. దండనీతి- అడ్మినిస్ట్రేషన్

ఏ వార్తను ఎలా మేనేజ్ చేయాలో? ఏ వేషంలో వెళ్లి ఏ వార్తను ఎలా సేకరించాలో? వచ్చిన సమాచారాన్ని రాజుకు ఎంతవరకు చెప్పాలో ? అసలు చెప్పాలో వద్దో అన్న విషయాలను చాణక్యుడు దండనీతి విభాగంలోనే చెప్పాడు కానీ వార్త ప్రకరణంలో చెప్పలేదు.

అయినా- ప్రస్తుతం మనచర్చ కనుమ పండుగ కాబట్టి వార్తలో ఉన్న పశుపోషణకే పరిమితమై దండనీతిలో ఉన్న వార్తను వదిలేద్దాం. పాశం అంటే తాడు. పాశంతో కట్టి ఉంటుంది కాబట్టి పశువు అయ్యింది. మన్ అన్న సంస్కృత ధాతువు నుండి మనిషి అన్న మాట పుట్టింది. అంటే ఆలోచించే స్వభావం ఉన్నవారు అని అర్థం. ఇందులో నుండే మననం, మనసు, మానవత్వం పుట్టాయి. అందుకే అవి లేనప్పుడు మనిషివా? పశువ్వా? అంటాం. మనకుమాత్రమే మనసు, ఆలోచన, మననం ఉంటాయి, పశువులకు ఉండవు అనుకుని మనం చాలా పాశవికంగా ప్రవర్తిస్తున్నామేమో? గొడ్డును బాదినట్లు వాటిని బాదేస్తున్నాం. మనిషికో మాట – గొడ్డుకో దెబ్బ అని చెప్పి మరీ కుమ్మి పారేస్తున్నాం. పశువుల సంతగా మార్చేస్తున్నాం. ఎద్దు పుండు కాకికి ముద్దు. పశువులను మనం అంతకంటే భిన్నంగా చూస్తున్నామా?

అందుకే పశువులు, ప్రత్యేకించి ఆవులు, ఎద్దులను గౌరవంగా చూడ్డానికి, చూడాలన్న స్ఫూర్తిని నింపడానికి ఏర్పడింది కనుమ. మొత్తంగా పాడి పంటలకు సంబంధించినది కనుమ. ఆవులు, ఎడ్లు తొక్కనినేల మన ఆచారంలో ఉపయోగించడానికి వీలులేనిది. చివరికి యజ్ఞం చేయాలన్నా మొదట కాడికి ఎడ్లను కట్టి, నాగలితో భూమిని దున్ని ప్రారంభించాలి. మిథిల అవుట్ స్కర్ట్స్ లో జనకుడు అలా దున్నుతుంటే నాగేటిచాలుకు దొరికింది సీతమ్మ. నాగేటితో దున్నినప్పుడు భూమిపై గింజలు చల్లడానికి అనువుగా చేసిన లైన్లను నాగేటి చాలు అంటారు. సంస్కృతంలో సీత. అందుకే ఆమె పేరు సీత అయ్యింది. జనకుడి కూతురుగా పెరిగింది కాబట్టి జానకి. మిథిలలో పుట్టింది కాబట్టి మైథిలి.

రోజురోజుకూ రైతు అనామకుడవుతున్నాడు. ప్రపంచానికి అన్నం పెట్టే రైతుకు పట్టెడన్నం కరువై పురుగులమందే ఆహారమవుతోంది.
ఇప్పుడు రైతు ఒక విషాదం.
వ్యవసాయం ఒక విధ్వంసం.

కనుమ వేళ పాడి పంటలతో కళకళలాడే రైతు దృశ్యం ఆవిష్కారం కావాలని కోరుకుంటూ-
పాలిచ్చే గోవులకు,
పనిచేసే బసవడికి,
పండించే రైతులకు,
ఫలమిచ్చే పొలాలకు శతకోటి నమస్కారాలు.

సంక్రాంతి మాటలోనే ఉంది క్రాంతి, కాంతి. ఆ కాంతులు అందరికీ సుఖశాంతులు పంచాలని కోరుకుందాం.

-పమిడికాల్వ మధుసూదన్

Also Read : పద పదవే ఒయ్యారి గాలి పటమా!

RELATED ARTICLES

Most Popular

న్యూస్