Sunday, September 8, 2024
HomeTrending NewsBJP: మూడో జాబితాలో సమతూకానికి ప్రాధాన్యత

BJP: మూడో జాబితాలో సమతూకానికి ప్రాధాన్యత

తెలంగాణ ఎన్నికల కోసం బిజెపి మూడో జాబితా విడుదల చేసింది. మూడో జాబితాలో బిసిలకు పెద్దపీట వేసినట్టుగా స్పష్టం అవుతోంది. కులాల వారిగా సమతూకం పాటించేందుకు ప్రాధాన్యత ఇచ్చారు. శేరిలింగంపల్లి, కూకట్ పల్లి, మల్కజగిరి తదితర నియోజకవర్గాలు జనసేన కోసం ఉంచినట్టు తెలుస్తోంది. వాటిపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. మూడో జాబితాలో కొన్ని కీలక నియోజకవర్గాల్లో ఎవరు ఉహించని వారికి టికెట్లు దక్కాయి.

హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మి ముషీరాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేశారు. ముషిరాబాద్ నుంచి కే లక్ష్మణ్, దత్తాత్రేయ ఇద్దరు దిగ్గజ నేతలు ఉండటంతో వారిలో ఎవరో ఒకరికి సంబంధించిన వారికే వస్తుందని అందరు అనుకున్నారు. అనూహ్యంగా బిజెపి OBC మోర్చ చైర్మన్, గంగపుత్ర సామాజిక వర్గానికి చెందిన పూస రాజుకు కేటాయించారు. సనత్ నగర్ లో మర్రి శశిధర్ రెడ్డిని పోటీలోకి దించటం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు తలనొప్పి అనే చెప్పాలి.

BJP OBC మోర్చ చైర్మన్ కే లక్ష్మణ్ తో ముషిరాబాద్ బిజెపి అభ్యర్థి పూస రాజు

కేంద్రమంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రాతినిధ్యం వహించిన అంబర్ పేట్ నుంచి మాజీ మంత్రి కృష్ణ యాదవ్ ను బరిలోకి దించారు. ఇక్కడి నుంచి కిషన్ రెడ్డి తన భార్య కావ్య కోసం యత్నించినా నాయకత్వం సమ్మతించలేదు. దీంతో హైదరాబాద్ సెంట్రల్ పార్టీ అధ్యక్షుడు గౌతం రావు కోసం కిషన్ రెడ్డి లాబీయింగ్ చేసినా అంతిమంగా కృష్ణ యాదవ్ కు ఇచ్చారు. యాదవ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం కల్పించినట్టయింది. బీఆర్ఎస్ నుంచి కాలేరు వెంకటేష్ బరిలో ఉన్నారు. కాంగ్రెస్, MIM ఇంకా అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.

PRESS RELEASE–3rd List of BJP candidate for General Election to the Legislative Asembly of Telangana on 02.11.2023

ఎల్.బి నగర్ నుంచి పార్టీ నేత సామ రంగారెడ్డికి పార్టీ టికెట్ దక్కింది. ఎల్బి నగర్ పరిధిలో బిజెపి క్యాడర్ బలంగా ఉంది. ఇక్కడ బీఆర్ఎస్ నుంచి తాజా మాజీ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుదీర్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి మధుయాష్కి రంగంలో ఉన్నారు. బీఆర్ఎస్, బిజెపి అభ్యర్థులు రెడ్డి సామాజిక వర్గం కావటంతో మైనారిటీలు, బిసిల ఓట్లు ఎవరిని వరిస్తాయో చూడాలి. సుదీర్ రెడ్డి అక్రమాలకూ పాల్పడుతున్నారని బిజెపి కార్పొరేటర్లు కొద్ది రోజులుగా ప్రచారం చేస్తున్నారు.

జడ్చర్ల నుంచి మాజీ మంత్రి చిత్తరంజన్ దాస్ కు అవకాశం ఇచ్చారు. గతంలో మాజీ సిఎం ఎన్టిఆర్ ను కల్వకుర్తిలో ఓడించిన చిత్తరంజన్ దాస్.. బీఆర్ఎస్ అభ్యర్థి, మాజీ మంత్రి లక్ష్మారెడ్డితో ఏ విధంగా తలపడతారో ఆసక్తి రేపుతోంది. కాంగ్రెస్ నుంచి అనుదీప్ రెడ్డి , లక్ష్మారెడ్డిలు ఒకే సామజిక వర్గం కావటంతో ఇతర వర్గాల ఓట్లు కొల్లగొట్టేందుకు బిజెపి చిత్తరంజన్ ను తెరమీదకు తీసుకొచ్చింది.

జర్నలిస్టుగా వివిధ మీడియా సంస్థల్లో సేవలందించిన జన్వాడే సంగప్పను నారాయణ్ ఖేడ్ అభ్యర్థిగా ప్రకటించారు. ఓటమి ఎరుగని ఎమ్మెల్యే భూపాల్ రెడ్డితో సంగప్ప తలపడుతున్నారు. కొన్నాళ్ళుగా క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులను సమన్వయం చేస్తున్న సంగప్ప..నియోజకవర్గంలో లింగాయత్ సామాజికవర్గం ఎక్కువగా ఉండటం కలిసి వచ్చే అంశం. కాంగ్రెస్ నుంచి సురేష్ షెట్కార్ బరిలో ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే కుమారుడు డాక్టర్ సంజీవరెడ్డి, మాజీ ఎమ్మెల్యే సురేష్ షెట్కార్ ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా ఉండటంతో పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.

ఉప్పల్ నియోజవర్గంపై చివరి వరకు ఉగిసలాట కొనసాగినా…మాజీ ఎమ్మెల్యే NVSS ప్రభాకర్ కు కేటాయించారు. యువనేత వీరెంధర్ గౌడ్, తాజా మాజీ ఎమ్మెల్యే సుభాస్ రెడ్డిల్లో ఎవరో ఒకరికి ఇస్తారని ప్రచారం జరిగింది. కాంగ్రెస్ నుంచి పరమేశ్వర్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి బండారు లక్ష్మారెడ్డి బరిలో ఉన్నారు. కాంగ్రెస్ టికెట్ రాకపోవటంతో రాగిడి లక్ష్మారెడ్డి,  AS రావు నగర్ కార్పొరేటర్ శిరీష భర్త సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరారు. నియోజవర్గంలో బలమైన క్యాడర్,  సౌమ్యుడిగా పేరున్న ప్రభాకర్ కు కలిసి వచ్చే అంశాలు.

పార్టీ ముఖ్య నేతలు ఇతర పార్టీలకు వలస మొదలు కావటంతో ఢిల్లీ నాయకత్వం మూడో జాబితాపై పెద్ద కసరత్తు చేసినట్టుగా ఉంది. కొన్ని చోట్ల సామజిక వర్గాల సమతూకం కోసం ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి ఇచ్చినా..ముఖ్య నియోజకవర్గాల్లో పార్టీ విధేయులకే అవకాశం ఇచ్చారు. ప్రధాని మోడీ, అమిత్ షా,నడ్డా, రాజ్ నాథ్ సింగ్ తదితర అగ్రనేతలే జాబితా కూర్పులో భాగస్వాములు కావడం..వారసత్వ రాజకీయాలకు, పైరవీకారులకు చెక్ పెట్టినట్టు అయింది.

35 మందితో బిజెపి మూడవ జాబితా

అభ్యర్థులు వీరే..

1. మంచిర్యాల: వీరబెల్లి రఘునాథ్
2. ఆసిఫాబాద్ అజ్మీర అత్రం నాయక్
13. బోధన్ వడ్డి: మోహన్ రెడ్డి
4. బాన్సువాడ : లక్ష్మీనారాయణ
5. నిజామాబాద్ రూరల్: దినేష్ కులాచారి
6. మంథని : సునీల్ రెడ్డి
7. మెదక్: విజయ్ కుమార్
8. నారాయణఖేడ్: సంగప్ప
9. ఆందోల్ (ఎస్సీ): బాబూ మోహన్
10. జహీరాబాదఖ ((ఎస్సీ): రామచంద్ర రాజా నరసింహ
11 ఉప్పల్: ఎన్ వీ ఎస్ ఎస్ ప్రభాకర్
12 లాల్ బహదూర్ నగర్ : రంగారెడ్డి
13. రాజేంద్రనగర్: శ్రీనివాసరెడ్డి
14 చేవెళ్ల (ఎస్ సీ): రత్నం
15 పరిగి : మారుతీ కిరణ్
16 ముషీరాబాద్: పోసారాజు
17 మలక్ పేట సురేందర్ రెడ్డి
18 అంబర్ పేట: కృష్ణయాదవ్
19 జూబ్లీ హిల్స్ : దీపక్ రెడ్డి
20 సనత్ నగర్ : మర్రి శశిధర్ రెడ్డి
21 సికింద్రాబాద్ మేకల సారంగపాణి
22 నారాయణపేట: పాండు రెడ్డి
23 :జడ్చర్ల: చిత్తరంజన్ దాస్
24. మక్తల్ : జలంధర్ రెడ్డి
25 వనపర్తి: అశ్వత్థామరెడ్డి
26 అచ్చంపేట (ఎస్ సీ): సతీష్ మాదిగ
27 షాద్ నగర్: అందె బాబయ్య
28 దేవరకొండ (ఎస్ టీ); కే లాలూనాయక్
29 హుజూర్ నగర్: చల్లా శ్రీలతా రెడ్డి
30 నల్లగొండ: ఎమ్ శ్రీనివాస్ గౌడ్
31 ఆలేరు: వడల శ్రీనివాస్
32 పరకాల: డా. పి. కాళీ ప్రసాదరావు
33 పినపాక: (ఎస్ టీ) పి. బాలరాజు
34 పాలేరు: నున్నా రవికుమార్
35 సత్తుపల్లి(ఎస్సీ) రామలింగేశ్వర రావు

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్