Friday, March 13, 2026
HomeTrending Newsఆసియా ఖండంలోనే అరుదైన పోలీస్ భవనం

ఆసియా ఖండంలోనే అరుదైన పోలీస్ భవనం

ఈ ఫోటోలు చూస్తుంటే ఏమనిపిస్తుంది? మైక్రోసాఫ్ట్ లేదా అమెజాన్, టిసిఎస్, ఇన్ఫోసిస్, యాక్సెంచర్ లాంటి దిగ్గజ ఐటీ సంస్థలు తమ ప్రధాన కార్యాలయాన్ని నిర్మిస్తున్నట్లు అనిపించడంలేదూ? అలా అనుకుంటే పప్పులో కాలేసినట్లే.
ఏడు సంవత్సరాల క్రితం ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఒక మహత్తరమైన ఆలోచన వచ్చింది. రాష్ట్రంలో ఏ మూలన ఏ నేరం జరిగినా, ఎలాంటి దుస్సంఘటన జరిగినా ఆ దృశ్యాలు, హైదరాబాద్ లోని పోలీస్ కార్యాలయంలో కనిపించాలి. స్థానిక పోలీసులు అజాగ్రత్తగా ఉన్నా, హైదరాబాద్ నుంచే సెంట్రల్ కమాండ్ పోలీసులు ఆ ఘటనను లోకల్ పోలీసు అధికారుల దృష్టికి తీసుకెళ్లి అప్రమత్తం చెయ్యాలి. రాష్ట్రంలోని అన్ని సిసిటివి కెమెరాలను, వ్యవస్థలను కేంద్ర కార్యాలయం నెట్ వర్క్ కు అనుసంధానం చెయ్యాలి. నేరాలను నియంత్రించడంలో ఈ కార్యాలయం కీలక పాత్ర పోషించాలి.
ఆలోచన వస్తే ప్రయోజనం ఏముంది ? ఆచరణలో పెట్టాలి కదా! వెంటనే పోలీస్ ఉన్నతాధికారులతో, నిపుణులతో సమావేశాలు ఏర్పాటు చేసారు కేసీఆర్. వాహనాలకు, భవనాలకు సుమారు తొమ్మిది వందల కోట్ల రూపాయలను మంజూరు చెయ్యడం, భవన నిర్మాణం మొదలు కావడం చకచకా జరిగిపోయింది. మధ్యలో కరోనాతో కొన్నాళ్ళు బ్రేక్ వేసినప్పటికీ వెయ్యి కోట్ల రూపాయల ట్విన్ టవర్స్ భవనాలు రికార్డ్ సమయంలో పూర్తి చేయించడంలో కేసీఆర్ కీలకపాత్ర పోషించారు.
బంజారా హిల్స్ లో ఏడు ఎకరాల సువిశాల స్థలంలో 640 వేల చదరపు అడుగుల స్థలంలో ఇరవై అంతస్తుల భారీ భవనం నిర్మించబడింది. ఆసియా ఖండంలోనే ఇలాంటి భవనం లేదు. ఫోటో వోల్టిక్ రూఫ్ అనే అధునాత సాంకేతిక పద్ధతిలో భూమట్టానికి అరవై అడుగుల ఎత్తున నిర్మించబడింది. దీనిలో ముఖ్యమంత్రి, హోమ్ మంత్రి, డిజిపి, పోలీస్ కమిషనర్ లకు ప్రత్యేక ఆఫీసులు ఉంటాయి. ప్రజలు సందర్శించడానికి ఆరో అంతస్తుట్లో పబ్లిక్ గ్యాలరీ ఏర్పాటు చేశారు. హెలికాఫ్టర్ దిగడానికి హెలీప్యాడ్ నిర్మించబడింది. ఈ భవనంలో ఒకేసారి 1130 మంది ఉద్యోగులు కంప్యూటర్ల మీద పనిచేసే సదుపాయం ఉన్నది.
తెలంగాణ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్
తెలంగాణలో తన కలలపంటగా రూపొందిన ఈ బృహద్భవనానికి రేపు(గురువారం) ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభోత్సవం చేయనున్నారు. ఇలాంటి ఆకాశహర్మ్యం దేశంలోనే మొదటిసారిగా పోలీసు శాఖకు తెలంగాణలో నిర్మించారు. రాష్ట్రంలో శాంతిభద్రతల అదుపులో నిర్దాక్షిణ్యంగా వ్యవహరించాలని కేసీఆర్ ఇప్పటికే అనేకమార్లు పోలీసులకు స్పష్టం చేశారు. కేసీఆర్ దూరదృష్టికి, పాలనాదక్షతకు, చిత్తశుద్ధికి, పట్టుదలకు ప్రతీకగా నిలిచిపోయే ఒక మాన్యుమెంటల్ పోలీస్ కమాండ్ కంట్రోల్ భవనం దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్ లో ఏర్పాటయింది.
తెలంగాణ నూతన సచివాలయం
ఇక్కడ ఒక విషయాన్నీ తప్పకుండా చెప్పుకోవాలి. కొందరు ముఖ్యమంత్రులు పదేళ్లు, పదునాలుగేళ్ళు పరిపాలించినా శంకుస్థాపనలే తప్ప ప్రారంభోత్సవాలు చెయ్యలేరు. ఎన్నేళ్లు అధికారం ఇచ్చినా ఒక్క ప్రాజెక్ట్ కూడా పూర్తి చెయ్యలేరు. కానీ కేసీఆర్ తీరే వేరు. ఆయన చేతిమీదుగా శంకుస్థాపన జరిగిన కాళేశ్వరం, మల్లన్నసాగర్, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, యాదాద్రి, నూతన సచివాలయం, ప్రతి జిల్లాలోనూ సరికొత్త హంగులతో కలెక్టరేట్లు, ఎస్పీలకు కార్యాలయాలు…ఇలా ఒకటికాదు..రెండు కాదు…దేనికైతే శంకుస్థాపన చేశారో, తన చేతితోనే దాన్ని ప్రారంభించే అదృష్టం కూడా కేసీఆర్ దక్కించుకుని చరిత్ర సృష్టించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular