Friday, September 20, 2024
HomeTrending NewsVijayaBheri: హోంగార్డు ఆత్మహత్య...ప్రభుత్వ హత్యే - రేవంత్ రెడ్డి

VijayaBheri: హోంగార్డు ఆత్మహత్య…ప్రభుత్వ హత్యే – రేవంత్ రెడ్డి

హోంగార్డు రవీందర్ ఆత్మహత్య… రాష్ట్ర ప్రభుత్వం, కేసీఆర్ చేసిన హత్య అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ పై హత్యా నేరం కింద క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఈ రోజు డిజిపి అంజని కుమార్ ను కలిసి హోం గార్డు కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. హైదరాబాద్ లో నిర్వహించే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాలు, కాంగ్రెస్ బహిరంగ సభకు భద్రత కల్పించాలని, అధికార పార్టీ నుంచి ఆటంకాలు లేకుండా సహకరించాలని కోరారు.

ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన రేవంత్ రెడ్డి…హోంగార్డు రవీందర్ జీతాలు రాక ఆత్మహత్య చేసుకున్నాడని డీజీపీ దృష్టికి తెచ్చామన్నారు. హోంగార్డులకు 5 నెలలుగా జీతాలు ఇవ్వలేని స్థితిలో ప్రభుత్వం ఉందని విమర్శించారు. రాష్ట్రం ఆర్ధిక సంక్షోభంలో కూరుకుపోయిందని, రాష్ట్రం దివాళా తీయడానికి కారణం కేసీఆర్ అవినీతి కుటుంబ పాలనే కారణం అని ఆరోపించారు. కాంట్రాక్టర్లు, కమీషన్లు ఇచ్చే వారికే బిల్లులు ఇస్తున్నారని, రవీందర్ పిల్లల చదువుల ఖర్చు ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేశారు. కుటుంబంలోఒకరికి ఉద్యోగం, 25లక్షల పరిహారం ఇవ్వాలని డీజీపీని కోరామన్నారు.

ఈ నెలలోని 16, 17 న తాజ్ కృష్ణ లో సీడబ్ల్యూసీ సమావేశాలు జరుగుతాయని, 17న విజయ భేరి బహిరంగ సభను నిర్వహిస్తున్నామని రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఇందుకు సంబంధించి భద్రతను అందించాలని డీజీపీని కోరామని, పరేడ్ గ్రౌండ్ ఇవ్వకుండా బీజేపీ, బీఆరేస్ కుట్ర చేశాయని ఆరోపించారు. విజయభేరి బహిరంగ సభకు భద్రత కల్పించాలని కోరామన్నారు. కేసీఆర్ రాజకీయ విజ్ఞతతో వ్యవహరించాలని సూచించారు. ప్రభుత్వం నుంచి ఆటంకాలు కలగకుండా చూడాలని, విజయభేరీ సభకు ఆటంకం కలిగించడం సరైంది కాదని రేవంత్ అన్నారు. కేసీఆర్ చిల్లర ప్రయత్నాలను ప్రజలు గమనిస్తున్నారని, తుక్కుగూడాలో సభ ఏర్పాటు చేయాలని ప్రాథమికంగా నిర్ణయించామన్నారు. కనీవినీ ఎరుగని విధంగా విజయభేరి సభను నిర్వహించి తీరతామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్