Thursday, March 12, 2026
HomeTrending Newsగూడెంలో కల్తీ మద్యం ఆధారాలు లేవు

గూడెంలో కల్తీ మద్యం ఆధారాలు లేవు

No evidences: జంగారెడ్డిగూడెంలో కల్తీ మద్యం కారణంగా మరణాలు సంభవించినట్లు ఎలాంటి ఆధారాలు లేవని స్పెషల్ ఎన్ఫోర్స్ మెంట్ బ్యూరో (ఎస్ఈబీ) కమిషనర్ వినీత్ బ్రిజిలాల్ స్పష్టం చేశారు. మూడు బాధిత కుటుంబాలు ఇచ్చిన ఫిర్యాదు పై విచారణ చేపట్టామని, ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ఆధారంగా విచారణ నిర్వహించి అవసరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఆదివారం సాయంత్రం విజయవాడ ఆర్టీసీ కాంప్లెక్స్ లోని అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ లో ఎక్సైజ్, ఎస్ఈబీ అధికారులు ఏర్పాటు చేసిన సంయుక్త మీడియా సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి రజిత్ భార్గవతో కలిసి వినీత్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ 2020మేలో ఎస్ఈబీ ఏర్పాటైందని, దేశంలోనే ఇలాంటి శాఖ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే మొదటిసారిగా నెలకొల్పారని చెప్పారు. నాటుసారా తయారీ, గంజాయి, ఎర్రచందనం, అక్రమ స్మగ్లింగ్ లపై చర్యల కోసం ఎస్ఈబీ పనిచేస్తోందన్నారు. ఇప్పటివరకు 93,722 కేసులు నమోదు చేశామని, 70వేల మందికి పైగా అరెస్ట్ చేశామన్నారు. గతంతో పోలిస్తే సారా తయారీపై గట్టి చర్యలు తీసుకున్నామన్నారు.  వైజాగ్ ఏజెన్సీలో ఆపరేషన్ పరివర్తన్ నిర్వహించామని వివరించారు.

ఈ ప్రభుత్వం ఏ ఒక్క డిస్టిలరీ కంపెనీకి అనుమతి ఇవ్వలేదని గతంలో ఏ కంపెనీల్లో మద్యం తయారయ్యేదో ఇప్పుడు కూడా అక్కడే తయారవుతోందని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి రజిత్ భార్గవ అన్నారు.

రాష్ట్రంలో మద్యం వాడకం గణనీయంగా తగ్గిందన్నారు, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత లిక్కర్ అమ్మకాలు 37 శాతం, బీరు 77శాతం తగ్గాయన్నారు. రెవెన్యూ దృష్ట్యా కొన్ని మద్యం బ్రాండ్ల రేట్లు పెంచామని , కొన్ని బ్రాండ్ల రేట్లు తగ్గించామని వివరించారు. రాష్ట్రంలో ఉన్న 43 వేల బెల్ట్ షాపులను తొలగించామని, మద్యం దుకాణాలు వేళలను కూడా ఉదయం 11 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకే పరిమితం చేశామని వివరించారు. ప్రజల్లో మద్య నియంత్రణపై అవగాహన కలిగించడానికి మద్య విమోచన ప్రచార కమిటీలు రాష్ట్రమంతా పనిచేస్తున్నాయని, దశల వారీగా మద్యం వాడకాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకున్నామని వివరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular