Saturday, March 14, 2026
HomeTrending Newsమేడ్చల్ రహదారికి మహర్దశ

మేడ్చల్ రహదారికి మహర్దశ

పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రజలకు రవాణా సౌకర్యార్థం కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సుచిత్ర జంక్షన్ తో సహా మూడు ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణం చేపట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారని రాష్ట్ర రోడ్లు-భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. సుచిత్ర జంక్షన్ వద్ద నిర్మించబోయే ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ స్థలాన్ని సోమవారం స్థానిక ఎమ్మెల్యే కె.పి వివేకానంద,ఎమ్మెల్సీ శంబిపూర్ రాజు, ప్రభుత్వ విప్ బాల్క సుమన్,NHAI అధికారులతో కలిసి మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ హైదరాబాద్-నాగపూర్ జాతీయ రహదారిపై సుచిత్ర జంక్షన్,డైరీ ఫామ్ జంక్షన్, దూలపల్లి జంక్షన్,మేడ్చల్ టౌన్     వద్ద నాలుగు ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు NHAI,ఆర్ అండ్ బి శాఖ కలిసి డీపీఆర్ లు రూపొందించామని మంత్రి అన్నారు.

సుచిత్ర నుండి గుండ్లపోచంపల్లి వరకు 10 కి.మీ పొడవునా మూడు ఎలివేటెడ్ కారిడార్లు,నాలుగు అండర్ పాస్ లు, సర్వీస్ రోడ్లు,జంక్షన్ ల విస్తరణ జరగనుందన్నారు. దీనికోసం సుమారు 450 కోట్ల అంచనా వ్యయంతో ప్రణాళికలు రూపొందించామని చెప్పారు. గుండ్లపోచం పల్లి నుండి కళ్లకల్ వరకు 17కి.మీ సర్వీస్ రోడ్లు,జంక్షన్ ల విస్తరణ, మేడ్చల్ టౌన్ లో ఫ్లై ఓవర్, భూసేకరణ నిమిత్తం సుమారు 800 కోట్ల నిర్మాణ అంచనా వ్యయంతో ప్రణాళికలు సిద్ధం చేశామని అన్నారు. NHAI తో సంప్రదింపులు జరుపుతున్నామని త్వరలోనే ఈ ప్రాజెక్టు మొదలు కానుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయంతో కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ప్రజలతో పాటు ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్,మెదక్,కరీంనగర్ జిల్లాల ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు తొలగనున్నాయని తెలిపారు.కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కె.పి వివేకానంద, ఎమ్మెల్సీ శంబిపూర్ రాజు కలిసి పలుమార్లు ఈ జంక్షన్ లో ట్రాఫిక్ సమస్యను ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారని,ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్ అండ్ బి శాఖ ను ప్రజల ట్రాఫిక్ సమస్య పరిష్కారం అయ్యేలా సంబంధిత ప్రణాళికలు రూపొందించారని ఆదేశించారని ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular