Monday, July 1, 2024
HomeTrending Newsతెలంగాణలో సిద్ధమవుతున్న బదిలీల చిట్టా..

తెలంగాణలో సిద్ధమవుతున్న బదిలీల చిట్టా..

ఎన్నికలు పూర్తవ్వడంతో పరిపాలనపై దృష్టి సారించిన సీఎం రేవంత్‌ రెడ్డి.. ప్రభుత్వ శాఖల్లో సుదీర్ఘ కాలంగా ఒకేచోట పాతుకు పోయిన వారికి స్థాన చలనం కల్పించేందుకు కసరత్తు చేస్తున్నారని విశ్వసనీయ సమాచారం. ఇందుకోసం పాలనా యంత్రాంగంలో తహసీల్దార్‌ మొదలు సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి దాకా అన్ని స్థాయుల్లో బదిలీలకు రంగం సిద్దమైందని తెలిసింది.

జూన్‌ 4న లోక్‌సభ ఎన్నికల కౌంటింగ్‌ పూర్తవ్వగానే కోడ్‌ ముగుస్తుంది. జూన్‌ 5వ తేదీ నుంచి 11వ తేదీ వరకు ప్రభుత్వ యంత్రాంగంలో భారీ ప్రక్షాళన ఉంటుందని.. వరుసగా బదిలీల ఉత్తర్వులు వెలువడతాయని ఆ వర్గాలు పేర్కొంటున్నాయి.

రేవంత్‌ సర్కారు అధికారం లోకి రాగానే.. అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ని బలోపేతం చేసింది. ఆ శాఖలో సమర్థులైన అధికారులతో పాటు.. కోర్టుల్లో కేసులు బలంగా నిలబడి, నిందితులకు శిక్ష పడేలా పకడ్బందీ చార్జ్‌ షీట్లు రూపొందించే సిబ్బంది, నిందితులు బెయిల్‌ పిటిషన్‌తో కోర్టులను ఆశ్రయిస్తే.. శక్తి మంతమైన కౌంటర్‌ వేసే సామర్థ్యమున్న సిబ్బందిని ఏసీబీకి తీసుకొచ్చింది.

దాంతో.. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చింది మొదలు.. అవినీతి అధికారులపై దాడులు పెరిగాయి. ఆదాయానికి మించి ఆస్తులున్న అధికారుల అరెస్టులు కూడా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో.. కొన్ని శాఖల్లో ఉన్నతాధికారులు మొదలు మధ్య స్థాయి అధికారులను బదిలీ చేయాలని సర్కారు నిశ్చయించినట్లు తెలుస్తోంది.

గత ప్రభుత్వ హయాంలో పలు మార్లు బదిలీలు జరిగినా.. ఒకే చోట తిష్ట వేసిన వారిపై సర్కారు ఇప్పుడు దృష్టి సారించింది. కొత్త జిల్లాల విభజన సమయంలోనూ ‘ఆర్డర్‌ టు సర్వ్‌’ కింద సర్దుబాట్లు జరిగినా.. కొందరు ఒకే చోట ఉండి పోయారని గుర్తించింది. నిబంధనల ప్రకారం రెండేళ్లకు మించి ఒకే చోట పని చేసే వారిని బదిలీ చేయాలి.

ఈ క్రమంలో.. ఆర్థిక, రెవెన్యూ, పోలీసు, వైద్య ఆరోగ్యం, పురపాలక-పట్టణాభివృద్ధి, వ్యవసాయం, విద్యుత్తు, పంచాయతీ రాజ్‌, రోడ్లు-భవనాలు, రవాణా.. ఇలా అన్ని శాఖల్లో బదిలీలు చేపట్టేందుకు సర్కారు సిద్ధమైనట్లు తెలుస్తోంది.

ఒకరిద్దరు కీలక ఐఏఎస్‌ అధికారులను, పెద్ద సంఖ్యలో ఐపీఎస్ లను బదిలీ చేయనున్నట్లు సమాచారం. పోలీసు శాఖలో ఇన్‌స్పెక్టర్లు మొదలు ఎస్పీల దాకా.. రెవెన్యూ శాఖలో తహసీల్దార్‌ మొదలు.. ఆర్‌డీవో, డీఆర్‌వో, కలెక్టర్‌ వరకూ బదిలీలు ఉంటాయని స్పష్టమవుతోంది.

పంచాయతీ రాజ్‌ శాఖలో ఎక్స్‌టెన్షన్‌ అధికారులతో పాటు.. డివిజనల్‌ పంచాయతీ ఆఫీసర్లు, జిల్లా పంచాయతీ ఆఫీసర్లు (డీపీవో), జిల్లా పరిషత్‌ చీఫ్‌ ప్లానింగ్‌ ఆఫీసర్లకు స్థాన చలనం తప్పదని తెలుస్తోంది.

స్టాంపులు-రిజిస్ట్రేషన్ల శాఖలో కొంత మంది సబ్‌-రిజిస్ట్రార్లు, జిల్లా రిజిస్ట్రార్లు, డీఐజీ లను బదిలీ చేయనుంది. ఈ శాఖలో 2023 ఆగస్టులో భారీ స్థాయిలో బదిలీ జరిగాయి. కొంత మంది సబ్‌-రిజిస్ట్రార్లు, కింది స్థాయిలో అధికారుల బదిలీలు జరగలేదు. వీరి వల్ల సబ్‌-రిజిస్ట్రార్‌ కార్యాలయాలకు చెడ్డ పేరు వస్తోందన్న ఆరోపణలున్నాయి. ఇలాంటి వారిపై ప్రభుత్వం దృష్టి పెట్టిందని సమాచారం.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్