Wednesday, September 25, 2024
HomeTrending Newsతెగించి కొట్లాడుడు తెలంగాణ రక్తంలోనే ఉంది - కెసిఆర్

తెగించి కొట్లాడుడు తెలంగాణ రక్తంలోనే ఉంది – కెసిఆర్

‘‘తెగించి కొట్లాడితేనే తెలంగాణ వచ్చింది. తెగించి కొట్లాడుడు తెలంగాణ రక్తంలోనే ఉంది. ఏమైతదో ఏమో అనే అనుమానం అక్కర్లేదు. మన పోరాటంలో నిజాయితీ ఉన్నప్పుడు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే మనం పోరాటం చేస్తున్నపుడు ఎందాక పోవాల్నో అందాక పోవాల్సిందే.’’ అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. బీజేపీని ఎండగడుతూ సాగే టీఆర్ఎస్ పోరాటంలో కలిసొచ్చే అన్నిపక్షాలను సరైన దిశగా ఫ్లోర్ కో-ఆర్డినేషన్ చేసుకుంటూ నిరసనలను చేపట్టాలని, పార్లమెంట్ లోని రాజ్యసభా పక్ష, లోక్ సభా పక్ష నేతలైన కె.కేశవరావు, నామా నాగేశ్వర్ రావులను సీఎం కేసీఆర్ ఆదేశించారు.
సోమవారం నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో శనివారం ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ పార్ల‌మెంట‌రీ పార్టీ స‌మావేశం ప్రారంభ‌మైంది. ఈ స‌మావేశానికి టీఆర్ఎస్ లోక్‌స‌భ‌, రాజ్య‌స‌భ స‌భ్యులు హాజ‌ర‌య్యారు. పార్ల‌మెంట్ స‌మావేశాల్లో అనుస‌రించాల్సి వ్యూహంపై సీఎం కేసీఆర్ ఎంపీల‌కు దిశానిర్దేశం చేశారు. తెలంగాణ ఏర్పడిన 8 ఏండ్ల కాలంలో రాష్ట్ర విభజన హామీలు సహా పలు హక్కులను తొక్కిపడుతున్న బీజేపీ అసంబద్ధ వైఖరిని, కలిసొచ్చే విపక్ష ఎంపీలతో సమన్వయం చేసుకొని ఎండగట్టేందుకు కార్యాచరణపై ఎంపీలతో ముఖ్యమంత్రి చర్చించారు.
కేంద్రం కక్షపూరిత వైఖరిని నిరసించాలి :
తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కక్షపూరిత వైఖరిని తీవ్రంగా నిరసిస్తూ పార్లమెంట్ ఉభయ సభల్లో గళం విప్పాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు టీఆర్ఎస్ పార్లమెంట్ సభ్యులను ఆదేశించారు. ప్రగతిశీల రాష్ట్రమైన తెలంగాణను ప్రోత్సహించడం మాని, తెలంగాణ అభివృద్ధి పట్ల కేంద్ర ప్రభుత్వం ద్వేషపూరితంగా వ్యవహరించడాన్ని ఎండగట్టాలన్నారు.

అవసరమైతే నేనూ ఢిల్లీకి వస్తా :
పార్లమెంటు సమావేశాల సందర్భంగా అవసరమైతే తాను ఢిల్లీకి వచ్చి బీజేపీ వ్యతిరేక పోరాటంలో కలిసివచ్చే విపక్ష పార్టీల అధినాయకులు, ఎంపీలతో చర్చలు జరుపుతానని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. పార్లమెంటు సమావేశాల్లో కేంద్రం ప్రవేశపెట్టనున్న పలు ప్రజా వ్యతిరేక బిల్లులను నిర్ద్వందంగా తిరస్కరించాలని ఎంపీలకు ఆదేశించారు.

తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటున్న కేంద్రం :
ఆర్ధిక క్రమశిక్షణతో అభివృద్ధి చెందుతున్న తెలంగాణను మోడీ ప్రభుత్వం ఏనాడూ ప్రోత్సహించకపోగా, అభివృద్ధిని అడ్డుకునే కుట్రలకు పాల్పడుతున్నదని సీఎం కేసీఆర్ దుయ్యబట్టారు. దేశంలోని 22 రాష్ట్రాల అప్పులు తెలంగాణకంటే ఎక్కువగా ఉన్నాయని, కానీ, పరిధికి లోబడే తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక వ్యవహారాలు నడుపుతున్న తీరును ఎంపీలకు ముఖ్యమంత్రి వివరించారు. రాష్ట్రం ఏర్పడిన ఎనిమిదేండ్ల కాలంలో ఒక్క రోజు కూడా, ఒక్క పైసా కూడా డిఫాల్ట్ కాకుండా తిరిగి చెల్లించిన ట్రాక్ రికార్డు తెలంగాణ సొంతమని సీఎం తెలిపారు. ఆర్.బి.ఐ. ఆధ్వర్యంలో జరిగే బిడ్ల వేలం ప్ర్రక్రియలో పాల్గొనే ఇన్వెస్టర్లు తెలంగాణ బిడ్ల వైపే ఎక్కువ మొగ్గు చూపుతున్న విషయం వాస్తవం కాదా? అని ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రాన్ని ప్రశ్నించారు. పాలనలో అప్రతిహతంగా ముందుకు సాగుతున్న తెలంగాణ మీద ప్రధాని మోడీకి కన్నుకుట్టిందని, నిబంధనల పేరుతో ఆర్ధికంగా తెలంగాణను అణచివేయాలని చూడటం అత్యంత శోచనీయమన్నారు.

రాజ్యాంగబద్దంగా గోప్యంగా ఉంచే సమాచారాన్ని లీక్ చేస్తూ కుట్రలు :
తెలంగాణకు వ్యతిరేకంగా కేంద్రం తీసుకునే నిర్ణయాలు బీజేపీ సోషల్ మీడియా గ్రూపులకు ఎట్లా చేరుతున్నాయో బీజేపీ నాయకత్వం స్పష్టం చేయాలని సీఎం అన్నారు. దేశానికి, రాష్ట్రాలకు నడుమ గోప్యంగా ఉండాల్సిన ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన సమాచారాన్ని ఉద్దేశపూర్వకంగా లీక్ చేసి, తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దుష్ప్రచారం చేయడం దారుణమని సీఎం అన్నారు. ఇదంతా ఒక పకడ్బందీ పథకం ప్రకారం జరుగుతున్న బీజేపీ రాజకీయ దిగజారుడుతనమని దుయ్యబట్టారు. తెలంగాణ పట్ల కేంద్ర బీజేపీ జాతీయ నాయకత్వం చౌకబారు రాజకీయాలను ఆశ్రయించడం దురదృష్టకరమని సీఎం అన్నారు.

అయినవారికి అప్పనంగా దోచిపెట్టేందుకే విద్యుత్ సంస్కరణలు :
విద్యుత్ సంస్కరణల పేరుతో కేంద్రం తమకు అయినవారికి అప్పనంగా దోచిపెట్టేందుకు రాష్ట్రాలమీద ఒత్తిడి తేవడంపై సీఎం కేసీఆర్ మండిపడ్డారు. దీనిపై కేంద్రాన్ని నిలదీయాలని ఎంపీలకు సూచించారు. తెలంగాణ ఏర్పాటైన నాటి నుంచీ ప్రతిసారీ నీతి ఆయోగ్ ప్రశంసిస్తున్నదని, అత్యుత్తమ ప్రగతిని సాధిస్తున్న రాష్ట్రాలను కేంద్రం ప్రోత్సహించాలని పలుమార్లు నీతి ఆయోగ్ వంటి సంస్థలను చేసిన సిఫారసులను ఉద్దేశపూర్వకంగా బుట్ట దాఖలు చేసిందని, దీనిపై కూడా నిలదీయాలని సీఎం అన్నారు.

దేశం ఆగమైతే.. రాష్ట్రాలు కూడా ఆగం కావా? :
‘‘ అంటే మిమ్నల్ని అడిగేవారు ఎవరూ లేరని అనుకుంటున్నరా? దేశంలో రాష్ట్రాలు భాగస్వామ్యం కాదా? రాష్ట్రాలను హద్దుల్లో పెడుతున్న కేంద్రం ఇష్టానుసార చర్యల్ని రాష్ట్రాలు ఎందుకు నిలదీయకూడదు? రాష్ట్రాలకు మిమ్నల్ని ప్రశ్నించే హక్కు ఎందుకు ఉండదు? మీ అసంబద్ధ చర్యల వల్ల దేశం ఆగమైతే రాష్ట్రాలు ఆగమైనట్లు కాదా? దేశంలోని రాష్ట్రాలన్నీ ఇదంతా చూస్తూ మౌనంగా ఉండాలా? మీరు కూర్చున్న కొమ్మను నరుక్కునే విధంగా కేంద్రం అనుసరిస్తున్న క్షమించరాని నేరాలను చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదు’’ అని సీఎం కేసీఆర్ నిర్ద్వందంగా ప్రకటించారు. ఇదే విషయంపై పార్లమెంటు సాక్షిగా కేంద్రాన్ని నిలదీయాలన్నారు. ఎఫ్.ఆర్.బి.ఎం నిబంధనలు అంటూనే, కరంటు మోటార్లకు మీటర్లు పెట్టాలనే వంకర టింకర నిబంధనలను ఏ విద్యుత్ కార్పొరేట్ కంపెనీల ప్రయోజనాల కోసమో దేశానికంతా తెలుసుననే విషయాన్ని పార్లమెంటులో లేవనెత్తాలన్నారు. ‘‘ నువ్వు అది చేస్తేనే, నేను ఇదిస్తా.. అంటే ఇదేమన్నా బేరమా? విచిత్రంగా ఉన్నది. ఎక్కువ ధరకు కరెంటు కొనాలని, విధిగా ఎక్కువ ధర చెల్లించి బొగ్గును కొనాలని రాష్ట్రాలను ఒత్తిడి చేయడం హాస్యాస్పదం. పిడికెడు మంది నీ వ్యాపారులకు సాయం చేయడానికి దేశానికి నష్టం చేస్తవా? అని కేంద్రాన్ని నిలదీయాలె. ఈ దుర్మార్గ చర్యల తంతు ఉభయ సభల్లో రికార్డు కావాలె’’ అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.

67 ఏండ్లలో దేశం అప్పు రూ.56 లక్షల కోట్లుంటే.. 8 ఏండ్లల్లనే రూ.100 కోట్లా? :
స్వాతంత్ర్యం వచ్చిన 67 ఏండ్లలో దేశం అప్పు రూ. 56 లక్షల కోట్లు ఉంటే కేవలం తన 8 ఏండ్ల పాలనలో రూ.100 లక్షల కోట్ల అప్పుల ఊబిలోకి దించిన ఘనత మోడీ ప్రభుత్వానికే దక్కుతుందని సీఎం దుయ్యబట్టారు. ఈ 8 ఏండ్ల కాలంలో కేంద్ర ప్రభుత్వం చేసిన ఒక్క మంచి పని ఏందో చెప్పాలన్నారు. రూపాయి పతనం, విపరీతంగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు, ఆర్ధికమాంద్యం, పాతాళానికి పడిపోయిన జీడీపీ తప్పితే, మోడీలో పాలనలో కనిపించే ప్రగతి శూన్యమన్నారు.

మోడీలాగా.. ఏ ప్రధానీ ప్రభుత్వరంగ సంస్థలను తెగనమ్మలేదు :
‘‘ తాగునీరు అందించే చేతగాదు. విద్యుత్తు అందించే చేతగాదు. కనీస మౌలిక వసతుల కల్పన ఊసే లేదు. సాక్షాత్తూ దేశ రాజధాని ఢిల్లీలోనే మంచినీళ్లకూ, విద్యుత్ కు కరువు ఉండటం సిగ్గుచేటు. నాటి నెహ్రూ నుంచి ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ వరకూ ఈ దేశ ప్రధానులుగా పనిచేసిన వారెవరూ కూడా ప్రభుత్వరంగ సంస్థలను స్థాపించారే తప్ప, అమ్మకానికి పెట్టలేదని సీఎం అన్నారు. పెట్టుబడుల ఉపసంహరణ పేరుతో ఒక మంత్రిత్వశాఖనే ఏర్పాటు చేసిన ఘనత బీజేపీకే దక్కిందన్నారు. ప్రభుత్వరంగ సంస్థలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కారు చౌకగా తెగనమ్ముతుండటం సిగ్గుచేటన్నారు. ప్రభుత్వరంగ సంస్థల అమ్మకాలకు ప్రోత్సాహకాలందిస్తూ, ప్రజల సంపదను కార్పొరేట్ శక్తులకు అప్పనంగా కట్టబెడుతున్న నరేంద్ర మోడీ అత్యంత అనర్హుడైన ప్రధానిగా సీఎం కేసీఆర్ దుయ్యబట్టారు. తమ స్వార్ధపూరిత రాజకీయాల కోసం రాష్ట్రాలను, దేశ ప్రజలను ఆర్థికంగా, సామాజికంగా, అన్నిరకాలుగా బ్రష్టుపట్టిస్తున్న బీజేపీ దిగజారుడు రాజకీయాలను వాస్తవ గణాంకాలతో సహా ప్రకటించి రాజకీయంగానే ఎదుర్కోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంపీలకు పిలుపునిచ్చారు. ఇప్పటివరకూ దేశాన్ని ఏలిన ఏ ప్రధానీ చేయనన్ని తప్పులను మోడీ చేస్తున్నారని సీఎం అన్నారు. ఎఫ్.ఆర్.బి.ఎం నిబంధనలను తనకు అనుకూలంగా సడలించుకోవడం, తన ఏలుబడిలోని రాష్ట్రాలకన్నా గొప్పగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలను నష్టపరచడం, ఆయా రాష్ట్రాలకు హక్కుగా అందాల్సిన పన్నుల వాటాను సెస్సుల రూపంలో దొడ్డిదారిన దొంగిలించడం, బ్యాంకులకు వేలాది కోట్లు ఎగ్గొట్టిన కార్పొరేట్ శక్తుల పట్ల మౌనం వహించడం వంటి దుర్మార్గాలను ఎంపీలు ఉభయ సభల సాక్షిగా నిలదీయాలన్నారు.

బెంగాల్లో లాగా ఉపాధిహామీని ఆపేసేందుకు కేంద్రం కుట్రలు :
రాష్ట్రం ఏర్పాటైన నాటినుంచి నేటిదాకా తెలంగాణ అత్యంత పారదర్శకంగా, బాధ్యతాయుతంగా, జవాబుదారీతనంతో గ్రామీణ ఉపాధిహామీ పథకాన్ని (నరేగా) అమలు చేస్తున్నదని ప్రశంసిస్తూ వస్తున్న కేంద్రం నేడు మాట మార్చి కుట్రపూరితంగా వ్యవహరించడం సిగ్గుచేటన్నారు. తనిఖీల పేరుతో ఎన్నడూ లేనివిధంగా ఉద్దేశపూర్వకంగా కేంద్రం ఒకేసారి 16 బృందాలను పంపి కోడిగుడ్డు మీద ఈకలు పీకేందుకు కుట్రలు చేస్తున్నదని సీఎం అన్నారు. ఇప్పటికే కేంద్రం పశ్చిమ బెంగాల్లో నరేగా పథకాన్ని రాజకీయ దురుద్దేశంతో రద్దు చేసిందని, తెలంగాణాలో కూడా ఇలాగే నరేగాను రద్దు చేసేందుకు కేంద్రం కుట్రలు చేస్తున్నదని సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

పాతాళంలోకి దిగజారుతున్న దేశ ఆర్థిక వ్యవస్థ :
కేంద్రం ఇటీవలి బడ్జెట్లో అన్నిరంగాలకు కోతలు విధించింది, ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్టు కూడా కట్టింది లేదు. మత విద్వేషాలు రెచ్చగొట్టి ప్రగతి బాటలో నడవాల్సిన యువత మెదళ్లను కలుషితం చేస్తున్నదని సీఎం అన్నారు. ఇప్పటిదాకా ఈ దేశంలో బ్రెయిన్ డ్రెయిన్ మాత్రమే జరిగిందని, మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత క్యాపిటల్ డ్రెయిన్ జరుగుతున్నదని సీఎం కేసీఆర్ అన్నారు. భారత విదేశీ మారక నిల్వలు హారతి కర్పూరంలా కరిగిపోతున్నాయని ముఖ్యమంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. త్వరలో డాలర్ విలువ 100 రూపాయలకు చేరుకునే పరిస్థితులు దాపురించాయని ఆర్ధికవేత్తలు హెచ్చరిస్తున్నారని, అవేమీ పట్టని మోడీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నదని అన్నారు. ప్రముఖ విదేశీ కంపెనీలు దేశాన్ని విడిచి ఎందుకు వెళుతున్నాయో ప్రధాని సమాధానం చెప్పాలన్నారు. మేకిన్ ఇండియా పేరుతో ప్రగల్భాలు పలికిన బీజేపీ ప్రభుత్వం తద్విరుద్దంగా వ్యవహరిస్తున్నదన్నారు. పతంగులకు వాడే చిన్న మాంజా దగ్గర నుంచి ప్రతీ వస్తువు చైనా తదితర దేశాల నుంచే దిగుమతి చేసుకోవడం చూస్తుంటే.. బీజేపీ మేకిన్ ఇండియా డొల్లతనం బయటపడుతుందన్నారు.

బీజేపీని ప్రజా కోర్టులో దోషిగా నిలబెట్టాలె :
ప్రజల విశ్వాసాన్ని కోల్పోయి, పాలనలో పూర్తిగా విఫలమైన బీజేపీ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ ప్రారంభమైందనే విషయాన్ని పార్లమెంటు సాక్షిగా ఎలుగెత్తి చాటాలన్నారు. వారు కేవలం 30శాతం పైచిలుకు ఓట్లతోనే అధికారంలోకి వచ్చిన సంగతి మరువద్దని, మిగిలిన 70శాతం మంది దేశ ప్రజానీకం బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నారనే విషయాన్ని గుర్తు చేయాలని ఎంపీలకు సూచించారు. ప్రజా వ్యతిరేకత ఉధృతమైతే పార్లమెంటు మూకుమ్మడిగా రాజీనామా చేసిన సందర్భాలను సీఎం ఎంపీలకు గుర్తు చేశారు. అదే పరిస్థితిని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎదుర్కోక తప్పదన్నారు. ఇప్పటికే అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిన పలు అంశాలకు చెందిన డిమాండ్లతోపాటు, ఎస్టీ రిజర్వేషన్ల పెంపుపై ఉభయ సభల్లో కేంద్రాన్ని నిలదీయాలని, ఈ జాప్యానికి బీజేపీని దోషిగా నిలబెట్టాలన్నారు.
ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ రాజ్యసభా పక్ష నేత కె.కేశవరావు, లోక్ సభా పక్ష నేత నామా నాగేశ్వర రావు, రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్, కె.ఆర్.సురేష్ రెడ్డి, దామోదర్ రావు, వద్దిరాజు రవిచంద్ర, బడుగుల లింగయ్య యాదవ్, బండి పార్ధసారధి రెడ్డి, లోక్ సభ సభ్యులు పోతుగంటి రాములు, గడ్డం రంజిత్ రెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి, బీ.బీ.పాటిల్, మాలోత్ కవిత, పసునూరి దయాకర్, వెంకటేశ్ నేత, మన్నె శ్రీనివాస్ రెడ్డిలతోపాటు, మంత్రులు కే.టీ.రామారావు, హరీశ్ రావు, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్సీలు సిరికొండ మధుసూదనా చారి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి మందా జగన్నాథం, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్ధికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, పౌర సరఫరాల శాఖ కార్యదర్శి అనిల్ కుమార్, వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్ రావు, ఇరిగేషన్ ఈఎన్సీ మురళీధర్ రావు, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ నర్సింగరావు, సీఎం సెక్రటరీ భూపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్