Friday, September 20, 2024
HomeTrending NewsRTC Merger: ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం: కేబినెట్ నిర్ణయం

RTC Merger: ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం: కేబినెట్ నిర్ణయం

ఎన్నికల ముంగిట ప్రభుత్వం మరో కీలక తాయిలం ప్రకటించింది. ఆర్టీసీ కార్మికులు ఎంతో కాలంగా డిమాండ్ చేస్తున్న విలీన ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ ఇచింది. ఆరీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి విధివిధానాలను రూపొందించేందుకు అధిరులతో కూడిన సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అధ్యక్షులుగా, ఆర్ అండ్ బి శాఖ, రవాణా శాఖ, జిఎడి శాఖ, లేబర్ శాఖ ల ప్రిన్సిపల్ సెక్రటరీలు సభ్యులుగా ఈ కమిటి పనిచేస్తుంది. పూర్తి నివేదికను సిద్ధం చేసి ప్రభుత్వానికి అందిస్తుంది.

దీనికి సంబంధించినిన విధి విధానాలను రూపొందించేందుకు ఓ కమిటీని నియమించాలని తీర్మానించింది.  డా. బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో సోమవారం ముఖ్యమంత్రి  కె. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ సమావేశమైంది. దాదాపు ఐదున్నర గంటల పాటు సుదీర్ఘంగా చర్చించి పలు కీలక అంశాలు చర్చించి.  ఆమోదించింది.

ఆర్టీసీ కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా, ఆర్టీసీని బాగుచేయడమే ద్యేయంగా, ప్రజా రవాణాను బాగుచేయడమే లక్ష్యమని కేబినెట్ స్పష్టం చేసింది. రాష్ట్రంలోని 43,373 మంది టిఎస్ ఆర్టీసి ఉద్యోగులు ఇక నుంచి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ, అందుకు సంబంధించి నిబంధనలు వర్తింపచేయాలని కేబినెట్ తీర్మానం చేసింది. ఆర్టీసీలో పనిచేసే డ్రైవర్లు, కండక్లర్టు, కింద స్థాయిలో పనిచేసే కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని మంత్రి మండలి కీలక నిర్ణయం తీసుకుంది.

వరద నష్టంపై కేబినెట్ చర్చ, తీర్మానాలు:

  • అనూహ్యరీతిలో అతిభారీ వర్షాలు క్లౌడ్ బరస్ట్, నష్టం నేపథ్యంలో రాష్ట్రంను ముంచెత్తిన వరదల వలన కలిగిన నష్టాలను రెవెన్యూ శాఖ, వ్యవసాయశాఖ, పంచాయతీరాజ్ శాఖ, రోడ్లు భవనాల శాఖ, ఇరిగేషన్, మున్సిపల్ శాఖ తదితర శాఖలు వివరాలను కేబినెట్ కు వివరించాయి, కల్వర్టులు కొట్టుకుపోవడం, రోడ్లు పాడవడం వంటి ప్రజా రవాణా వ్యవస్థ దెబ్బతిన్నాయని తెలిపింది. ఇందుకుగాను రూ. 500 కోట్లు తక్షణ సాయం కింద విడుదల చేయాలని ఆర్థికశాఖను కేబినెట్ ఆదేశించింది.
  • వరదల కారణంగా దాదాపు 40 మందికిపైగా చనిపోయారని, చనిపోయిన వారి వివరాలు సేకరించి వారికి రైతులకు అందే రైతుబీమా సౌకర్యాన్ని తక్షణమే అందించేందుకు చర్యలు చేపట్టాలని, రైతులు కానివారిని గుర్తించి వారికి ప్రభుత్వమే ఎక్స్ గ్రేషియా అందించాలని కేబినెట్ తీర్మానించింది. వరదలతో పశుసంవర్ధకశాఖకు జరిగిన నష్టాన్ని అంచనావేసి రిలీఫ్ అందించాలని తీర్మానం చేశారు. వరదలతో కోతలకు గురైన పొలాలను ఆయా జిల్లాల కలెక్టర్ లు స్వయంగా పరిశీలించి, నివేదికను తయారుచేసి ప్రభుత్వానికి అందజేయాలని కేబినెట్ తీర్మానించింది.

69,100 వేల కోట్ల రూపాయలతో హైదరాబాద్ లో మెట్రో రైల్ విస్తరణ

రానున్న మూడు , నాలుగు ఏండ్లలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మెట్రో విస్తరణను పూర్తిస్థాయిలో చేసే విధంగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మెట్రో రైలు అథారిటిని, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్ మెంట్ (ఎంఎయుడి) శాఖను కేబినెట్ ఆదేశించింది. ఇందు కోసం గాను మొత్తం 69,100 కోట్ల ఖర్చుతో ఓఆర్ఆర్ చుట్టూ ఉన్న అన్ని జంక్షన్ల నుంచి హైదరాబాద్ ను అనుసంధానం చేస్తూ నేరుగా ఎయిర్ పోర్ట్ కు చేరుకునేందుకు వీలుగా మెట్రోను విస్తరించాలని మంత్రి మండలి నిర్ణయం తీసుకుంది.

ఫేజ్ త్రీ మెట్రో విస్తరణలో భాగంగా పార్ట్ ఏలో 8 ఎక్స్ టెన్షన్ మార్గాల్లో మెట్రో మార్గాలను విస్తరించాలని కేబినెట్ నిర్ణయించింది,

ఇందులో బీహెచ్ఈఎల్ నుంచి పటాన్ చెరు, ఓఆర్ఆర్, ఇస్నాపూర్ వరకు, 13కిలో మీటర్లు, ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ , పెద్ద అంబర్ పేట వరకు 13 కిలో మీటర్లు, శంషాబాద్ నుంచి కొత్తూరు, షాద్ నగర్ వరకు 28కిలో మీటర్లు, ఉప్పల్ ఓఆర్ ఆర్, ఘట్ కేసర్, బీబీనగర్ వరకు 25 కిలో మీటర్లు, శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి తుక్కుగూడ కొండూరు వరకు 26 కిలో మీటర్లు, తార్నక నుంచి ఈసీఐఎల్ వరకు 8 కిలో మీటర్లు , జేబీస్ నుంచి తూము కుంట వరకు డబుల్ డెక్కర్ మార్గం 17 కిలో మీటర్లు, ప్యారడైజ్ నుంచి కండ్ల కోయ వరకు డబుల్ డెక్కర్ 12 కిలో మీటర్ల మేర మెట్రో విస్తరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది.

పార్ట్ బీలో భాగంగా నాలుగు మార్గాల్లో మెట్రో ఎక్స్ టెన్షన్ చేయాలని మంత్రి మండలి నిర్ణయించింది. శంషాబాద్ ఓఆర్ఆర్ నుంచి పెద్ద అంబర్ పేట వరకు 40 కిలో మీటర్లు, పెద్ద అంబర్ పేట్, ఘట్ కేసర్ , శామీర్ పేట్, మేడ్చల్ వరకు 45 కిలో మీటర్లు, మేడ్చల్ నుంచి దుండిగల్, పటాన్ చెరు వరకు 29కిలో మీటర్లు, పటాన్ చెరు, కోకాపేట నుంచి నార్సింగి వరకు 22 కిలో మీటర్ల మేర మెట్రో రైలు విస్తరణకు కేబినెట్ ఓకే చెప్పింది.

గవర్నర్ తిప్పి పంపిన బిల్లులను వచ్చే అసెంబ్లీలో సమావేశాల్లో తిరిగి ఆమోదించి, తిరిగి గవర్నర్ కు పంపించాలని కేబినెట్ తీర్మానం

గతంలో అసెంబ్లీ తీర్మానం చేసి గవర్నర్ ఆమోదం కోసం పంపిగా, గవర్నర్ తిరిగి పంపిన మున్సిపల్ శాఖ, పంచాయతీ రాజ్ శాఖ బిల్లుల పై అనుసరించాల్సిన విధానం పై కేబినెట్ చర్చించింది. ఆగష్టు 3వ తేది నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల్లో తిరిగి ఆయా బిల్లులను ప్రవేశపెట్టి నిబంధనల ప్రకారం ఆమోదం పొందేలా చర్యలు తీసుకొని రాజ్యాంగ విధివిధానాలను అనుసరించి తదుపరి చర్యలు తీసుకోవాలని శాసనసభ వ్యవహారాల శాఖను కేబినెట్ ఆదేశించింది.

గవర్నర్ కోటా ఎమ్మెల్సీలకు ప్రతిపాదన: గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా సంగారెడ్డి జిల్లాకు చెందిన ఎరుకలి (ఎస్టీ) సామాజిక వర్గానికి చెందిన కుర్రా సత్యనారాయణను, డాక్టర్ దాసోజు శ్రవణ్ (బిసి) లకు అవకాశం కల్పిస్తూ కేబినెట్ ప్రతిపాదిస్తూ, తీర్మానించింది.

ఇతర కేబినెట్ తీర్మానాలు:

1. మహబూబాబాద్ లో ప్రతిపాదించిన హార్టికల్చర్ డిగ్రీ కళాశాల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.

2. రాష్ట్రవ్యాప్తంగా నిర్మించ తలపెట్టిన టిమ్స్ సూపర్ స్పెషాలిటి దవాఖానల్లో 50 శాతం జనరల్ కన్సల్టేషన్, సర్జరీ సేవలను పూర్తి ఉచితంగా అందిస్తూ, మరో 50 శాతం నిమ్స్ తరహాలో నిర్వహించాలని, వైద్యశాఖను కేబినెట్ ఆదేశించింది.

3. నిమ్స్ విస్తరణ కోసం నిధుల సమీకరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది

4.బీడీ కార్మికుల మీద పనిచేసే టేకేదార్లకు పెన్షన్ సౌకర్యం కల్పించేందుకు ఆమోదం

5. కొత్త గ్రామపంచాయతీలు సహా, పంచాయతీరాజ్ శాఖను ప్రతిపాదనలను అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని తీర్మానం

6. మూమునూరు ఎయిర్ పోర్ట్ కోసం భూ బదలాయింపుకు ఆమోదం

7. దేశవ్యాప్తంగా ఉన్న కాపు, బలిజ, ఒంటరి తదితర కాపు అనుబంధ కులాల అభ్యర్థన మేరకు దక్షిణ భారతదేశ కాపు సెంటర్ (సెంటర్ ఫర్ సౌత్ ఇండియన్ కాపు కమ్యూనిటి) నిర్మాణం కోసం స్థలం కేటాయించాలని కేబినెట్ తీర్మానించింది.

8. రాష్ట్రవ్యాప్తంగా జిల్లాలో మెడికల్ కాలేజీ అనే ప్రభుత్వ విధానంలో భాగంగా, మిగిలి ఉన్న మరో 8 మెడికల్ కాలేజీల నిర్మాణానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. వీటి నిర్మాణంతో జిల్లాకో మెడికల్ కాలేజీ చొప్పున 33 జిల్లాలకు 33 మెడికల్ కాలేజీలు నిర్మాణం కానున్నాయి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్