Tuesday, March 10, 2026
HomeTrending Newsఖాదీ పరిశ్రమకు ప్రోత్సాహం: నిర్మలా

ఖాదీ పరిశ్రమకు ప్రోత్సాహం: నిర్మలా

ఖాదీ, చేనేత రంగానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నారని కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ప్రస్తుతం ఖాదీ, చేనేతకు డిమాండ్ పెరుగుతోందని, గత పదేళ్ళలో ఖాదీ ఉత్పత్తులు 18వేల కోట్ల రూపాయలకు చేరుకున్నాయని వివరించారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా శ్రీకాకుళం జిల్లా పొందూరులో ఆమె పర్యటించారు, ఆంధ్రా ఫైన్ ఖాదీ కార్మికాభివృద్ధి సంఘాన్ని ఆమె సందర్శించారు. నేతన్నలతో ముచ్చటించి, వస్త్రాలు తయారు చేసే విధానాన్ని ఆసక్తిగా పరిశీలించారు. ఖాదీ కళాకారుల భవన నిర్మాణానికి ఆమె శంఖుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణ దాస్, రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, రాజ్య సభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు, శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామూహన్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నిర్మల మాట్లాడుతూ పొందూరులో ఖాదీ కార్మికులకు మంచి జీవనోపాధి లభించేలా తనవంతు కృషి చేస్తానని, ఈ విషయమై సంబంధిత కేంద్రమంత్రితో మాట్లాడతానని హామీ ఇచ్చారు. జీ ఈ ఏం ద్వారా పొందూరు ఖాదీని మార్కెటింగ్ చేయాలన్నారు.  దేశవ్యాప్తంగా మెగా హ్యండ్లూమ్ క్లస్టర్లు ఏర్పాటు చేస్తున్నామని, బ్యాంకర్లు ఖాదీ పరిశ్రమకు రుణాలు ఇచ్చి ఆదుకోవాలని సూచించారు. గాంధీ జయంతి నాటికి పొందూరులో 50 శాతం చేనేత రాట్నాలు పెరగాలని అన్నారు.

పొందూరు ఖద్దరుకు ఎంతో చరిత్ర ఉందని, గాంధీజీ నుంచి ప్రతిభా పాటిల్ వరకూ ఎందరో ఈ ఖద్దరు దుస్తులు ధరించారని ఆంధ్ర ప్రదేశ్ శాశనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. ప్రస్తుతం నేతన్నలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారిని ఆదుకోవాల్సిన అవసరం ఉందని అయన అభిప్రాయపడ్డారు. ఖాదీ, నేతన్నలకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని కోరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular