Friday, September 20, 2024
HomeTrending NewsUppal Skywalk: పాదచారులకు రక్షణ...ఉప్పల్ స్కైవాక్

Uppal Skywalk: పాదచారులకు రక్షణ…ఉప్పల్ స్కైవాక్

హైదరాబాద్ జంట నగరాలు, శివారు ప్రాంతాల అభివృద్ధిలో కీలక భూమిక పోషిస్తున్న హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (హెచ్ఎండిఏ) త్వరలో ఇన్నర్ రింగ్ రోడ్డు ఉప్పల్ చౌరస్తా వద్ద పాదచారుల రక్షణ కోసం నలువైపుల రోడ్డు దాటేందుకు వీలుగా ఆకాశ వంతెన స్కైవాక్(బోర్డ్ వాక్)ను ప్రజానీకానికి అందుబాటులోకి తీసుకురానున్నది. సుమారు రూ.25 కోట్ల వ్యయంతో రూపుదిద్దుకుంటున్న ఉప్పల్ స్కైవాక్ ప్రాజెక్టు పనులు చివరి దశకు చేరుకున్నాయి. రాబోయే వంద సంవత్సరాలకు పైగా ప్రజానీకం సౌకర్యార్థం మనుగడలో ఉండే లక్ష్యంతో పాదచారుల వంతెన(ఉప్పల్ స్కైవాక్ ప్రాజెక్టు) రూపకల్పన జరిగింది. ఉప్పల్ స్కైవాక్ ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో సుమారు వెయ్యి టన్నులకుపైగా స్ట్రక్చరల్ స్టీల్ తో పూర్తి చేశారు. పాదచారుల వంతెన డిజైను ఎంపిక చేసి దాదాపు రూ.25 కోట్ల అంచనా వ్యయంతో ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను హెచ్ఎండిఏకు అప్పగించారు.

ముఖ్యంగా ఉప్పల్ చౌరస్తాలో రోడ్డు దాటే(రోడ్ క్రాసింగ్) సమయంలో తరచుగా రోడ్డు ప్రమాదాలు జరుగుతుండడం, ప్రమాదాలలో ఎక్కువ శాతం మహిళలు, పాఠశాల విద్యార్థులు గాయపడుతున్న అంశాలను దృష్టిలో పెట్టుకొని అక్కడ పాదచారుల వంతెన( స్కైవాక్ లేదా బోర్డ్ వాక్) నిర్మాణం శ్రేయస్కారమని ప్రభుత్వం నిర్ణయించింది. సుదీర్ఘకాలం మన్నికకోసం రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పాదచారుల వంతెన నిర్మాణంలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (SAIL), వైజాగ్ స్టీల్ (విశాఖపట్నం) తోపాటు జిందాల్ స్టీల్ కంపెనీలకు చెందిన స్ట్రక్చరల్ స్టీల్ ఉపయోగించడం జరిగింది.

పాదచారుల వంతెన ప్రాజెక్టులో భాగంగా ప్రజలకు 8 లిఫ్టులు, 6 స్టేర్ కేసులు, 4 ఎస్కిలేటర్లు అందుబాటులో ఉంటాయి. మొత్తం 37 పిల్లర్లు, 660 మీటర్ల పొడవు, మూడు(3), నాలుగు(4), అరు(6) మీటర్ల వెడల్పు కలిగిన ఉప్పల్ స్కైవాక్ భూమిపై నుండి అరు(6) మీటర్ల ఎత్తులో ఉంటుంది. మొత్తం 660 మీటర్ల పొడవు కలిగిన పాదచారుల వంతెన(ఉప్పల్ స్కైవాక్) బ్యూటీఫికేషన్ లుక్ కోసం పైభాగంలో కేవలం 40 శాతం మేరకు రూఫ్ కవరింగ్ ఏర్పాట్లు చేశారు. 2020 ఏడాది చివర్లో ఉప్పల్ స్కైవాక్ ప్రాజెక్టు పనులు మొదలైనప్పటికీ వరుసగా రెండు సంవత్సరాల పాటు కోవిడ్ పరిస్థితుల కారణంగా జాప్యం చోటు చేసుకుంది.

ఉప్పల్ చౌరస్తాలో నలువైపులా ప్రతినిత్యం సుమారు 20 వేలమందికిపైగా పాదచారులు అటు ఇటు రోడ్ క్రాసింగ్ చేస్తారని అంచనా. ఉప్పల్ స్కై వాక్ అందుబాటులోకి రావడం ద్వారా కాలిబాటన రోడ్డు దాటే పాదచారులు స్కైవాక్ ను వినియోగించడం వల్ల ఉప్పల్ చౌరస్తాలో సిగ్నల్ ఫ్రీ గా వాహనాల రాకపోకలకు అవకాశం కలుగుతుంది. ఇకపై ఉప్పల్ మెట్రో రైలు ప్రయాణీకులు మెట్రో కాన్ కోర్ (ఫ్లోర్) నుంచి పాదచారుల వంతెన (స్కై వాక్) మీదుగా గమ్య స్థానాలవైపు వెళ్లేందుకు అవకాశం కలుగుతుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్