Saturday, March 14, 2026
HomeTrending Newsరాష్ట్రాన్ని వైసీపీనుంచి విముక్తం చేస్తాం: పవన్

రాష్ట్రాన్ని వైసీపీనుంచి విముక్తం చేస్తాం: పవన్

వైఎస్సార్సీపీని అధికారం నుంచి బైటకుతీసుకు రాకపోతే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరగదని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాన్ అన్నారు. ఈ రాష్ట్రం బాగుపడాలంటే రాష్ట్రాన్ని వైసీపీ నుంచి విముక్తం చేయాలని వ్యాఖ్యానించారు. విశాఖ నుంచి విజయవాడ చేరుకున్న పవన్ మంగళగిరి పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వంపై తమ పోరాటం కొనసాగుతుందని, వారిని ఓడించి తీరుతామని స్పష్టం చేశారు. వైసీపీ ఉడుత వూపులకు, తాటాకు చప్పుళ్ళకు భయపడేది లేదని, ఎక్కడికీ పారిపోయేది లేదని, ఇక్కడే ఉండి తేల్చుకుంటామని  పవన్ చెప్పారు.

విశాఖ, శ్రీకాకుళంలో తమ పార్టీ నిర్మాణం బలంగా ఉందని, విజయనగరంలో ఇప్పుడిప్పుడే నిర్మాణం చేసుకుంటున్నామని, ఆ ప్రాంతంలో జనవాణి కార్యక్రమం చేపట్టాలని భావిస్తే  ప్రభుత్వం అడ్డు తగిలిందన్నారు పవన్.  తాము ప్రభుత్వంపై నిర్మాణాత్మక విమర్శలే చేస్తున్నాం తప్ప వ్యక్తిగత విమర్శలు చేయడంలేదని అన్నారు. విశాఖ గర్జన కార్యక్రమం కంటే ముందే తమ జనవాణి కార్యక్రమం ఏర్పాటు చేసుకుని, టిక్కెట్లు కూడా బుక్ చేసుకున్నామని తెలిపారు. తమ పార్టీ అంతర్గత సమావేశానికి సంబంధించి తాము సమాచారం ఎలా ఇస్తామని ప్రశ్నించారు.  ఒక పార్టీ కార్యక్రమానికి ఎదురు వెళ్ళడం తమ ఉద్దేశం కాదన్నారు.

రాజధాని విషయంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారంలోకి వచ్చిన తరువాత ఒక మాట వైసీపీ మాట్లాడిందని, కానీ తాము మొదటి నుంచీ ఒకే స్టాండ్ మీద ఉన్నామని, అమరావతి రాజధానికే కట్టుబడి ఉన్నామని పవన్ వెల్లడించారు. విశాఖ గర్జన పేరిట వైసీపీ కార్యక్రమం చేపట్టిందని, ప్రభుత్వంలో ఉంది గర్జనలు, కూతలు ఏమిటని నిలదీశారు పవన్. అధికారానికి దూరంగా ఉన్నవారు తమ కడుపు మంట వినమని గర్జిస్తారని, కానీ అధికారంలో ఉన్నవారే గర్జించడం ఏమిటని ఎద్దేవా చేశారు.

Also Read: సవాళ్ళకు సిద్ధం : పవన్ కళ్యాణ్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular