Friday, March 13, 2026
HomeTrending NewsYuva Galam: మంత్రుల కంటే సలహాదార్ల జీతమే ఎక్కువ: లోకేష్

Yuva Galam: మంత్రుల కంటే సలహాదార్ల జీతమే ఎక్కువ: లోకేష్

రాష్ట్రంలో అవకాశాలు లేకపోవడం వల్లే యువత ఇతర రాష్ట్రాలకు, విదేశాలకు వలస వెళుతున్నారని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. తమ హయాంలో పారిశ్రామికంగా అభివృద్ధి చేశామని, ఎన్నో ప్రతిష్టాత్మక కంపెనీలు తీసుకొచ్చి ఉపాధి అవకాశాలు కల్పించామని గుర్తు చేశారు. నెల్లూరు అనిల్ గార్డెన్స్ లో ‘మహాశక్తితో లోకేష్’ పేరిట మహిళలతో లోకేష్ ముఖాముఖి నిర్వహించారు. ప్రభుత్వానికి సలహాదారులు అవసరమేనని, కానీ ఈ ప్రభుత్వం మంత్రుల కన్నా సలహాదారులకే ఎక్కువ గౌరవం ఇస్తున్నారని, జీతాలు కూడా ఎక్కువని, అసలు కొందరు అడ్వైజర్లే కీలక పాత్ర పోషిస్తున్నారని విమర్శించారు.

టిడిపి అధికారంలోకి రాగానే  ఇటీవల ప్రకటించిన మహిళా శక్తి పథకాన్ని వెంటనే అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం పేదలకు సంక్షేమం అందించడం  తప్పనిసరి అని, కానీ అభివృద్ధి జరిగినప్పుడే… సంపద వచ్చి సంక్షేమం చేసేందుకు అవకాశం ఉంటుందని, కానీ ఈ ప్రభుత్వం అప్పులు తెచ్చి సంక్షేమం ఇస్తోందని మండిపడ్డారు. ఆ అప్పులు తీర్చాల్సింది ప్రజలేనని, అందుకే ఎనిమిది సార్లు విద్యుత్ ఛార్జీలు, మూడు సార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచారని ఆరోపించారు. తాము వచ్చిన తరువాత అప్పులతో కాకుండా అభివృద్ధి చేసి, సంపద సృష్టించి, సంక్షేమం అందిస్తామని వివరించారు.

ఏపీలో మద్యపాన నిషేధం సాద్యం కాదని,,, రాబోయే 25 ఏళ్ళపాటు మద్యంపై వచ్చే ఆదాయాన్ని తాకట్టు పెట్టి మరీ అప్పులు తెచ్చారని, అందుకే సంపూర్ణ మద్య నిషేధం కష్టమని, కానీ మద్య నియంత్రణ చేస్తామని భరోసా ఇచ్చారు.  దంత వైద్యంపై అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని, మరోవైపు దంత వైద్యాన్ని ఆరోగ్యశ్రీలో చేర్చేందుకు కృషి చేస్తామని చెప్పారు.

వైఎస్సార్ పట్ల తమకు గౌరవం ఉందని, అందుకే ఆయన పేరుతో ఉన్న కడప జిల్లా పేరును తాము మార్చలేదని, కానీ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును జగన్ ప్రభుత్వం మార్చిందని, తాము అధికారంలోకి రాగానే ఎన్టీఆర్ పేరు తిరిగి పెడతామని వెల్లడించారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా పేర్లు మార్చకుండా ఓ చట్టాన్ని తీసుకు వస్తామన్నారు.

ఓ అవగాహన లేకుండా దిశా చట్టం తీసుకు వచ్చారని,  మహిళలపై దాడులకు పాల్పడుతున్న వారిని వదిలి పెడుతున్నారని, కొన్ని కేసుల్లో నిందితులను ఇంతవరకూ పట్టుకోలేదని లోకేష్ ఆరోపించారు.  నరసరావు పేటలో అనూష అనే విద్యార్ధిని పై దాడిచేసిన వాడిని వదిలి పెడితే వాడు ఇప్పుడు అ అమ్మాయి తల్లిదండ్రులను బెదిరిస్తున్నాడని లోకేష్ అన్నారు.  మహిళలను ఇబ్బందులకు గురిచేసిన వారిపై కేసులు నమోదు చేసి శిక్షిస్తామన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular