Friday, October 18, 2024
HomeTrending Newsఅరెస్టులు చేస్తే.. చలో జైల్ భరో

అరెస్టులు చేస్తే.. చలో జైల్ భరో

దేశ ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉందని, సామాన్యులపై తీవ్ర ప్రభావం పడుతోందని కాంగ్రెస్ సీనియర్ నేత దీపేంద్ర హుడా ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో ఆర్థికాభివృద్ధి కంటే.. కరోనా వృద్ధి చెందుతొందన్నారు. ప్రధానమంత్రి ప్రకటించే పెద్ద పెద్ద ప్యాకేజీ లు ప్రకటనలకే పరిమితం అయ్యాయని ఆయన మండిపడ్డారు. ధరల పెరుగుదలపై గాంధి భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో దీపేంద్ర సింగ్ హుడా, పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. కరోనా ఒకవైపు సామాన్య జనజీవనాన్ని అస్తవ్యస్తం చేస్తుండగా.. పెట్రోల్, డీజల్ ధరలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ప్రత్యక్ష, పరోక్ష పన్నులతో సామాన్యులపై భారం మోపారన్న హుడా యూపీఏ హయాంలో దారిద్ర రేఖకు దిగువన ఉన్న వారికంటే.. ఎన్డీయే హయాంలో ఒకటిన్నర రెట్లు పెరిగాయన్నారు. పన్నుల రూపంలో మోదీ ప్రభుత్వం 25 లక్షల కోట్లు ప్రజలపై భారం మోపిందని, ఎక్సైజ్ డ్యూటీ ని భారీ గా పెంచారని హుడా దుయ్యబట్టారు. ఈ రోజు చమురుపై 4 లక్షల కోట్లకు పైగా భారం ప్రజలపై మోపుతున్నారు.

దేశంలో అత్యధికంగా వ్యాట్ విదిస్తున్న రాష్ట్రాలలో తెలంగాణ మూడో స్థానంలో ఉందని హుడా విమర్శించారు. క్రూడ్ ఆయిల్ ధరలు.. యూపీఏ హయాంలో కంటే.. ఎన్డీయే హయాంలో తక్కువగా ఉన్నాయన్నారు. మేక్ ఇన్  ఇండియా పేరు చెప్పడమే తప్ప.. దిగుమతులు భారీ గా పెరుగుతున్నాయని, డొమెస్టిక్ గ్యాస్ విషయంలో ప్రభుత్వ సబ్సిడీ దాదాపుగా ఎత్తేశారని ధ్వజమెత్తారు. 15.8 శాతానికి డొమెస్టిక్ గ్యాస్ సబ్సిడీ పడిపోయింది. నిత్యావసర వస్తువులు కూడా భారీగా పెరిగాయి. ఉప్పు ,పప్పులు , నూనెలు ప్రతీది భారీ గా పెరిగాయి.. ఇలా పెరిగితే సామాన్యుల పరిస్థితి ఏంటని కాంగ్రెస్ నేత ప్రశ్నించారు.

దేశంలో నిరుద్యోగం కూడా గతంలో ఎన్నడూ లేని విధంగా పెరిగిందని, కోవిడ్ ప్యాకేజీ పేరుతో ప్రకటించిన 20 లక్షల కోట్లు.. ఇవ్వడానికి కాదు.. తీసుకోవడానికి అన్నట్లుగా ఉందని దీపేంద్ర హుడా ఎద్దేవా చేశారు. అయిదు రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా ఒక్క పైసా పెరగలేదు. అప్పుడు అంతర్జాతీయ క్రూడ్ ధరలు పెరగలేదా..? ఎన్నికలు ముగిసిన వెంటనే క్రూడ్ ధరలు పెరిగాయా అని ప్రశ్నించిన హుడా ధరల పెరుగుదలకు నిరసనగా.. రేపు చలో రాజ్ భవన్ చేపట్టామన్నారు. ధరల పెరుగుదల పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను నిలదీస్తాం. గల్లీ నుంచి ఢిల్లీ వరకు మా పోరాటం కొనసాగుతుంది. వాస్తవ ధర కంటే రెండు రెట్లు అదనంగా ట్యాక్స్ లు వేస్తున్నారు. యూపీఏ హయాంలో వాస్తవ ధరలో సగం మాత్రమే ట్యాక్స్ లు ఉండేవని, ఎన్డీయే హయాంలో పూర్తి భిన్నంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.

ధరల పెరుగుదల పై పార్లమెంటు లో నిలదీస్తాం – రేవంత్ రెడ్డి

దేశంలో అత్యంత ధనవంతుడు నుంచి పేద వాడి వరకు నరేంద్ర మోడీ, కేసీఆర్ దోపిడీ లకు బలవుతున్నారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. కరోనా సమయంలో తినడానికి తిండి లేకుండా.. నడుచుకుంటూ పోతుంటే .. చమురు ధరలపై భారం మోపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 7 ఏళ్లలో 36 లక్షల కోట్లు దోచుకున్నారన్న రేవంత్ రెడ్డి పెట్రోల్ వాస్తవ ధర 40 రూపాయలు మాత్రమే ఉందన్నారు. 32 రూపాయలు కేసీఆర్, 33 రూపాయలు మోడీ వసూలు చేస్తున్నారని, ధనవంతులు తిరిగే విమానాల్లో కేవలం ఒక్క రూపాయి వసూలు చేస్తోందని ఆరోపించారు. ధనవంతులకు మినహాయింపు ఇచ్చి.. పేదలపై మాత్రం భారం మోపుతున్నారన్నారు. ధరల పెరుగుదలకు నిరసనగా రేపు.. ధర్నా చౌక్ నుంచి రాజ్ భవన్ వరకు ర్యాలీ గా వెళ్లి వినతిపత్రం ఇస్తామని రేవంత్ రెడ్డి చెప్పారు.

బంగ్లాదేశ్, బర్మా‌ , పాకిస్థాన్ , నేపాల్ వంటి దేశాల్లో మన కంటే తక్కువకే 30 నుంచి 40 మధ్యనే అందిస్తున్నారని, ప్రజలను దోచుకోవడానికి కోవిడ్ నిబంధనలు అడ్డు రావు కాని.. నిరసనకు అడ్డు వస్తాయా అని రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. పార్లమెంట్ లో కూడా ఈ ధరల అంశం పై నిలదీస్తామని, రేపటి నిరసన కార్యక్రమానికి కాంగ్రెస్ శ్రేణులు తరలి రావాలని రేవంత్ రెడ్డి పిలుపు ఇచ్చారు. రేపటి ర్యాలీ సందర్భంగా అరెస్టు లు చేస్తే ఎలా ఎదుర్కొవాలో మాకు తెలుసన్నారు. అరెస్టులు చేస్తే.. చలో జైల్ భరో నిర్వహిస్తామని, పోలీస్ స్టేషన్ ముట్టడి చేస్తాం.. ఎంత మందిని అరెస్ట్ చేస్తారో చూస్తామని రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్