Friday, March 20, 2026
HomeTrending Newsఎన్నిసార్లు మోసపోవాలి?: నాని ప్రశ్న

ఎన్నిసార్లు మోసపోవాలి?: నాని ప్రశ్న

మార్పు రాష్ట్రంలో కాదని, తెలుగుదేశం పార్టీలో రావాలని మాజీ మంత్రి, వైసీపీ నేత కొడాలి నాని వ్యాఖ్యానించారు. అసలు జూనియర్ ఎన్టీఆర్ ను ఆహ్వానించడానికి లోకేష్ ఎవరని ప్రశ్నించారు. చంద్రబాబు,లోకేష్ బొమ్మలతో ఓట్లు అడిగే సాహసం లేదని, అందుకే జూనియర్ ను రమ్మని పిలుస్తున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు నాయకత్వంలో ఎన్నికలకు వెళ్తే టిడిపికి ప్రతిపక్ష హోదా కూడా రాదనీ, జూనియర్ ఎన్టీఆర్ వస్తే కనీసం ప్రతిపక్ష హోదా అయినా దక్కుతుందని ఆశాపడుతున్నారని మండిపడ్డారు. దమ్ముంటే ఎన్టీఆర్ కు తెలుగుదేశం అధ్యక్ష పదవి ఇవ్వాలని డిమాండ్ చేశారు.

గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ను వాడుకొని వదిలేశారని, హరికృష్ణకు కూడా పదవులు ఇవ్వకుండా దూరం పెట్టారని, చంద్రబాబును నమ్ముకొని ఎన్టీఆర్ కుటుంబం ఎన్నిసార్లు మోసపోవాలని కొడాలి సూటిగా ప్రశ్నించారు. ఎంతమందిని కలుపుకుని వెళ్ళినా సిఎం జగన్ ను  ఓడించలేకపోతున్నాననే చంద్రబాబు ఈ రకమైన ఎత్తులకు పాల్పడుతున్నారని నాని ధ్వజమెత్తారు. చిత్తూరు జిల్లాలో ఉన్నప్పుడు జూనియర్ రావాలని చెప్పాడని, రేపు కడప జిల్లా వెళ్లి మహేష్ బాబు పేరు, అనంతపురంలో ప్రభాస్ పేరు, కర్నూలు జిల్లాలో రాం చరణ్ పేరు చెబుతారని వ్యంగ్యంగా అన్నారు.

సిఎం జగన్ అధికారంలో ఉంటే అభివృద్ధి, సంక్షేమ పథకాలు కొనసాగుతాయని,  చంద్రబాబుకు ఓటేస్తే నష్టపోయేది ప్రజలేనని… స్కూళ్ళ ఆధునీకరణ, అమ్మ ఒడి, ఇంగ్లీష్ మీడియం, ల్యాప్ టాప్ ల పథకాలు ఉండవని, ఫీజు రీఇంబర్స్మెంట్స్ రాదనీ, రైతులు-డ్వాక్రా మహిళలకు జీరో వడ్డీ రుణాలు ఆగిపోతాయని నాని ఆందోళన వ్యక్తం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular