Tuesday, September 17, 2024
HomeTrending NewsTSPSC: సర్వీస్ కమిషన్ అసమర్థత...సంకట స్థితిలో ఆశావాహులు

TSPSC: సర్వీస్ కమిషన్ అసమర్థత…సంకట స్థితిలో ఆశావాహులు

తెలంగాణలో గ్రూప్ వన్ పరీక్ష రద్దు చేస్తూ రాష్ట్ర ఉన్నత న్యాయ స్థానం తీర్పు వెలువరించింది. టి ఎస్ పి ఎస్ సి నిబంధనలు పాటించలేదని, పరీక్ష సరిగా నిర్వహించ లేదని తీర్పులో పేర్కొన్నారు. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును ఈ రోజు డివిజన్ బెంచ్ సమర్థించింది. అభ్యర్థుల నుంచి బయోమెట్రిక్ తీసుకోవాలని స్పష్టం చేసింది.

దీంతో గ్రూప్ 1 పరీక్ష  మరోసారి నిర్వహించక తప్పని పరిస్థితి ఏర్పడింది. 2022 ఏప్రిల్‌ 26న 503 పోస్టులతో తెలంగాణలో తొలి గ్రూప్‌-1 ప్రకటనను టీఎస్‌పీఎస్సీ విడుదల చేసింది. తెలంగాణ  వ్యాప్తంగా 3,80,202 మంది దరఖాస్తు చేశారు. అదే ఏడాది అక్టోబరు 16న ప్రిలిమ్స్‌ నిర్వహించగా 2,85,916 మంది హాజరయ్యారు.

టీఎస్‌పీఎస్సీ వీరి నుంచి 1:50 నిష్పత్తిలో 25 వేల మందిని ఈ ఏడాది జనవరిలో మెయిన్స్‌కు ఎంపిక చేసింది. జూన్‌లో ప్రధాన పరీక్షలు నిర్వహించేందుకు షెడ్యూలు వెలువరించింది. అనూహ్యంగా ప్రిలిమ్స్‌ ప్రశ్నపత్రాల లీకేజీ కుంభకోణం వెలుగుచూడటంతో కమిషన్‌ ఆ పరీక్షను రద్దు చేసింది. తిరిగి జూన్‌ 11న ప్రిలిమ్స్‌ నిర్వహించగా 2,33,506 మంది అభ్యర్థులు హాజరయ్యారు.

రెండోసారి పరీక్ష నిర్వహణలో బయోమెట్రిక్ వివరాలు తీసుకోలేదని… హాల్ టికెట్ నంబర్ లేకుండా ఓఎంఆర్ షీట్లు ఇచ్చారని కొందరు అభ్యర్థులు కోర్టులో పిటిషన్ వేశారు. పరీక్ష రద్దు చేస్తూ ఏకసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పుపై డివిజన్‌ బెంచ్‌కు టీఎస్‌పీఎస్సీ అప్పీలు చేసింది. అయితే లోపాల్లేకుండా పరీక్షను నిర్వహించామని టీఎస్‌పీఎస్సీ నిరూపించుకోలేకపోయింది.

గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ రద్దుతో అభ్యర్థులతోపాటు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లోనూ తీవ్ర ఆందోళన నెలకొంది. రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మొదటి సారి వెలువడ్డ నోటిఫికేషన్ సరిగా నిర్వహించ లేకపోవటం ఖచ్చితంగా కమిషన్ అసమర్థతే. ఈ వ్యవహారానికి బాధ్యత వహిస్తూ టీఎస్‌పీఎస్సీ చైర్మన్ జనార్ధన్ రెడ్డి రాజీనామా చేయటం ఉత్తమం.

రాష్ట్ర స్థాయి ఉన్నత సర్వీసుకు గంపెడాశతో సిద్దం అవుతున్న అభ్యర్థులు సంకట స్థితిలో పడ్డారు. ఇప్పటికే రెండుసార్లు పరీక్ష రాశామని, మూడోసారి రాయడమంటే ఆర్థికంగా, మానసికంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఎన్నికలు సమీపిస్తున్న వేళ హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి శరాఘాతమే. వచ్చే నెలలో ఏ క్షణమైనా శాసనసభ ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ఈ తరుణంలో ఉన్న ఫలంగా పరీక్ష నిర్వహించేందుకు సమయం సరిపోదు. రాబోయే ఎన్నికల్లో టీఎస్‌పీఎస్సీ ప్రచార అంశంగా ప్రతిపక్షాలకు అస్త్రంగా మారనుంది. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్తుందా.. మళ్లీ పరీక్ష నిర్వహిస్తుందా చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్