Saturday, March 7, 2026
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్కరోనాపై పోరుకు నేవీ సాయం!

కరోనాపై పోరుకు నేవీ సాయం!

కరోనా నియంత్రణకు ప్రభుత్వానికి సహకరించేందుకు తూర్పు నావికా దళం ముందుకొచ్చింది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు, బోధనాసుపత్రుల్లో ఆక్సిజన్‌ ప్లాంట్లు నిర్వహణ చేపట్టనుంది. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి ఎంటి కృష్ణబాబు విశాఖలో స్టీల్‌ ప్లాంట్‌ సీఎండీ, తూర్పు నావికాదళం అధికారులను కలిసి ఆక్సిజన్‌ సరఫరా, నిల్వలు, నిర్వహణపై చర్చించారు.

ఆక్సిజన్‌ ప్లాంట్లు లీకేజీలు, స్ధితిగతులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు నిర్వహణ బాధ్యతలు తూర్పు నావికాదళం తీసుకుంటుంది. దీనికోసం అత్యవసరంగా నాలుగు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసింది, ఒక్కో బృందం మూడు నుంచి నాలుగు జిల్లాల్లో నిర్వహణా బాధ్యతలు చేపడుతుంది.

ఎక్కడ అవసరమైతే అక్కడకి ఈ బృందాలను వాయుమార్గంలో తరలించడానికి ఏర్పాటు చేసుకుంటోంది. సింగపూర్, థాయ్‌లాండ్, మలేషియాల నుంచి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి రానున్న ఆక్సిజన్‌తో కూడిన 25 క్రయోజనిక్‌ కంటైనర్స్‌ను తరలించేందుకు నావికాదళం అంగీకరించింది.

రెగ్యులర్‌ అవసరాల కోసం లిక్విడ్‌ మెడికల్‌ ఆక్సిజన్‌ కంటైనర్స్‌ను తరలించేందుకు ప్రత్యేకంగా వాహనాలు సమకూర్చనున్నారు నేవీ అధికారులు. దీంతో పాటు ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్స్, డి–టైప్‌ ఆక్సిజన్‌ సిలిండర్లతో పాటు కోవిడ్‌ చికిత్సకు అవసరమైన ఇతర వైద్య పరికరాల సరఫరాకు నేవీ ముందుకొచ్చింది.

ఐఎన్‌ఎస్‌ కళింగ ఆసుపత్రిలో 10 ఆక్సిజన్‌ బెడ్స్ తో పాటు 60 పడకలును కోవిడ్‌ చికిత్స కోసం కేటాయించనున్నారు. అదనంగా విశాఖపట్నం జిల్లా కంచరపాలెంలో 150 పడకల తాత్కాలిక ఆసుపత్రి కోసం మౌలిక సదుపాయాల ఏర్పాటుకు చేస్తామని, దీనికి అవసరమైన వైద్యులు, పారామెడికల్‌ స్టాప్‌ ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. దీనితో పాటు 200 డి–టైప్‌ సిలిండర్ల అందించనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular