Sunday, September 29, 2024
HomeTrending Newsదేశ ప్రజలను గెలిపిస్తాం - కెసిఆర్

దేశ ప్రజలను గెలిపిస్తాం – కెసిఆర్

75 ఏండ్ల స్వతంత్ర భారతంలో దేశాన్నేలిన పార్టీలు గద్దెనెక్కడం గద్దెను దిగడం తప్ప దేశానికి చేసిందేమిలేదనిసిఎం కెసిఆర్ అన్నారు. జై తెలంగాణ నినాదంతో మనమే ఉద్యమించినం, మన నెత్తిన భారం పెట్టుకుని, అనుకున్నది సాధించామన్నారు. హైదరాబాద్ తెలంగాణ భవన్ లో ఈ రోజు తెలంగాణ రాష్ట్ర సమితి సర్వ సభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సమితి పేరును భారత రాష్ట్ర సమితిగా మారుస్తూ సమావేశం ఏకగ్రీవ తీర్మానం చేసింది. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన సిఎం కెసిఆర్ రాష్ట్ర , జాతీయ అంశాల్ని ప్రస్తావించారు.

కెసిఆర్ ప్రసంగం ఆయన మాటల్లోనే …

ఏపని చేసినా అర్థవంతంగా ప్రకాశవంతంగా చేయాలి. సరిగ్గా 21 సంవత్సరాల క్రితం కొండా లక్ష్మణ్ బాపూజీ గారి నివాసం జల దృశ్యంలో ప్రారంభమైన మనం., నాటి సమైక్య పాలనలో కృంగి కృషించి పోయిన తెలంగాణ ప్రజానీకాన్ని కడుపుల పెట్టుకోని ముందుకు సాగినం. రాష్ట్రాన్ని సాధించుకుని అనతికాలంలోనే వ్యవసాయం, విద్యుత్తు, సాగునీరు, తాగునీరు సమస్త రంగాలలో అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేసుకుంటూ పోతున్నం. ఇవన్నీ ఎట్లా సాధ్యమైతున్నవి అని పక్కరాష్ట్రాల వాల్లు ఆశ్చర్య పడుతున్నరు. ఎంచుకున్న కార్యాన్ని వొక యజ్జం లాగా దీక్షలాగా చేసుకుంటూ వచ్చినం కాబట్టే ఇదంతా సాధ్యమైతున్నది.

ఇతర రాజకీయ పార్టీలకు రాజకీయాలు వొక ఆట వంటిది కానీ టిఆర్ఎస్ పార్టీ కి అదో టాస్క్ వంటిది. తెలంగాణ అభివృద్ధికోసం కార్యకర్తల్లాగా మనం కమిట్మెంట్ తో పనిచేసినం. అంతగా కష్టపడ్డం కాబట్టే గొప్ప గొప్ప విజయాలు సాధించినం. రాష్ట్రం వచ్చిన నాడు తెలంగాణ తలసరి ఆదాయం వొక లక్ష రూపాయలు మాత్రమే ఉండే…కానీ నేడు 2 లక్షల 78 వేల రూపాయలకు పెరిగింది. తెలంగాణ జిఎస్డీపీ 2014 లో 5 లక్షల 6 వేలుంటే నేడు 11 లక్షల 50 వేలకు చేరుకున్నది.


ఇంతటి అభివృద్ధిని సాధించడానికి మనం తెలంగాణలో కష్టపడి పనిచేసినట్టే.. దేశం కోసం కూడా మనం కష్టపడి పనిచేసి సాధించి చూపెడుదాం. జాతీయ పార్టీ పెట్టాలని ఆషామాషీగా తీసుకుంటున్ననిర్ణయం కాదు…అన్నీ చేసి చూయించి బలమైన పునాదులమీదినించే నిర్ణయం తీసుకుంటున్నం. భారత దేశం రాష్ట్రాల సమాఖ్య. రాష్ట్రాలు దేశం రెండు కలిసి అభివృద్ధి చెందితేనే సమగ్రాభివృద్ధి సాధ్యం. మన తెలంగాణ జీఎస్డీపీ వాస్తవానికి 14.5 లక్షల కోట్ల రూపాయలుండాల్సింది. కానీ హ్రస్వదృష్టితో కేంద్రం అనుసరిస్తున్న అసంబద్ధ విధానాల వల్ల ఇంకా కూడా అందుకోవాల్సినంత అభివృద్దిని విజయాలను తెలంగాణ అందుకోలేక పోతున్నది.

రెండు ముఖ్యమైన వివక్షలు దేశాన్ని పట్టి పీడిస్తున్నాయి. వొకటి లింగ వివక్ష, రెండోది కుల వివక్ష. లింగ వివక్ష వల్ల దేశ జనాభాలోని సగం జనాభా అయిన మహిళలు అభివృద్ధిలో భాగస్వాములు కాకపోవడం వల్ల నష్టం జరుగుతున్నది. అదే సందర్భంలో దేశ జనాభాలో 20శాతం దళితులు కూడా కుల వివక్ష వల్ల దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం పంచుకోలేకపోతున్నరు. అటు మహిళా శక్తి, ఇటు దళిత శక్తి నిర్వీర్యం కావటంతో అభివృద్ధి జరగట్లేదు. అదే సందర్భంలో పేదరికం పేరుతో అగ్రవర్ణాలని చెప్పబడే వారిలో కూడా ఎందరో అవకాశాలను కోల్పోతున్నరు. ఇవన్నీ మారకుండా దేశంలో సమూల మార్పు జరగదు. స్థూలమైన విషయాల్లో మౌలిక మైన మార్పు రాకుండా సమాజిక పరిస్థితుల్లో మార్పు రావడం సాధ్యం కాదు.


ఏ దేశాలైతే.. ఏ సమూహాలైతే.. తాము నిత్యం అనుసరిస్తున్న సాధారణ పని విధానం నుంచి బయటపడతాయో.., ఆ సమాజాన్ని వినూత్న పంథాలో నడిపిస్తాయో, అటువంటి దేశాలే గుణాత్మకంగా మారినయి. మార్పుకోరుకోని సమాజాలు మారలేదు. ఆ దిశగా ప్రజలను చైతన్యపరిచిన సమాజాలే ఫలితాలు సాధించాయి.
1980 వరకు చైనా జిడిపి మన దేశం కన్నాతక్కువగా ఉండేది. 16 ట్రిలియన్ డాలర్ల ఎకనామితో చైనా నేడు ప్రపంచంలోనే ప్రబలమైన ఆర్థిక శక్తిగా ఎదిగింది. సౌత్ కొరియా, జపాన్, మలేసియా వంటి దేశాల్లో అద్భుతాలు జరిగాయి. నేడు దళిత బంధు అనేది ప్రత్యేకంగా దళిత జనోద్దరణకోసం అమలు చేస్తున్న కార్యక్రమం. సమాజంలోని ఇతరులకు అందే అన్ని రకాల సంక్షేమ అభివృద్ధి పథకాలు దళితులకు కూడా అందుతున్నాయి. వాటితో పాటు దళిత బంధు పథకం వారికి అధికం. ఇది వారి అభివృద్ధి కోసమే అమలు చేస్తున్న ప్రత్యేక పథకం.,( a special growth engine). రాష్ట్రంలోని 8 లక్షల 40 వేల కుటుంబాలకు దళిత బంధు, రైతుబంధు , రెండు పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నది.
ఇదే విషయాన్ని, ఇక్కడకు వచ్చిన ప్రముఖ దళిత నాయకులు ఎంపీ తిరువలన్ కు చెప్తే ఆయన ఆశ్చర్యానికి గురయ్యారు. రాష్ట్రంలో 17 లక్షల 50 వేల దళిత కుటుంబాలున్నాయి. వారందరికీ దశల వారీగా దళిత బంధును అందిస్తూ బాగుచేసుకుంటూ ముందుకు సాగుతాం.


తెలంగాణలో అమలవుతున్న ఇటువంటి ఆవిష్కరణలు దేశ స్వాతంత్రం వచ్చిన తొలినాల్లలోనే అమలు చేసి వుంటే బాగుండేది. మనం అవుటాఫ్ బాక్స్ నుంచి ఆలోచన చేసి వినూత్న కార్యక్రమాలను ఆవిష్కరించినం కావట్టే ఇంతటి అభివృద్ధి సాధ్యమైంది.
దేశంలో నిర్లక్ష్యానికి గురైన మరో రంగం వ్యవసాయ రంగం. దేశంలోని రైతులు తమ హక్కుల సాధన కోసం 13 నెల్ల కాలం పాటు రోడ్ల మీద ధర్నాలు చేసే పరిస్థితి తలెత్తడం దారుణం. ఈ నేపథ్యంలో …భారత దేశ రాజకీయ రంగాన్ని ప్రభావితం చేసేందుకే మనం జాతీయ పార్టీతో ముందడుగు వేస్తున్నం. దేశ ప్రజల సమస్యలనే ఎజెండాగా చేసుకుని మనం జాతీయ పార్టీ జండాను పట్టుకోని పోతున్నం. మనం తలపెట్టిన చారిత్రక కార్యక్రమానికి యుపి మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, బిహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ లు వస్తామన్నారు. కానీ వారి వారి పరిస్థితులను అర్థం చేసుకుని నీనే వద్దన్నాను. ఇది కేవలం పార్టీ పేరు మార్పిడి కోసం జరిగే అంతర్గత సమావేశం మాత్రమే. తర్వాత జరిగే లాంచింగ్ కార్య్రమానికి పిలుచుకుంటానని చెప్పాను.

మనతో కలిసి ముందుకు సాగడానికి దేశవ్యాప్తంగా అనేక పార్టీల నేతలు ముందుకు వస్తున్నారు. తెలంగాణ ఉద్యమానికి మాజీ భారత ప్రధాని దేవగౌడ గట్టి మద్దతునిచ్చిన సంగతి మనకు తెలిసిందే. ఇటీవల నీను కలిసి చర్చించినప్పుడు తమ జెడిఎస్ సంపూర్ణ మద్దతుంటుందని వారు స్పష్టం చేశారు. ఇప్పటికే పలువురు ఆర్థిక శాస్త్రవేత్తలు, పలు రంగాల నిపుణలతో అనేక చర్చలు చేసినం. జాతీయ పార్టీ ఏర్పాటు లో వారి సలహాలు తీసుకున్నం. వనరులుండీ కూడా వాటిని సద్వినియోగం చేసుకోలేక దేశ ప్రజలు వంచించబడుతున్నారు. ఇది శోచనీయం. ఈ పద్దతి మారాలే.మనమే మార్చాలె. మన తెలంగాణను ఎట్లయితే మనం బాగుచేసుకున్నమో…మన దేశాన్ని కూడా మనం బాగుచేసుకోవాలె. ఈ దేశంలో సారవంతమైన వ్యవసాయ యోగ్యమైన సాగు భూమి వున్నది. పుష్కలంగా నీరువున్నది. కష్టపడి పనిచేసే ప్రజలున్నరు,.ఇన్నీ వున్న తర్వాత మన దేశం ప్రపంచానికే అన్నం పెట్టాలె. పలు రకాల పంటలను పండించి ప్రపంచానికి అవసరమైన ఆహార ఉత్పత్తులను అందించాలె. అది వదిలి మనమే పిజ్జాలు, బర్గర్లు తినడం అంటే అవమానకరం.
మనం ఛాలెంజ్ గా తీసుకుని మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నల్లాలతోని నీల్లు ఇచ్చినట్టు భారత దేశమంతా ఇవ్వలేమా ? దేశమంతా ఇవ్వొచ్చు. మనం అదే కమిట్ మెంట్ తో దేశవ్యాప్తంగా ఇంటింటికి నల్లా నీల్లను అందించాలె. ఇందుకు చైనాతో పాకిస్తాన్ తోనో అమెరికా తోనో యుద్దం చేయాల్సిన అవసరం లేదు. కేవలం చిత్తశుద్ది ఉంటే చాలు…శుద్ది చేసిన మంచినీల్లను దేశమంతా అందించగలం. ఈ సమావేశంలో కూర్చున్న వాల్లంతా తెలంగాణ సాదించిన యోధులు…వీరు అదే స్పూర్తితో దేశ సేవ చేయడానికి సిద్దంగా వున్నారు (అతిథులనుద్దేశించి హిందీలో చెప్పిన సిఎం గారు).
నేను తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వుంటూనే దేశమంతా పర్యటిస్తా,. కార్యక్షేత్రం వదలం. ఇందులో ఎవరికీ ఎటువంటి అనుమానం అక్కరలేదు. ఉజ్వల భారతం తయారు కావాల్సిన అవసరమున్నది. మన దేశంలోని వనరులు మన దేశంలోనే వాడితే అమెరికా కంటే గొప్పగా అభివృద్ధి చెందుతాం,. మనకు ఇంకా మంచి సమయం ఉన్నది. మనం దేశవ్యాప్తంగా విస్తరిస్తం. మొట్టమొదటి కార్యక్షేత్రంగా మహారాష్ట్రను ఎంచుకుంటం. మన జాతీయ పార్టీకి అనుబంధ రైతు సంఘటనను మొదట మహారాష్ట్ర నుంచే ప్రారంభిస్తం.

తెలంగాణ వల్ల దేశానికి మంచి జరిగితే అది దేశ చరిత్రలో స్థిర స్థాయిలో నిలిచిపోతది. దళిత ఉద్యమం, రైతు ఉద్యమం, గిరిజన ఉద్యమం ద్వారా వీటిని ప్రధాన ఎజెండాగా తీసుకోని ముందుకు సాగుతాం. దేశవ్యాప్తంగా వున్న అనేక సామాజిక రాజకీయ రుగ్మతలను తొలగిస్తాం. ఇప్పటికే తెలంగాణ ఆచరించి దేశానికి చూపించింది. పరిస్థితులను ఎప్పటికప్పుడు బేరీజు వేసుకుంటూ ముందుకు సాగుతాం. తెలంగాణ ఉద్యమాన్ని విజయతీరాలకు తీసుకపోయినట్టుగానే, దేశాన్ని ముందుకు తీసుకపోవాలె. తెలంగాణలో ప్రతి వర్గాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రయత్నం చేసి సాధించినం. పల్లెలు పట్టణాలను అభివృద్ధి పరుచుకున్నం. కేంద్రం ప్రకటించిన అవార్డులే అందుకు సాక్ష్యం. ఒక అద్భుతమైన తాత్విక పునాదితో ముందుకు సాగుతాం. దేశవ్యాప్తంగా సాగే క్రమంలో అందరి సహకారం అవసరం. ఎట్లయితే పట్టుదలతో తెలంగాణ ప్రజలను గెలిపించినమో..అదే పద్దతిలో దేశ ప్రజలను కూడా లక్ష్య సాధనలో మనం గెలిపిస్తాం.’’ అని సిఎం కెసిఆర్ అన్నారు.


భారత రాష్ట్ర సమితి తీర్మానం :
ఈ సందర్భంగా టిఆర్ఎస్ పార్టీ పేరును ‘భారత రాష్ట్ర సమితి ’ గా మార్చుతూ సిఎం కెసిఆర్ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ తీర్మానాన్ని జయ జయ ధ్వానాలతో సర్వసభ్య సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించింది.
ఈ సందర్భంగా టిఆర్ఎస్ అధినేత సిఎం కెసిఆర్ గారు ఇంగ్లీషు భాషలో చదివిన తీర్మానం :
Telangana Rastra Samithi party has conducted its General Body meeting on 5-10-2022 at its party headquarters, at Hyderabad. The party General Body meeting unanimously resolved to change the name of the party from Telangana Rastra Samithi to Bharat Rashtra Samithi, with a view to expand its activities nationwide, accordingly the constitution of the party is also amended.

Also Read టిఆర్ఎస్ ఇక భారత రాష్ట్ర సమితి

RELATED ARTICLES

Most Popular

న్యూస్