Sunday, September 22, 2024
HomeTrending NewsJana Sena: పెడనలో అల్లర్లకు కుట్ర: పవన్ ఆరోపణ

Jana Sena: పెడనలో అల్లర్లకు కుట్ర: పవన్ ఆరోపణ

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సంచలన ఆరోపణ చేశారు. రేపు పెడనలో జరగనున్న జనసేన వారాహి విజయ యాత్రలో అల్లర్లు సృష్టించేందుకు జగన్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, మూడు వేల మంది కిరాయి మూకలను దింపి అమలాపురం తరహా అల్లర్లు చేసేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రస్తుతం కృష్ణా జిల్లాలో జనసేన వారాహి యాత్ర కొనసాగుతోంది. మొన్న అవనిగడ్డలో జరిగిన బహిరంగ సభలో పవన్ ప్రసంగించారు. నేడు మచిలీపట్నంలో జనవాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ ఈ వ్యాఖ్యలు చేశారు. “కొంతమంది గూండాలను, క్రిమినల్స్ ను పబ్లిక్ మీటింగ్ లోకి జొప్పించి రాళ్ళ దాడి చేయించేందుకు పకడ్బందీ వ్యూహం చేసినట్లు తెలుస్తోంది” అన్నారు.

జనసేన, టిడిపి తమ్ముళ్ళు, కార్యకర్తలు, నాయకులు కలిసి భవిష్యత్తులో రాష్ట్ర సుస్థిరత కోసం కలిసి పని చేయడం సహించలేకపోతున్నారని, అందుకే దీన్ని చెడగొట్టేందుకు లోతుగా పథక రచన చేస్తున్నారని పేర్కొన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగితే సిఎం జగన్, హోం మంత్రి, డిజిపియే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. తమ యాత్రలో రాళ్ళ దాడి జరిగినా, క్రిమినల్ చర్యలు జరిగినా సంపూర్ణంగా ప్రభుత్వానిదే బాధ్యత అవుతుందన్నారు. పోలీసు అధికారులంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. పులివెందుల తాలూకూ రౌడీయిజం చూపిస్తే కామ్ గా భరించే వ్యక్తులం తాము కాదని సిఎం జగన్ ను ఉద్దేశించి పవన్ వ్యాఖ్యానించారు.

రేపటి సభలో రాళ్ళు, కత్తులు, కటార్లు తీసుకొచ్చే వారిపై అప్రమత్తంగా ఉండాలని, వారిపై ఎదురుదాడికి దిగవద్దని పవన్  జనసేన కార్యకర్తలకు సూచించారు. అలాంటి వారు ఎవరైనా కనబడితే వారి చేతులు, కాళ్ళు కట్టేసి బంధించాలని, చట్టానికి అప్పగిద్దామని విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్