Friday, October 4, 2024
HomeTrending Newsశత్రువులతో ఇజ్రాయెల్ బహుముఖ యుద్ధం

శత్రువులతో ఇజ్రాయెల్ బహుముఖ యుద్ధం

యూదు దేశం ఇజ్రాయెల్‌ 1948లో ఒక దేశంగా ఏర్పడిన నాటి నుంచి శత్రు దేశాల నుంచి నిరంతరం దాడులు ఎదుర్కుంటూనే ప్రతి దాడులు చేస్తోంది. అరబ్ దేశాలన్నింటిని ఎదుర్కొని సాంకేతికంగా, ఆర్థికంగా అత్యున్నత స్థాయికి ఎదగటంలో పాలకుల చిత్తశుద్ది, ప్రజల క్రమశిక్షణ ఎంతో ఉంది. అడపాదడపా శత్రువుల ప్రతిఘటన ఎదుర్కొంటున్నా… ఈసారి యుద్ధం తార స్థాయికి చేరుకున్నట్టుగా కనిపిస్తోంది.

2023 అక్టోబర్ 7న అర్ధరాత్రి ఇజ్రాయెల్‌ పై గాజాస్ట్రిప్‌ మీదుగా హమాస్‌ తెగపడింది. ఇజ్రాయెల్‌ భూభాగంలోకి చొచ్చుకెళ్లి రాకెట్‌ దాడులతో వందలాది మందిని బలిగొంది. దీంతో హమాస్‌పై కన్నెర్ర చేసిన ఇజ్రాయెల్‌ ప్రతిదాడికి దిగింది. గాజాలో హమాస్‌ను పూర్తిస్థాయిలో తుడిచిపెట్టే దిశగా ఇజ్రాయెల్‌ ఏడాది నుంచి దాడులు చేస్తున్నది. దాడుల్లో దాదాపు 50 వేల మంది మరణించినా ఇప్పటికీ పరిష్కారం దొరకడం లేదు. హమాస్‌ చేతిలో బందీలుగా ఉన్న తమ పౌరులను విడిపించుకునేందుకు ఇజ్రాయెల్‌ పోరాటం కొనసాగుతున్నది.

హిజ్బోల్లా లక్ష్యంగా…

హమాస్‌కు మద్దతుగా ఏడాది కాలంగా ఇజ్రాయెల్‌పై లెబనాన్‌ నుంచి హెజ్బొల్లా దాడులకు పాల్పడుతోంది. ఈ నేపథ్యంలో నెల రోజులుగా హెజ్బొల్లాను ఇజ్రాయెల్‌ లక్ష్యంగా చేసుకుంది. హెజ్బొల్లా చీఫ్‌ నస్రల్లాను హతమార్చింది. ఒకవైపు గగనతల దాడులు చేస్తూనే లెబనాన్‌లోకి చొచ్చుకెళ్లి భూతల దాడులు ప్రారంభించింది. హెజ్బొల్లాకు సైతం వేల సంఖ్యలో సైనిక బలం ఉండటం, పెద్ద ఎత్తున ఆయుధాలు ఉండటంతో పోరాటం తీవ్రరూపం దాల్చుతోంది.

హౌతీల దాడులు…

యెమెన్‌ నుంచి హౌతీ తిరుగుబాటుదారులు సైతం ఇజ్రాయెల్‌ను శత్రువుగా ప్రకటించారు. చాలా ప్రాంతాలను ఆధీనంలో ఉంచుకున్న హౌతీలకూ హమాస్‌, హెజ్బొల్లా మాదిరిగానే ఇరాన్‌ మద్దతు ఉంది. దీంతో తరచూ ఇజ్రాయెల్‌పై హౌతీలు డ్రోన్లతో దాడులు చేస్తున్నారు. ఇజ్రాయెల్‌కు దక్షిణ వైపు సరిహద్దుల్లో, జలమార్గాల్లో హౌతీలతో తరచూ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో హౌతీలపైనా ఇజ్రాయెల్‌ పోరాడుతున్నది.

ఇరాక్, సిరియా నుంచి మిలీషియాలు…

ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ ఐసిస్ అండదండలతో సిరియా, ఇరాక్‌ కేంద్రంగా పని చేస్తున్న మిలీషియాలు సైతం ఇజ్రాయెల్‌ను లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తున్నాయి. వీటికి సైతం ఇరాన్‌ మద్దతు ఉందని, ఇరాన్‌ నుంచి ఆయుధాలు అందుతున్నాయని ఇజ్రాయెల్‌ ఆరోపిస్తోంది. సిరియా నుంచి మిలీషియాలు ఇటీవల తరచూ ఇజ్రాయెల్‌పై డ్రోన్లతో దాడులు చేస్తున్నారు. ఇజ్రాయెల్‌ సైతం సిరియా రాజధాని డమాస్కస్‌లోని మిలీషియా కేంద్రాలపై దాడులు చేస్తోంది.

వెస్ట్ బ్యాంక్ లో మిలిటెంట్ల ముప్పు… 

ఇజ్రాయెల్‌ ఆధీనంలోని వెస్ట్‌బ్యాంక్‌ లో మిలిటెంట్లు చురుగ్గా ఉన్నారు. వెస్ట్‌బ్యాంక్‌లో మిలిటెంట్లు, ఇజ్రాయెల్‌ బలగాలు మధ్య తరచూ దాడులు జరుగుతుంటాయి. పాలస్తీనాతో పాటు ఇజ్రాయెలీలు నివసించే ఈ ప్రాంతంలో మిలిటెంట్లతో పోరాటం ఇజ్రాయెల్‌కు సమస్యాత్మకంగా మారింది.

ఇరాన్ తో యుద్ధం …

ఇజ్రాయెల్‌ వ్యతిరేక శక్తులకు అండగా ఉంటున్న ఇరాన్‌ ఇప్పుడు నేరుగా రంగంలోకి దిగింది. ఇజ్రాయెల్‌పై ఒకేసారి 180 క్షిపణులతో విరుచుకుపడి యుద్ధానికి సిద్ధమని ప్రకటించుకుంది. ఈ దాడితో ఇరాన్‌ చాలా పెద్ద తప్పు చేసిందని, మూల్యం చెల్లించుకోవాల్సిందేనని ఇజ్రాయెల్‌ హెచ్చరించింది. దీంతో ఇరు దేశాల మధ్య పోరు తీవ్రం కానుంది. మిగతా అన్ని మిలిటెంట్‌ సంస్థలతో పోరాటం ఒక సవాల్‌ కాగా, నేరుగా ఇరాన్‌తో పోరాటం ఇజ్రాయెల్‌కు పెద్ద సవాల్‌గా మారనుంది.

ఏడాది క్రితం కేవలం హమాస్‌తో ప్రారంభమైన ఇజ్రాయెల్‌ పోరాటం అనేక శక్తులతో నలువైపులా పోరాడాల్సిన స్థితిలోకి వెళ్లింది. దశాబ్దాల తర్వాత మరోసారి యూదులు భారీ బహుముఖ యుద్ధం చేస్తున్నారు.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్