Saturday, September 21, 2024
HomeTrending Newsకుప్పంలో వైసీపీ జెండా : సజ్జల

కుప్పంలో వైసీపీ జెండా : సజ్జల

2024లో కుప్పం నియోజకవర్గంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంఎల్ఏ అభ్యర్ధి ఘన విజయం సాధించేలా పని చేయాలని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కార్యకర్తలకు పిలుపు నిచ్చారు. పార్టీ దివంగత నేత చంద్రమౌళి తనయుడు భరత్ జెయింట్ కిల్లర్ గా అసెంబ్లీలో అడుగుపెట్టాలని అయన ఆకాంక్షించారు. సర్పంచ్ ఎన్నికల నుంచే కుప్పంలో చంద్రబాబుకు కౌంట్ డౌన్ ప్రారంభమైందన్నారు. తాడేపల్లి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో వ‌న్య‌కుల క్ష‌త్రియ‌ కమ్యూనిటీ రాష్ట్ర స్థాయి సమావేశానికి వ‌న్య‌కుల క్ష‌త్రియ‌ ఛైర్‌పర్సన్‌ శ్రీమతి కె.వ‌నిత శ్రీ‌ను అధ్యక్షత వహించారు. సజ్జల ఈ సమావేశానికి ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. కుప్పం టిడిపి కోటను బధ్దలు కొట్టుకుని ముఖ్యమంత్రి వైయస్ జగన్ ప్రజల హృదయాలలో ఎంతగా చొచ్చుకుపోయారో సర్పంచ్ ఎన్నికలలో విజయమే తార్కాణంగా నిలుస్తుందని వెల్లడించారు.

భారతీయ సమాజంలో అసమానతలైనా, ఆర్ధికాభివృధ్ది అయినా, సాంస్కృతిక అభివృధ్ది అయినా కులాల ఆధారంగా జరుగుతుందనేది అందరూ అంగీకరించాల్సిన వాస్తవమన్నారు సజ్జల. వెనకబడిన బిసి కులాలను ప్రోత్సహించాలనే సదుధ్దేశ్యంతో దివంగత వైయస్ రాజశేఖరరెడ్డిగారు బిసి కులాలకు సంబంధించి ఫెడరేషన్లను ఏర్పాటు చేశారన్నారు. వైయస్ జగన్ గారు మరో అడుగు ముందుకు వేసి బిసి అధ్యయన కమిటిని నియమించి బిసి కులాల్లో వెనకబడిన కులాలను గుర్తించారని తెలిపారు. వాటికి గుర్తింపు ఇవ్వాలనే ఉధ్దేశ్యంతో బిసి డిక్లరేషన్ ప్రకటించారన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత బిసి కార్పోరేషన్లను ఏర్పాటుచేశారన్నారు. బిసి కులాల్లో కూడా మహిళలను అన్ని విధాలా అభివృద్దిపధంలోకి తీసుకురావాలనే వారికి పదవులలో అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారని తెలియచేశారు.

చంద్రబాబు బిసి కులాలను ఆదరణ పేరుతో వారిని వృత్తులకే పరిమితం చేస్తూ కత్తెర్లు, తాపీపనిముట్లు, ఇస్త్రిపెట్టెలు మాత్రమే ఇస్తూ అందులో కుంభకోణాలకు పాల్పడుతూ ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచినట్లే బిసికులాలకు కూడా వెన్నుపోటు పొడిచారన్నారు. బిసిలను కేవలం ఓటుబ్యాంకుగానే కాకుండా వారిని సమాజంలో ఉన్నతవర్గాలతో సమానంగా అభివృధ్దిలోకి తీసుకురావాలనే ధృఢసంకల్పంతో జగన్ ఉన్నారన్నారు.

వన్యకుల క్షత్రియులు తమ సమస్యలను తామే పరిష్కరించుకునేలా వన్యకుల క్షత్రియ కార్పోరేషన్ లో నియమితులైన నేతలు పనిచేయాలన్నారు. ఇప్పుడు కార్పోరేషన్ ఏర్పాటు ద్వారా వారు ప్రభుత్వంలో భాగమనే విషయాన్నివారు గుర్తించాలని కోరారు. సామాజిక సంక్షేమం వర్ధిల్లాలన్నా…రాష్ట్రం బ్రహ్మాండంగా అభివృధ్ది చెందాలన్నా….కులాలు, మతాలకు అతీతంగా అభివృధ్ది జరగాలన్నా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ, వైయస్ జగన్ అధికారంలో ఉండాలనే ధృఢసంకల్పంతో వన్యకుల క్షత్రియులు పనిచేయాలన్నారు.

రాజ్యసభ సభ్యులు  మోపిదేవి వెంక‌ట‌ర‌మ‌ణ మాట్లాడుతూ…. వన్యకుల క్షత్రియ కులస్ధులు మాట తప్పని వ్యక్తులని, వారంతా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పక్షాన ఉన్నారని అన్నారు. కుప్పం నియోజకవర్గంలో అత్యధికమంది వన్యకుల క్షత్రియులు ఉన్నారని వారికి పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని అన్నారు.

ఎమ్మెల్సీలు లేళ్ళ అప్పిరెడ్డి, దువ్వాడ శ్రీ‌నివాస్‌, నవరత్నాల అమలు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌-చైర్మన్ అంకంరెడ్డి నారాయ‌ణ‌ మూర్తి, కుప్పం నియోజ‌క‌వ‌ర్గ పార్టీ స‌మ‌న్వ‌య‌క‌ర్త కె.ఆర్‌.జె.భ‌ర‌త్, వ‌న్య‌కుల క్ష‌త్రియ‌ కార్పొరేష‌న్ డైరెక్ట‌ర్లు మ‌రియు పార్టీ నేతలు, త‌దిత‌రులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్