Thursday, March 12, 2026
HomeTrending Newsధాన్యం సేకరణకు పటిష్ట విధానం : సిఎం జగన్‌

ధాన్యం సేకరణకు పటిష్ట విధానం : సిఎం జగన్‌

Effective Policy To Paddy Procurement In The State Cm Jagan :

రైతు భరోసా కేంద్రాల వద్దే ధాన్యం సేకరించాలని, రైతుల బకాయిలు వేగంగా చెల్లించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ధాన్యం సేకరణకు పటిష్ట విధానం అమలు చేస్తున్నామని, ఇ–క్రాప్‌ బుకింగ్, ఈ-కేవైసీ ఏర్పాటు చేశామని, వ్యవసాయ సలహా మండళ్లు, వీఏఏలు, వాలంటీర్లతో రైతులకు అవగాహన పెంచే కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ఆధార్‌ నంబర్‌ ఆధారంగా చెల్లింపులు జరపాలన్నారు. ధాన్యం సేకరణ, కొనుగోళ్లపై మంత్రుల బృందంతో కలిసి క్యాంప్‌ కార్యాలయంలో సిఎం జగన్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా సిఎం పలు సూచనలు చేశారు

⦿ ధాన్యం కొనుగోళ్లలో మోసాలను నివారించే చర్యల్లో భాగంగా పూర్తిగా మిల్లర్ల పాత్రను తీసివేశాం
⦿ రైతుల ముంగిటే, ఆర్బీకేల స్థాయిలోనే ధాన్యం సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం
⦿ ధాన్యం సేకరణలో అక్రమాలు, అవకతవకలకు ఆస్కారం ఉండకూడదు
⦿ అవినీతికి ఎట్టి పరిస్థితుల్లోనూ చోటు ఉండకూడదు
⦿ ధాన్యం నాణ్యతను నిర్ధారించే ప్రక్రియ అత్యంత పారదర్శకంగా ఉండేలా గట్టి చర్యలు తీసుకోవాలి
⦿ ధాన్యం సేకరణలో రైతులకు మేలు చేసేలా కొత్త విధానంలోకి వెళ్తున్నాం
⦿ దీన్నొక సవాల్‌గా తీసుకుని, అన్నిరకాలుగా సిద్ధంకావాలి
⦿ ధాన్యం సేకరణపై రైతులకు అవగాహన కల్పించాలి
⦿ వాలంటీర్లు, ఆర్బీకేల ద్వారా కరపత్రాలను ప్రతి రైతు ఇంటికీ ఇవ్వాలి
⦿ ధాన్యం సేకరణపై వివరాలతో కూడిన బోర్డును ఆర్బీకేల్లో ఉంచాలి
⦿ మంచి ధర పొందడానికి తగిన సలహాలు, సూచనలు కూడా అందించాలి
⦿ ఎలాంటి మినహాయింపులు లేకుండా రైతులకు పూర్తిస్థాయిలో కనీస మద్దతు ధర అందాలి

ఖరీఫ్‌లో వరి సాగు, దిగుబడులపై వివరాలు అందించిన అధికారులు

⦿ 15.66 లక్షల హెక్టార్లలో వరిసాగుచేశారని అంచనాలు వెల్లడించిన అధికారులు
⦿ దాదాపు 87లక్షల మెట్రిక్‌ టన్నులకుపైగా ధాన్యం దిగుబడి ఉంటుందని అధికారుల అంచనా
⦿ దీంట్లో దాదాపు 50లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని సేకరించాల్సి ఉంటుందని అంచనా
⦿ 6884 ఆర్బీకేల పరిధిలో వరిని సాగు చేసినట్టుగా వివరాలు వెల్లడించిన అధికారులు

ఈ సమీక్షా సమావేశంలో ఆర్ధికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు, పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు (నాని), గృహనిర్మాణశాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, సీఎస్‌ డాక్టర్‌ సమీర్‌ శర్మ, వ్యవసాయశాఖ స్పెషల్‌ సీఎస్‌ పూనం మాలకొండయ్య, అగ్రి మార్కెటింగ్‌ ముఖ్య కార్యదర్శి వై మధుసూధన్‌రెడ్డి, ఆర్ధికశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌ ఎస్‌ రావత్, పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ గిరిజాశంకర్,  మార్కెటింగ్‌ స్పెషల్‌ కమిషనర్‌ పీ ఎస్‌ ప్రద్యుమ్న, ఏపీఎస్‌సీఎస్‌సీఎల్‌ వీసీ అండ్‌ ఎండీ జీ వీరపాండ్యన్, వ్యవసాయశాఖ స్పెషల్‌ కమిషనర్‌ హెచ్‌ అరుణ్‌కుమార్‌ ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular