Thursday, September 19, 2024
HomeTrending Newsఅప్రమత్తంగా ఉండాలి - కేంద్రం హెచ్చరిక

అప్రమత్తంగా ఉండాలి – కేంద్రం హెచ్చరిక

కరోనా కేసుల సంఖ్య దేశంలో మరోసారి వేగంగా పెరుగుతున్నది. గత 24 గంటల్లో దేశంలో 13వేలకుపైగా కొత్త కేసులు నమోదయ్యాయని, కేసుల పెరుగుదల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని కేంద్రం హెచ్చరించింది గురువారం ఆరోగ్య మంత్రిత్వ శాఖ కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం దేశంలో 82402 యాక్టివ్‌ కేసులున్నాయన్నారు. వారంలో సగటున 8,009 కొత్త కేసులు నమోదవుతున్నాయని, గత మూడు నాలుగు రోజులుగా కేసులు పెరుగుతున్నందున అప్రమత్తంగా ఉండాలన్నారు.
ఎనిమిది జిల్లాల్లో పాజిటివిటీ రేటు పదిశాతం కంటే ఎక్కువగా ఉందని, 14 జిల్లాల్లో వారానికోసారి 5 నుంచి 10శాతం మధ్య పాజిటివిటీ రేటు ఉందని, ఈ క్రమంలో నిరంతరం రాష్ట్రాలకు మార్గదర్శకాలు ఇస్తున్నామన్నారు. మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, ఢిల్లీ, కర్ణాటక, గుజరాత్‌లో కేసుల పెరుగుదలపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం 3.30లక్షల ఒమిక్రాన్‌ కేసులున్నాయని, ఈ వేరియంట్‌ కారణంగా 59 మరణాలు సంభవించాయని పేర్కొన్నారు. దక్షిణాఫ్రికాలో 96శాతం, యూకేలో 59శాతం ఒమిక్రాన్‌వేనన్నారు.
ఒమిక్రాన్‌ తొలి కేసు నమోదైన నాటి నుంచి నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు లవ్‌ అగర్వాల్‌ పేర్కొన్నారు. ప్రతి రోజు సమావేశాలు జరుపడంతో పాటు సమీక్షలు నిర్వహిస్తూ కేంద్ర బృందాలను పంపుతూ మార్గదర్శనం చేస్తున్నామన్నారు. ఇన్ఫెక్షన్ నుంచి కోలుకున్న తర్వాత 9 నెలల పాటు రోగనిరోధక శక్తి ఉంటుందని ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ బలరామ్ భార్గవ తెలిపారు. కొవిషీల్డ్‌, కొవాక్సిన్ టీకాలు తీసుకున్న తర్వాత రోగనిరోధక శక్తి పది నెలల పాటు కొనసాగుతుందని భారత్‌లో మూడు అధ్యయనాలు గుర్తించాయని పేర్కొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్