Saturday, March 14, 2026
HomeTrending Newsవిభజన హామీలు నెరవేర్చండి: సిఎం వినతి

విభజన హామీలు నెరవేర్చండి: సిఎం వినతి

CM Jagan met PM: విభజన హామీలను త్వరితగతిన అమలు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి విజ్ఞప్తి చేశారు. విభజన సమయంలో ప్రత్యేక హోదా హామీతోపాటు అనేక హామీలు ఇచ్చారని, వీటిని అమలు చేస్తే ఏపీకి చాలా వరకు ఊరట లభిస్తుందని కానీ చాలా హామీలు ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయని ప్రధాని దృష్టికి జగన్ తీసుకు వెళ్ళారు. ప్రధాని మోడీతో నేటి సాయంత్రం సిఎం జగన్‌ భేటీ అయ్యారు. ప్రధాని నివాసంలో సుమారు గంటసేపు జరిగిన ఈ సమావేశం జరిగింది. ష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలను, పెండింగ్‌ సమస్యలను ప్రధానికి సిఎం నివేదించారు. ఈ మేరకు విజ్ఞాపన పత్రం కూడా ముఖ్యమంత్రి అందించారు.

సిఎం జగన్ ప్రస్తావించిన అంశాలు:

⦿ రాష్ట్ర విభజన పర్యవసానాలు ఆర్థిక ప్రగతిని తీవ్రంగా దెబ్బ తీశాయి
⦿ రాష్ట్ర విభజన సమయంలో 58 శాతం జనాభా ఏపీకి రాగా, కేవలం 45 శాతం రెవిన్యూ మాత్రమే దక్కింది
⦿ 2015–16లో తెలంగాణ రాష్ట్ర తలసరి ఆదాయం రూ.15,454 కాగా, ఏపీ తలసరి ఆదాయం రూ.8,979 మాత్రమే.
⦿ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉన్నదో తెలియచేయడానికి ఈ ఒక్క గణాంకాలే నిదర్శనం
⦿ భౌగోళికంగా చూస్తే తెలంగాణ కన్నా ఆంధ్రప్రదేశ్‌ పెద్దది, ఇక్కడుండే జనాభా కూడా ఎక్కువ.


⦿ ప్రజల అవసరాలను తీర్చాలంటే, వారికి సరైన సేవలు అందించాలంటే అంతే స్థాయిలో వ్యయం కూడా చేయాల్సి ఉంటుంది.
⦿ విభజన వల్ల రాజధానిని కూడా ఏపీ కోల్పోయింది. అక్కడ ఏర్పాటు చేసుకున్న మౌలిక సదుపాయాలను కోల్పోయాం.
⦿ పోలవరం అంచనా వ్యయాన్ని రూ.55,657 కోట్లుగా నిర్ణయించాలి. అంతే కాకుండా పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన రూ.2100 కోట్ల పెండింగ్‌ బిల్లులను మంజూరు చేసేలా ఆర్థిక శాఖకు ఆదేశాలు ఇవ్వాలని కోరుతున్నాను.
⦿ రెవెన్యూ లోటు కింద ఏపీ కి రావాల్సిన నిధులు రూ.18,830.87 కోట్లు చెల్లించి రాష్ట్రానికి అండగా నిలవాలని కోరుతున్నాను.
⦿ తెలంగాణ నుంచి రావాల్సిన 6,284 కోట్ల రూపాయిల బకాయిలను చెల్లించాల్సి ఉంది. ఈ బిల్లులను చెల్లించేలా తగిన ఆదేశాలు ఇవ్వాలని కోరుతున్నాం.
⦿ జాతీయ ఆహార భద్రతా చట్టం కింద లబ్ధిదారుల గుర్తింపులో హేతుబద్ధత లేని విధానం వల్ల రాష్ట్రం తీవ్ర సమస్యలను ఎదుర్కొంటోంది. అర్హత ఉన్న చాలా మంది ఈ చట్టం కింద కవర్‌ కావడం లేదు. ఎక్కువ మంది లబ్ధిదారులు కవర్‌ అయ్యేలా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నాను.

రాష్ట్రంలో ఆర్ధిక పరిస్థితి, ఎఫ్ఆర్బీఎం పరిమితి, భోగాపురం ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు నిర్మాణం, వైయస్సార్‌ కడప జిల్లాలో ఇంటిగ్రేటెడ్‌ స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటు లాంటి అంశాలను కూడా ప్రధాని దృష్టికి తీసుకు వెళ్ళారు.

Also Read : రైతు భరోసా: మూడో ఏడాది మూడో విడత

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular