Thursday, September 19, 2024
HomeTrending Newsటిడ్కో ఇళ్ళపై టిడిపివి అవాస్తవాలు

టిడ్కో ఇళ్ళపై టిడిపివి అవాస్తవాలు

No Politics: గత ప్రభుత్వ హయాంలో ఒక్క టిడ్కో ఇంటినైనా లబ్ధిదారుడికి కేటాయించారా అని రాష్ట్ర పురపాలక, పట్టాణా భివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ టిడిపి నేతలను ప్రశ్నించారు. అమెరికా, లండన్, జపాన్ , టోక్యో నుంచి టెక్నాలజీ తీసుకొచ్చి షేర్ వాల్ టెక్నాలజీతో టిడ్కో ఇళ్ళు నిర్మించామని నిన్న కూడా చంద్రబాబు, టీడీపీ నేతలు మాట్లాడుతున్నారని, ఆ టెక్నాలజీ పేరుతో దోచుకుతిన్నది నిజం కాదా? అని నిలదీశారు. కట్టని ఇళ్ళను కట్టినట్లు ప్రచారాం చేసుకోవడం వారికే చెల్లిందని, వారి హయాంలో కట్టామని చెబుతున్న 3.15 లక్షల టిడ్కో ఇళ్ళను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు రావాలని సవాల్ విసిరారు. టిడ్కో ఇళ్ళపై నిన్న టిడిపి కార్యాలయంలో ఫోటో ఎగ్జిబిషన్, అనంతరం ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు చేసిన ఆరోపణలను విజయనగరం లో జరిగిన మీడియా సమావేశంలో బొత్స ఖండించారు.

టీడీపీ హయాంలో కేంద్రం మంజూరు చేసిన ఇళ్ళలో  3.13 లక్షలు గ్రౌండింగ్ చేయాలని ప్రయత్నం చేశారని, 2.62 లక్షల ఇళ్ళు పునాదులు వేసి వదిలేశారని, ఇప్పుడు తాము వాటిని పూర్తి చేస్తున్నామని వివరించారు.  వాస్తవాలను పక్కనపెట్టి, వారు కట్టని టిడ్కో ఇళ్ళు గృహ ప్రవేశాలకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పుకోవడంపై మంత్రి విస్మయం వ్యక్తం చేశారు. టీడీపీ హయాంలో చేపట్టిన టిడ్కో ఇళ్ళ నిర్మాణంలో 80 శాతం పనులు దాటినవి 80 వేలు, 50 శాతం దాటినవి 70 వేలు, 25 శాతం వరకు పనులు జరిగినవి 50 వేలు, బేస్ మెంట్ లో ఉన్నవి మరో 63 వేలు ఉన్నాయని,  తమ ప్రభుత్వం  అధికారంలోకి వచ్చాక రివర్స్ టెండరింగ్ కు వెళ్ళి దాదాపు రూ. 400 కోట్లు మిగిల్చామని వివరించారు.

పేదవాడికి మేలు చేసే విషయంలో రాజకీయాలొద్దని, లేనిపోని అపోహలు సృష్టించి ప్రజలను గందరగోళం చేయవద్దని తెలుగుదేశం పార్టీకి బొత్స హితవు పలికారు.  టీడీపీ, ప్రతిపక్షాల విమర్శలు, ఎల్లో మీడియా రాతలతో ప్రజలు గందరగోళానికి గురి కావొద్దని విజ్ఞప్తి చేశారు. కమిట్ మెంటుతో పనిచేస్తుంటే తమపై విమర్శలు చేయడం సరికాదన్నారు.

‘చంద్రబాబు ఒక మాట మాట్లాడితే.. మేమూ పది మాటలు మాట్లాడతాం.. మేము బాధ్యత కలిగిన వ్యక్తులుగా ఉన్నాం. తప్పుడు  మాటలు మాట్లాడి, నాలుక కరుచుకునే వ్యక్తులం కాదు;’ అని వ్యాఖ్యానించారు.  మొన్నటి వరకు ఉద్యోగల సమ్మెలో రాజకీయ లబ్ధి పొందాలని చూస్తె అది కుదరలేదని, దాంతో మరో అంశాన్ని తెరపైకి తెస్తున్నారన్నారు. ఎప్పుడు ఏం దొరుకుతుందా అని.. గోతికాడ నక్కలా టీడీపీ కాచుకు కూర్చుందని బొత్స విమర్శించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్