Tuesday, June 16, 2026
Homeజాతీయంసీజేఐగా జస్టిస్‌ ఎన్వీ రమణ ప్రమాణం

సీజేఐగా జస్టిస్‌ ఎన్వీ రమణ ప్రమాణం

భారత అత్యున్నత న్యాయస్థానం 48వ ప్రధాన న్యాయమూర్తిగా తెలుగు నేలకు చెందిన జస్టిస్‌ ఎన్వీ రమణ ప్రమాణం స్వీకారం చేశారు. ఈ ఉదయం రాష్ట్రపతి భవన్‌లో ఆయన చేత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ప్రమాణం చేయించారు.
ఇప్పటి వరకు సీజేఐగా ఉన్న ఎస్‌.ఎ.బోబ్డే పదవీకాలం నిన్నటితో ముగిసిన విషయం తెలిసిందే.

తాజాగా బాధ్యతలు చేపట్టిన జస్టిస్‌ ఎన్వీ రమణ 2022 ఆగస్టు 26 వరకు పదవిలో కొనసాగుతారు.

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోదీ, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, కేబినెట్‌ మంత్రులు, న్యాయమంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు, జస్టిస్‌ ఎన్వీ రమణ కుటుంబ సభ్యులు, తదితర ప్రముఖులు ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరయ్యారు.

కృష్ణా జిల్లా పొన్నవరం గ్రామంలోని ఓ వ్యవసాయ కుటుంబంలో జస్టిస్‌ ఎన్వీ రమణ 1957 ఆగస్టు 27న జన్మించారు. ఎన్‌. గణపతిరావు, సరోజినిలు ఆయన తల్లిదండ్రులు. జస్టిస్‌ రమణ కంచికచర్లలో ఉన్నత పాఠశాల విద్యాభ్యాసం పూర్తి చేసి, అమరావతిలోని ఆర్‌.వి.వి.ఎన్‌ కళాశాలలో బీఎస్సీలో పట్టా పొందారు. 1982లో నాగార్జున విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్రంలో పట్టా తీసుకుని 1983 ఫిబ్రవరి 10న రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌లో న్యాయవాదిగా నమోదై, న్యాయవాద వృత్తి ప్రారంభించారు. 2013లో ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించారు. ఆ తర్వాత దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2014లో సుప్రీంకోర్టుకు పదోన్నతి పొందారు.

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన రెండో తెలుగు వ్యక్తి ఈయనే కావడం విశేషం. అంతకుముందు 1966 జూన్‌ 30 నుంచి 1967 ఏప్రిల్‌ 11 వరకు తెలుగు వ్యక్తి జస్టిస్‌ కోకా సుబ్బారావు సీజేఐగా బాధ్యతలు నిర్వహించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular