Sunday, June 7, 2026
HomeTrending Newsపర్యాటక అభివృద్ధికి కృషి: మంత్రి రోజా

పర్యాటక అభివృద్ధికి కృషి: మంత్రి రోజా

Tourism: ఆంధ్ర ప్రదేశ్ లో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు కృషిచేస్తానని  రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజన సర్వీసుల శాఖల మంత్రి ఆర్కే రోజా వెల్లడించారు. అన్ని ప్రాంతాలో ఉన్న  మ్యూజియంలను, పురావస్తు కట్టడాలు, చారిత్రక ప్రాంతాలన్నింటినీ పరిరక్షిస్తామని హామీ ఇచ్చారు. మంత్రి రోజా నేడు విజయవాడలోని బాపు మ్యూజియాన్ని సందర్శించారు. ముందుగా జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మ్యూజియంలోని  పలు విభాగాలను క్షుణ్ణంగా పరిశీలించారు.  ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ…. రాబోయే రోజుల్లో అన్ని జిల్లాల్లో పర్యటించి,  పర్యాటక రంగ అభివృద్ధికి ఉన్న అవకాశాలపై దృష్టి పెడతామన్నారు. కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించి, నిధులు తేవడం ద్వారా రాష్ట్రానికి మేలు జరిగేందుకు తన వంతు కృషి చేస్తానని వివరించారు.

బాపు మ్యూజియం మన రాష్ట్రంలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన,  పురాతనమైనదని… ఈ ప్రభుత్వ హయంలోనే దీన్ని అభివృద్ధి చేశామన్నారు. ఘనమైన చరిత్ర కలిగిన ఈ విక్టోరియా మెమోరియల్ బిల్డింగ్ లో  టెక్నాలజీ ఉపయోగించి గొప్ప చరిత్రను నిక్షిప్తం చేసి మ్యూజియంగా రూపొందించడం భావితరాలకు చాలా అవసరమని ఆభిప్రాయపడ్డారు. 12.8 కోట్లతో ఈ మ్యూజియాన్ని ఆధునీకరించిన తరువాత 2020 లో అక్టోబర్ 2న మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దీన్ని ప్రారంభించారని రోజా చెప్పారు.

ఇప్పటికే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించామన్నారు. మ్యూజియాలను డిజిటలైజేషన్ చేసే పద్ధతులపై తగిన కార్యాచరణను సిద్దం చేయాలని అధికారులకు అదేశించారు. మంత్రి వెంట ఏపీ సాహిత్య అకాడమీ ఛైర్పర్సన్ పిల్లంగోళ్ళ శ్రీలక్ష్మి,  ఏపీ కల్చరల్ కమిషన్ ఛైర్పర్సన్ వంగపండు ఉష, క్రీడలు యువజన సర్వీసుల శాఖ ముఖ్య కార్యదర్శి, ఆర్కియాలజీ కమిషనర్ వాణిమోహన్,  సంబంధిత పురావస్తు శాఖ అధికారులు పాల్గొన్నారు.

Also Read : మీరే పెద్ద ఉన్మాదులు: మంత్రి రోజా

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular