CM at Delhi: ఢిల్లీ పర్యటనలో ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ సాయంత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సమావేశమయ్యారు. దాదాపు 45 నిమిషాలపాటు ఈ సమావేశం జరిగింది. రెవిన్యూలోటు భర్తీ, పోలవరంప్రాజెక్టు, జాతీయ ఆహార భద్రతా చట్టం కింద లబ్ధిదారుల ఎంపికలో తారతమ్యాల సవరణ, ఏపీఎండీసికి గనులు కేటాయింపు, మెడికల్ కాలేజీలు తదితర అంశాలను ప్రధానికి నివేదిచారు. రాష్ట్రపతి ఎన్నికల అంశంపై కూడా వీరిద్దరి సమావేశంలో చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది.
ప్రధానికి ఇచ్చిన వినతిపత్రంలో ముఖ్యాంశాలు:
- మొత్తంగా రూ.32,625 కోట్లు రెవెన్యూ గ్యాప్ కింద రాష్ట్రప్రభుత్వానికి రావాల్సి ఉంది. ఈ అంశంపై వెంటనే దృష్టిసారించి నిధులు విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలి
- తెలంగాణ ప్రభుత్వం రూ.6,627.86 కోట్ల రూపాయల విద్యుత్ బకాయిలను చెల్లించాల్సి ఉంది. ఈ వ్యవహారాన్ని వెంటనే సెటిల్ చేయాలి
- గడచిన మూడేళ్లలో రూ.17,923 కోట్ల రూపాయల మేర రుణ పరిమితిలో కోత విధించారు. కోవిడ్ లాంటి విపత్తుల దృష్ట్యా ఈ విషయంలో సానుకూల నిర్ణయం తీసుకోవాలి
- సవరించిన అంచనాల ప్రకారం పోలవరం ప్రాజెక్టు అంచనాలను రూ.55,548.87 కోట్లకు ఖరారు చేయాలి
- డ్రింకింగ్ వాటర్ కాంపొనెంట్ను ప్రాజెక్టు నిర్మాణంలో అంతర్భాగంగా చూడాలి, గతంలో జాతీయహోదా ప్రాజెక్టుల విషయలో అనుసరించిన విధానాన్నే ఇక్కడ కూడా అనుసరించాలి
- పోలవరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయాన్ని కాంపొనెంట్వారీగా విడివిడిగా కాకుండా… మొత్తం ప్రాజెక్టు వ్యయాన్ని పరిగణలోకి తీసుకుని రియింబర్స్ చేయాలి. ఈ ఆంక్షల వల్ల రాష్ట్ర ప్రభుత్వం తన సొంత నిధులను ఖర్చుచేసిన రూ.905.51 కోట్ల రూపాయలను చెల్లించలేదు
- ప్రాజెక్టు నిర్వాసిత కుటుంబాలకు ఇవ్వాల్సిన ప్యాకేజీని డీబీటీ పద్ధతిలో చేయాలి
- జాతీయ ఆహార భద్రతా చట్టం కింద రేషన్ కార్డు లబ్ధిదారుల ఎంపికలో ఉన్న అసమానతలను తొలగించాలి
- రాష్ట్రంలో కొత్తగా 13 జిల్లాలను ఏర్పాటు చేశాం. దీంతో జిల్లాల సంఖ్య 26కు చేరింది. మొత్తంగా 26 జిల్లాలకు 14 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. మిగిలిన 12 కాలేజీలకు అనుమతులు మంజూరు చేయాలి
- విశాఖ సమీపంలోని భోగాపురంలో ఎయిర్పోర్టుకు గతంలో ఇచ్చిన క్లియరెన్స్ గడువు ముగిసింది. తాజాగా క్లియరెన్స్ ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తిచేస్తున్నాను.
- ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం కడపలో స్టీల్ప్లాంట్ నిర్మిస్తామని హామీ ఇచ్చారు. వాణిజ్యపరంగా ఈ ప్లాంట్ నడిచేందుకు నిరంతరాయంగా ఐరన్ ఓర్సరఫరా చేసేందుకు వీలుగా ఏపీఎండీసీకి ఇనుపగనులు కేటాయించాలి
- ఇంటిగ్రేటెడ్ బీచ్ శాండ్ మినరల్స్ ప్రాజెక్టుకు ఏపీ ప్రభుత్వం ప్రణాళిక వేస్తోంది.
- ఈరంగంలో దాదాపు రూ.20వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించే అవకాశాలున్నాయి.
- 16 చోట్ల బీచ్శాండ్ మినరల్స్ ప్రతిపాదనలను అందించాం.
- 14 చోట్ల అనుమతులు పెండింగులో ఉన్నాయి. ఏపీఎండీసీకి వీటిని కేటాయించాలి
అంటూ ప్రధానమంత్రిని సిఎం జగన్ కోరారు
అనంతరం కేంద్ర ఆర్ధిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ తో జగన్ సమావేశమయ్యారు.
Also Read : ఏసీబీ మొబైల్ యాప్ ప్రారంభించిన సిఎం జగన్