Thursday, April 25, 2024
HomeTrending Newsక్రీడా విజేతలతో సిఎం లంచ్ మీటింగ్

క్రీడా విజేతలతో సిఎం లంచ్ మీటింగ్

KCR Boxing: విశ్వ క్రీడా వేదికల మీద ఘన విజయాలతో స్వర్ణ పతకాలు సాధించి, తెలంగాణ కీర్తిని ప్రపంచానికి చాటిన బాక్సర్ నిఖత్ జరీన్, షూటర్ ఇషా సింగ్ లను రాష్ట్రావతరణ దినోత్సవం సందర్భంగా సిఎం కెసిఆర్ ప్రగతి భవన్ లో ఘనంగా సన్మానించి, ఆతిధ్యం ఇచ్చారు. అంతకుముందు పబ్లిక్ గార్డెన్ లో జరిగిన వేడుకల్లో ఘనంగా సన్మానించి, చెరో రూ.2 కోట్ల నగదు బహుమతిని అందించారు. అనంతరం సిఎం కెసిఆర్ వారిని వారి తల్లిదండ్రులను ప్రగతి భవన్ కు ఆహ్వానించి ఆతిద్యం ఇచ్చారు. మధ్యాహ్నం వారితో కలిసి భోజనం చేసారు. ఈ సందర్భంగా సిఎం కేసీఆర్ వారితో కాసేపు ముచ్చటించారు.

బాక్సింగ్ క్రీడపట్ల చిన్నతనం నుంచే మక్కువ చూపించడానికి గల కారణాలను, తాను గోల్డ్ మెడల్ సాధించడానికి పడిన శ్రమను నిఖత్ జరీన్ ను సిఎం అడిగి తెలుసుకున్నారు. స్వయంగా క్రీడాకారుడైన తన తండ్రి జమీల్ అహ్మద్ తనకు బాల్యం నుంచే అందించిన ప్రేరణ గురించి ప్రోత్సాహం గురించి నిఖత్ సిఎం కు వివరించారు. తాను బాక్సింగ్ లో శిక్షణ పొందేందుకు తెలంగాణ ప్రభుత్వం అందించిన ప్రోత్సాహం, చేసిన ఆర్థిక సాయం తనలో ఎంతో ఆత్మస్థైర్యాన్ని నింపిందని నిఖత్ జరీన్ సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కీలక సయంలో అన్ని విధాలా సాయం అందించినందుకు సిఎం కెసిఆర్ కు నిఖత్ జరీన్ ధన్యవాదాలు తెలిపారు.

నిఖత్ పట్టుదలను ఆత్మస్థైర్యాన్ని సిఎం కెసిఆర్ అభినందించారు. తెలంగాణ క్రీడాకారులకు తాను ఎల్లవేళలా అండగా వుంటానని, క్రీడారంగాన్ని ప్రోత్సహించి, రేపటి తరాలను శారీకంగా మానసికంగా ధృఢంగా తీర్చిదిద్దడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమన్నారు. పుట్టిన తెలంగాణ గడ్డకు కీర్తి ప్రతిష్టలు తెచ్చేలా, నిఖత్ జరీన్ ఇషా సింగ్ లను చూసి తెలంగాణ యువతీ యువకులు స్పూర్తి పొందాలని సిఎం కెసిఆర్ పిలుపునిచ్చారు.

గత 2014 స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో తనకు నగదు బహుమతిగా 50 లక్షల రూపాయల చెక్కును అందిస్తూ, తన అభ్యర్థన మేరకు బాక్సింగ్ ఫోజిచ్చిన గతాన్ని నిఖత్ జరీన్ సిఎం కెసిఆర్ కు గుర్తుచేసింది. ‘ సార్ నీను మీరిచ్చిన స్పూర్తితోనే ఇంతటి విజయాన్ని సాధించాను. నేను విజయంతో తిరిగి వచ్చినందుకు మరోసారి ఆనాటి మాదిరి బాక్సింగ్ పిడికిలి బిగించండి..’ అని నిఖత్ జరీన్ సిఎం ను మరోసారి కోరింది. పట్టుబట్టి విశ్వ విజేతగా నిలిచిన నిఖత్ జరీన్ పట్టుదలను, బాక్సింగ్ బరిలో ఆమె చూపిన ప్రతిభను మెచ్చుకున్న సిఎం కెసిఆర్ నిఖత్ కోరిక మేరకు ఆమెతో కలిసి బాక్సింగ్ పిడికిలి బిగించి చిరునవ్వుతో అనుకరించారు. ఈ సందర్భంగా అక్కడ నవ్వులు వెల్లి విరిసాయి.తన అభ్యర్థనను మన్నించినందుకు సిఎం కెసిఆర్ కు నిఖత్ ధన్యవాదాలు తెలిపింది.

తమ బిడ్డను ప్రోత్సహించి గోల్డ్ మెడల్ సాధించేందుకు దోహదపడడమే కాకుండా రూ. 2 కోట్ల నగదు బహుమతిని అందించి, విలువైన నివాస స్థలాన్ని ఇస్తున్నందుకు నిఖత్ జరీన్ తలిదండ్రులు జమీల్ అహ్మద్, పర్వీన్ సుల్తానా లు సిఎం కెసిఆర్ కు ధన్యవాదాలు తెలిపారు.

అదే సందర్భంలో… జూనియర్ ప్రపంచ కప్ షూటింగ్ పోటీల్లో స్వర్ణ పథాకాన్ని సాధించిన ఇషా తో కూడా సిఎం కెసిఆర్ ముచ్చటించారు. చిన్నతనంలోనే షూటింగ్ క్రీడలో అత్యంత ప్రతిభ కనబరిచిన ఇషాను అభినందించారు. తమ బిడ్డను గొప్ప క్రీడాకారిణిగా తీర్చి దిద్దిన ఇషా తల్లిదండ్రులు సచిన్ సింగ్, శ్రీలతను సిఎం కెసిఆర్ మెచ్చుకున్నారు.
దాదాపు గంట పాటు క్రీడాకారులు వారి కుటుంబ సభ్యులకు ప్రేమపూర్వక ఆథిధ్యమిచ్చి, ఘనంగా సన్మానించిన సిఎం కెసిఆర్ శోభ దంపతులు, వారికి గౌరవ ప్రదమైన వీడ్కోలు పలికారు.

ఈ సందర్భంగా క్రీడలు సాంస్కృతిక శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్, ఎంపీ సంతోష్ కుమార్, ఎమ్మెల్సీ మధుసూధనాచారి, ఎమ్మల్యే గణేశ్ గుప్తా, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, సిఎం కార్యదర్శి భూపాల్ రెడ్డి, ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా తదితరులు పాల్గొన్నారు.

Also Read : నిఖత్, ఈషాలకు తెలంగాణా ప్రభుత్వ నజరానా 

RELATED ARTICLES

Most Popular

న్యూస్