దుర్గమ్మ తల్లి సాక్షిగా నాడుఅమరావతిని రాజధానిగా సంకల్పించామని, అన్ని పవిత్ర స్థలాల నుంచి నీరు, మట్టి తీసుకువచ్చి అందరినీ భాగస్వాములను చేసి అమరావతి నిర్మాణం ప్రారంభించామని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. విజయ దశమి సందర్భంగా తన సతీమణి భువనేశ్వరితో కలిసి ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకున్నారు. అర్చకులు, ఈవో భ్రమరాంబ ఆలయ మర్యాదలతో చంద్రబాబు దంపతులకు స్వాగతం పలికారు. దర్శనం అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. నాడు అన్ని రాజకీయ పార్టీలు రాజధానిగా అమరావతికి ఆమోదం తెలిపాయని అన్నారు. వైసీపీ నేతలు కూడా తాము ఇక్కడే ఇళ్ళు కట్టుకున్నామని, ఇదే రాజధాని అని నాడు చెప్పలేదా అని ప్రశ్నించారు. రాజధాని అమరావతిపై రోజుకో మాట మాట్లాడడం మంచిది కాదని, అలాంటి వాళ్ళను దుర్గమ్మ తల్లి క్షమించదని చంద్రబాబు నాయుడు అన్నారు.
ప్రజలు అందరినీ దుర్గమ్మ చల్లగా చూడాలని పూజలు చేశామన్నారు. భక్తులు నవరాత్రులు ఎంతో నిష్ఠతో పూజలు చేసి కానుకలు సమర్పిస్తారని, అందరినీ దుర్గమ్మ కరుణించాలని అన్నారు. తమ హాయంలో 150 కోట్లు ఖర్చు పెట్టి ఇంద్రకీలాద్రి పై ఎన్నో అభివృద్ధి పనులు చేశామని అన్నారు. ఆ అభివృద్ధి పనులను కొనసాగించాలని సూచించారు. దసరా రోజు చేపట్టిన ప్రతి కార్యక్రమం విజయవంతం అవుతుందన్న చంద్రబాబు గారు, ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు తెలిపారు.