Anganwadi Supervisor Posts : అంగన్వాడీల్లో పిల్లలకు ఇచ్చే ఆహారంలో క్వాలిటీ, కచ్చితమైన క్వాంటిటీ ఉండాలని, ప్రతిరోజూ నిర్దేశించుకున్న ప్రమాణాల ప్రకారం ఆహారం అందుతుందా? లేదా? అన్నదానిపై నిరంతర పర్యవేక్షణ చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారు. దీనికోసమే దశాబ్దకాలంగా పెండింగ్లో ఉన్న సూపర్వైజర్ల నియామకాలను ప్రారంభించామని, దురదృష్టవశాత్తూ కొందరు కోర్టుల ద్వారా అడ్డుకునే ప్రయత్నంచేశారని.. వీలైనంత త్వరగా ఈ పోస్టులని భర్తీన చేయాలని సూచించారు. మహిళా, శిశు సంక్షేమశాఖపై క్యాంపు కార్యాలయంలో సిఎం జగన్ సమీక్ష నిర్వహించారు. బాలింతలు, గర్భవతుల్లో రక్తహీనత, చిన్నారుల్లో పౌష్టికాహారలోపం నివారించడానికి ప్రభుత్వం చేపట్టిన చర్యల అమలుపై సిఎం ఆరా తీశారు.
డిసెంబర్1 నుంచి పౌష్టికాహారం, గుడ్ల పంపిణీపై బాధ్యతలను మార్క్ఫెడ్ చేపట్టనుంది. దీన్ని ప్రత్యేక యాప్ ద్వారా పర్యవేక్షిస్తారు. ఆహార నాణ్యత బాగుందా? లేదా? అన్నదానిపై కేంద్ర ప్రభుత్వ సంస్థతో థర్డ్ పార్టీ పర్యవేక్షణ చేయించనుంది రాష్ట్ర ప్రభుత్వం. అంగన్వాడీలకు, సూపర్వైజర్లకు మొత్తంగా దాదాపు 57వేలమందికి సెల్ఫోన్ల్ పంపిణీ కార్యక్రమాన్ని సిఎం ప్రారంభించారు. గర్భిణీలు, బాలింతలు, 6 సంవత్సరాల లోపు పిల్లలకు అందించే పౌష్టిహారం, ఇతర సేవలను మరింత సమర్ధవంతంగా అమలు చేయడంతో పాటు, సమగ్రపర్యవేక్షణ కోసం అంగన్వాడీ సెంటర్లకు, వర్కింగ్ సూపర్ వైజర్లకు ఈ సెల్ఫోన్స్ ప్రభుత్వం అందిస్తోంది.
సమీక్ష సందర్భంగా సీఎం పలు సూచనలు చేస్తూ…
అంగన్వాడీల్లో టాయిలెట్ల పరిశుభ్రతపైనా దృష్టిపెట్టాలి
అద్దె భవనాల్లో నడుస్తున్న అంగన్వాడీల్లో కూడా కనీస మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి
- అంగన్వాడీల్లో నాడు – నేడు ద్వారా సమగ్రాభివృద్ధి చేయాలి
- పాఠశాల విద్యాశాఖతో కలిసి ఈమేరకు కార్యాచరణ చేసుకోవాలి
- అంగన్వాడీల రూపురేఖలను సంపూర్ణంగా మార్చాలి
- అంగన్వాడీల్లో ప్రస్తుత పరిస్థితులు ఏంటి? ఎలాంటి సదుపాయాలు కల్పించుకోవాలి? ఏ రకంగా వాటిని తీర్చిదిద్దాలి? తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని ప్రణాళిక తయారు చేసుకోవాలి
- పిల్లలకు ఇచ్చే ఆహారం పాడవకుండా చూసేందుకు ఎలాంటి విధానాలు అనుసరించాలన్నదానిపై కూడా దృష్టిపెట్టాలి
- పిల్లలు రోజూ తీసుకునే పాలు, గుడ్లులాంటివి పాడవకుండా నిల్వచేసే విధానాలపైనా కూడా దృష్టిపెట్టాలి
- అంగన్వాడీల్లో ప్రతిచోటా ఫ్రిడ్జ్ ఏర్పాటు దిశగా ఆలోచన చేయాలి
- అంగన్వాడీల పిల్లల ఆరోగ్య పరిస్థితులపై విలేజి క్లినిక్స్ ద్వారా, ఆశా వర్కర్ల ద్వారా వైద్యాధికారులు పర్యవేక్షణ చేయాలి
- సచివాలయంలోని వెల్ఫేర్ అసిస్టెంట్ కూడా ఇందులో భాగస్వామ్యం కావాలి
- శారీరకంగా బలహీనంగా ఉన్న పిల్లలకు వైద్య సహాయమే కాకుండా, ఆ పిల్లలకు పౌష్టికాహారం మరింత పెంచేలా తగిన ఆలోచనలు చేయాలి
- దీనివల్ల రక్తహీనత, శారీరక బలహీనతలను మొదటి దశలోనే నివారించే అవకాశం ఉంటుంది
- అంగన్వాడీలపై సూపర్వైజర్ల పర్యవేక్షణ జియోట్యాగింగ్ చేయాలి.
- సుస్థిర ప్రగతి లక్ష్యాల్లో దేశంలోనే నంబర్వన్గా నిలవాలి
- గతంలో పిల్లల భోజనానికి నెలకు సుమారురూ.500 కోట్లు ఉండేది, ఈరోజు నెలకు సుమారుగా రూ.1900 కోట్లు ఖర్చుచేస్తున్నాం
- విద్య, వైద్యం, వ్యవసాయం, మహిళా శిశు సంక్షేమాలకోసం చాలా పెద్ద ఎఫర్ట్ పెడుతున్నాం
- ఇంగ్లిషు మీడియంను చిన్ననాటినుంచే అలవాటు చేయడానికి ఫౌండేషన్ స్కూల్స్, శాటిలైట్ పౌండేషన్ స్కూల్స్ తీసుకువచ్చాం
- నాడు – నేడు ద్వారా పూర్తిగా రూపురేఖలు మారుస్తున్నాం
- ఇన్నివేల కోట్లు ఖర్చుచేసి అనేక విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్నాం
- ఇన్ని కార్యక్రమాలు చేసినా..సరైన పర్యవేక్షణ లేకపోతే ప్రయోజనం ఉండదు
- అందుకే కచ్చితమైన పర్యవేక్షణ అవసరం
- అధికారులు కూడా సరైన సమయంలో స్పందించి తగిన చర్యలు తీసుకోవాలి
- దేశంలో నంబర్వన్ కావడానికి మనం ప్రయత్నాలు చేస్తున్నాం
ఈ సమీక్షా సమావేశంలో మహిళాశిశు సంక్షేమశాఖ మంత్రి కె వి ఉషశ్రీచరణ్, మహిళా శిశు సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర, ఆర్ధికశాఖ కార్యదర్శి కె వి వి సత్యనారాయణ, ఏపీడీడీసీఎఫ్ ఎండీ ఎ బాబు, మార్క్ఫెడ్ ఎండీ పి ఎస్ ప్రద్యుమ్న, మహిళా శిశు సంక్షేమశాఖ డైరెక్టర్ డాక్టర్ ఎ సిరి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Also Read : మన తపన ప్రజల్లోకి తీసుకెళ్ళండి : జగన్