Friday, October 18, 2024
HomeTrending Newsమరోసారి పెరిగిన కొత్త కేసులు

మరోసారి పెరిగిన కొత్త కేసులు

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. మంగళవారం 19,15,501 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 38,792 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. క్రితంరోజు కంటే 23 శాతం పెరుగుదల కనిపించింది. దాంతో మొత్తం కేసులు 3.09కోట్లకు చేరాయి. నిన్న మరో 624 మంది మహమ్మారికి బలయ్యారు. ఇప్పటివరకు 4,11,408 మంది ప్రాణాలు కోల్పోయినట్లు బుధవారం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతం 4,29,946 మంది కొవిడ్‌తో బాధపడుతున్నారు. క్రియాశీల రేటు 1.39 శాతానికి తగ్గింది. నిన్న 41వేల మంది వైరస్‌ నుంచి కోలుకున్నారు. మొత్తం రికవరీలు 3,01,04,720(97.28 శాతం)కి చేరాయి. ఇక నిన్న 37.14 లక్షల మంది టీకా వేయించుకున్నారు. మొత్తంగా పంపిణీ అయిన డోసులు 38.76 కోట్లకు చేరాయి.
కేరళలో రెండు రోజుల లాక్‌డౌన్‌
దేశవ్యాప్తంగా నమోదవుతోన్న కొత్త కేసుల్లో కేరళ, మహారాష్ట్రదే సగానికి పైగా వాటా ఉంది. ఈ ఉద్ధృతికి అడ్డుకట్ట వేసేందుకు కేరళ ప్రభుత్వం మరోసారి లాక్‌డౌన్‌ వైపు మొగ్గుచూపింది. జులై 17, 18న పూర్తిస్థాయి లాక్‌డౌన్ విధిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం కేరళలో 14వేలకు పైగా కేసులు వెలుగుచూడగా.. మహారాష్ట్రలో ఆ సంఖ్య ఏడువేలకు పైనే ఉంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్