పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి నేతృత్వంలోని పాకిస్తాన్ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ పార్టీల ఎంపిల మూకుమ్మడి రాజీనామాలను జాతీయ అసెంబ్లీ స్పీకర్ రజ పర్వేజ్ అష్రఫ్ తిరస్కరించారు. రాజీనామాలపై స్పందించిన స్పీకర్ రజ పర్వేజ్…పిటిఐ సభ్యులతో వ్యక్తిగతంగా మాట్లాడిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. పాకిస్తాన్లో సత్వరమే సార్వత్రిక ఎన్నికలు నిర్వహించాలని పిటిఐ పార్లమెంటు సభ్యులు రాజీనామా అస్త్రం సంధించారు.
మరోవైపు పాకిస్థాన్-ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సరిహద్దుల్లో పది వేల మంది ఉగ్రవాదులు కాసుకూర్చున్నారని పాక్ హోంమంత్రి రాణా సనావుల్లా తాజాగా వెల్లడించారు. ఇటీవల డాన్ న్యూస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ‘పాకిస్థాన్-ఆప్ఘనిస్థాన్ సరిహద్దులోని ఖైబర్ ఫఖ్తుంఖ్వా రాష్ట్రంలో సుమారు 7 వేల నుంచి 10 వేల మంది వరకు తెహ్రీక్ ఎ తాలిబన్ పాకిస్థాన్ (టీటీపీ) ఉగ్రవాదులు ఉన్నారు. వారితోపాటు వారి కుటుంబ సభ్యులు మరో 25 వేల మంది అక్కడే ఉన్నారు. నవంబరు నుంచి టీటీపీ ఉగ్రవాదులు దాడులకు తెగబడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం, ఉగ్రవాద వ్యతిరేక దళ విభాగం వైఫల్యమే ఇందుకు కారణం’ అని రాణా సనావుల్లా ఆరోపించారు. కాగా, పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పాకిస్థాన్ తెహ్రీక్ ఎ ఇన్సాఫ్ పార్టీ ఆ రాష్ట్రంలో అధికారంలో ఉండడం గమనార్హం.
అటు పిటిఐ ఎంపిల రాజీనామాలు…పాక్ -ఆఫ్ఘన్ సరిహద్దుల్లో ఉగ్రవాదుల కదలికలు పాకిస్తాన్ ప్రభుత్వానికి కునుకు లేకుండా చేస్తున్నాయి. రెండు అంశాలతో అంతర్జాతీయ స్థాయిలో దేశ ప్రతిష్ట మసకబారుతోంది. ఇప్పటికే ప్రపంచ దేశాలు పాకిస్తాన్ లో అప్ర్యతనాలు మానుకోవాలని సూచిస్తున్నాయి.