Friday, October 18, 2024
HomeTrending NewsCheruvula Panduga: సంక్షేమ ఫలాలు అందని ఇల్లు లేదు - ఎమ్మెల్సీ కవిత

Cheruvula Panduga: సంక్షేమ ఫలాలు అందని ఇల్లు లేదు – ఎమ్మెల్సీ కవిత

తెలంగాణలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి ఫలాలు అందని ఇల్లే లేదని టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. ఏం చేశారని సంబరాలు జరుపుకుంటున్నారని ప్రశ్నిస్తున్న కాంగ్రెస్ నేతలు ఇంటింటికి తిరిగి ఫలాలు ఎలా అందుతున్నాయో చూడాలని సవాల్ విసిరారు. మంచి పనులు చేయడంలో దేశానికి తెలంగాణ ఉదాహరణగా నిలిచిందని తెలిపారు. మిషన్ కాకతీయ పథకాన్ని కాపీ కొట్టిన కేంద్ర ప్రభుత్వం అమృత్ సరోవర్ పేరిట అమలు చేస్తున్న కార్యక్రమం విఫలమైందని, ఆ కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడం కారణంగా దేశంలో చెరువులు బాగవ్వడం లేదని విమర్శించారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవంలో భాగంగా నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గంలోని ఎడపల్లిలో జరిగిన చెరువుల పండుగలో స్థానిక ఎమ్మెల్యే షకీల్ తో కలిసి కవిత పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ…

కాకతీయులు నిర్మించిన గొలుసుకట్టు చెరువులను రక్షించాలన్నది ప్రభుత్వ ఉద్ధేశమని, అవి ఎప్పటికీ ఎండిపోవద్దన్నది సీఎం కేసీఆర్ లక్ష్యమన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కింద దాదాపు 20 వేల చెరువులను నింపుతున్నామని, కాబట్టి ఎండకాలంలోనూ రాష్ట్రంలో చెరువుల ఎండిపోవడం లేదని స్పష్టం చేశారు. ఉమ్మడి పాలనలో తెలంగాణలో ప్రాంతంలోని నీటి వనరులను కొల్లగొట్టారని చెప్పారు. దాని వల్ల మనం ఆగమైనందునే ఇవాళ చెరువులను మంచిగ చేసుకుంటున్నామన్నారు. చెరవులు బాగుచేసుకున్న తర్వాత రాష్ట్ర ప్రభుత్వం వాటిల్లో చేప పిల్లలను వేస్తున్నదని, దాంతో రాష్ట్రవ్యాప్తంగా నాలుగు లక్షల మందికి ఉపాధి లభిస్తోందని వివరించారు. ఏదైనా ఒక్క మంచిపని జరిగితే దాని ఫలితాలు ప్రతి ఒక్కరికి అందుతాయన్నారు.

10 సంవత్సరాల క్రితం సాగునీటి శాఖ మంత్రిగా ఉన్న సుదర్శన్ రెడ్డి కనీసం ఆయన సొంత గ్రామంలో కూడా 20 – 30 మందికి పెన్షన్ ఇప్పించుకోలేదని ఆరోపించారు. పెన్షన్ వస్తున్న ఎవరైనా మరణిస్తేనే ఆ స్థానంలో కొత్త వాళ్లకు పెన్షన్ ను మంజూరు చేసేవారని తెలిపారు. అటువంటి పరిస్థితిలో దుఖంతో మనం తెలంగాణను తెచ్చుకున్నామన్నారు. కానీ ఈ రోజు ఊరిలో ఎంత మంది దరఖాస్తు చేస్తే అంత మందికి పెన్షన్ వస్తోందని, బీడీ కార్మికులకు కటాఫ్ డేట్ ను సడలించి మరీ పెన్షన్ ఇచ్చామని తెలిపారు. అధికారంలో సీఎం కేసీఆర్ ఉన్నారు కాబట్టి చివరిగా ఉన్న వాళ్ల వరకు ఫలాలు అందుతాయని చెప్పారు.

10 ఏళ్ల తెలంగాణలో ఒక్కొమెట్టు ఎక్కుతూ పైకి వస్తున్నామని, మొదటి ఐదేళ్లలో చెరువుల్లో పూడికలు తీసుకున్నామని, చెక్ డ్యాములు నిర్మించుకోవడమే కాకుండా కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించుకున్నామని, పెన్షన్లు ఇచ్చుకున్నామని వివరించారు. ఇళ్ల స్థలాలు ఉన్నవారికి ఇళ్లు నిర్మించుకోడానికి రూ. 3 లక్షల చొప్పున ఇచ్చే కార్యక్రమానికి త్వరలోనే శ్రీకారం చుట్టనున్నామని వెల్లడించారు. దాని పేరు గృహ లక్ష్మి పథమని స్పష్టం చేశారు. ఇంటి స్థలం లేని వారికి ప్రభుత్వ స్థలాన్ని గుర్తించి ప్లాట్లు చేసి ఇచ్చే ప్రయత్నం స్థానిక ఎమ్మెల్యే షకీల్ చేస్తున్నారని చెప్పారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్