Saturday, September 21, 2024
Homeసినిమామట్టి నుంచి పుట్టిన సినిమా ‘భీమదేవరపల్లి బ్రాంచి’: తమ్మారెడ్డి భరద్వాజ

మట్టి నుంచి పుట్టిన సినిమా ‘భీమదేవరపల్లి బ్రాంచి’: తమ్మారెడ్డి భరద్వాజ

ఎ.బి. సినిమాస్‌, నిహాల్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్స్‌ పై రమేష్‌ చెప్పాల రచన-దర్శకత్వంలో డాక్టర్‌ బత్తిని కీర్తి లత గౌడ్‌, రాజా నరేందర్‌ చెట్లపెల్లి  నిర్మించిన చిత్రం భీమదేవరపల్లి బ్రాంచి. ఈ చిత్రంలో బలగం ఫేమ్‌ సుధాకర్‌ రెడ్డి, అంజి వల్గమాన్‌, సాయి ప్రసన్న, అభి, రూప ప్రధాన పాత్రలలో నటించారు. గ్రామీణ నేపథ్యంలో అత్యంత సహజమైన పాత్రలతో నవ్విస్తూనే భావోద్వేగానికి గురి చేసేలా రూపొందిన ఈ చిత్రం ఈనెల 23న విడుదలైంది. తొలి ఆట నుంచే ఆర్గానిక్‌ హిట్‌ టాక్‌ను సొంతం చేసుకుని విజయవంతంగా ప్రదర్శితమౌతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని ప్రసాద్‌ ల్యాబ్‌లో సినిమా సక్సెస్‌ మీట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ బీసీ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు ప్రముఖ దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ పాల్గొన్నారు.

తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ “నిజంగానే మట్టి నుంచి పుట్టిన సినిమా ‘భీమదేవరపల్లి బ్రాంచి’. ప్రజల జీవన విధానాలను, వారిలోని ఎమోషన్స్‌ను బేస్‌ చేసుకుని చక్కని కథను తయారు చేసుకుంటే సక్సెస్‌ ఖచ్చితంగా వస్తుంది అని మరోసారి నిరూపించిన అద్భుతమైన సినిమా ఇది. ఇటీవలే తెలంగాణ గ్రామీణ జీవితాల్ని ప్రతిభింబిస్తూ వచ్చిన ‘బలగం’ను ప్రేక్షకులు ఎంతగా ఆదరించారో అందరికీ తెలిసిందే. ఈ సినిమా విషయంలో కూడా నా దగ్గర చాలా మంది పాజిటివ్‌గా మాట్లాడారు. రియాల్టీకి దగ్గరగా ఉండే కథలు ఎక్కువగా కన్నడ, మలయాళంలోనే వస్తుంటాయి.

ఈ సినిమా చూస్తున్నంత సేపు నాకు ఇది మన తెలుగు సినిమానేనా అనే అనుమానం కలిగింది. అంత సహజత్వంతో కూడుకుని ఉంది. మంచి కథ, నటీనటులు, టెక్నీషియన్స్‌ దొరికితే తప్పకుండా విజయం వరిస్తుంది. రాజకీయ పార్టీలు ప్రజలను ఏ విధంగా మోసం చేస్తున్నాయి అనే విషయాన్ని ఇంత నిక్కచ్చిగా చెప్పడం అంటే ఆ దర్శక, నిర్మాతలకు చాలా ధైర్యం కావాలి. మేం అయితే ఈ సినిమా చేసేవాళ్లం కాదు. కానీ నిర్మాతలు డాక్టర్‌ బత్తిని కీర్తిలత గౌడ్‌, రాజా నరేందర్‌ చెట్లపెల్లి, దర్శకుడు రమేష్‌ చెప్పాల ఎంతో ధైర్యంతో ఈ సినిమా తీసి సక్సెస్‌ కొట్టారు. ఇందులో నటించిన అందరూ నిజంగా చెప్పాలంటే జీవించారు. ఇలాంటి సినిమాలు ప్రేక్షకులు ఆదరించాలి” అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్